సందర్భం వచ్చిన ప్రతీసారి తన భర్త ముస్తఫా రాజ్ ను పొగడ్తలతో ముంచెత్తుతుంది ప్రియమణి. ఆయన చాలా సపోర్టివ్ గా ఉంటారని.. ఆయన కారణంగానే తన కెరీర్ ను కంటిన్యూ చేయగలుగుతున్నానని.. ఆయన తన లైఫ్ లోకి వచ్చిన తరువాత నటిగా మరింత బిజీ అయినట్లు చెబుతుంటుంది ప్రియమణి. అలాంటిది అసలు వీరి పెళ్లే చెల్లదని ముస్తఫా రాజ్ మొదటి భార్య ఆరోపణలు చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. 





ప్రియమణితో పెళ్లయ్యేనాటికి ముస్తఫా రాజ్ కు భార్య ఉంది. ఆమె పేరు ఆయేషా. 2010లో ముస్తఫా ఆమెని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు. కానీ వీరి మధ్య విభేదాలు రావడంతో ఇద్దరూ విడిపోయారు. కొన్నేళ్ల తరువాత ముస్తఫా రాజ్ 2017లో నటి ప్రియమణిని పెళ్లి చేసుకున్నారు. రెండో పెళ్లి తరువాత తన మొదటి భార్య, పిల్లల కోసం ప్రతి నెలా డబ్బు పంపిస్తున్నాడు ముస్తఫా.



ఇప్పుడు తనను, తన పిల్లలను ముస్తఫా రాజ్ పట్టించుకోవడం లేదని అయేషా మీడియా ముందుకు వచ్చింది. దీంతో ఈ ఆరోపణలు ముస్తఫా రాజ్ ఖండించాడు. ఈ ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని.. పిల్లల పెంపకం కోసం కావాల్సినంత డబ్బు అయేషాకు ఎప్పటికప్పుడు పంపిస్తున్నానని.. కానీ ఆమె మరింత డబ్బుని లాక్కోవాలని చూస్తోందని.. పైగా హింసించినట్లు మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు. 



అంతగా హింసిస్తే ఇంతకాలం ఎందుకు నోరు మెదపలేదని ప్రశ్నించాడు ముస్తఫా. మరోపక్క అయేషా మాత్రం ముస్తఫా రాజ్ తనకు మాజీ భర్త కాదని.. ఇప్పటికీ ఆయన తన భర్తే అని పేర్కొంది. అతడు తనకు తాళి కట్టిన భర్త అని.. ప్రియమణితో అతడి వివాహం చెల్లదని.. ఎందుకంటే ప్రియమణిని పెళ్లి చేసుకునే నాటికి కనీసం మేం విడాకుల కోసం దరఖాస్తు కూడా చేయలేదని కాబట్టి ప్రియమణితో పెళ్లి చెల్లదని కామెంట్స్ చేసింది. 



ఇద్దరు పిల్లల తల్లిగా మీరు నా స్థానంలో ఉంటే ఏం చేస్తారో చెప్పండి అంటూ మీడియా ముందు ప్రశ్నించింది. తాజాగా ఈ వ్యవహారంపై ప్రియమణి స్పందించింది. ముస్తఫారాజ్‌తో తన వైవాహిక‌ జీవితం ఎంతో ఆనందంగా కొనసాగుతోందని ప్రియమణి చెప్పింది. ముస్తఫాకు తనంటే ఎంతో ఇష్టమని ఆమె పేర్కొంది. ఏ ఇద్ద‌రి మ‌ధ్య అయినా బంధం బ‌ల‌ప‌డాలంటే.. వాళ్లిద్ద‌రూ ప‌ర‌స్ప‌రం ప్రేమ‌గా మాట్లాడుకోవాల‌ని.. ముస్తఫాతో నా బంధం మరింత ధృడంగా మారడానికి కారణం.. ఒక‌రికొక‌రం మాట్లాడుకునేందుకు, అభిప్రాయాల‌ను పంచుకోడానికి కొంత స‌మ‌యం కేటాయించ‌డం అని ఆమె చెప్పుకొచ్చింది. వ్యాపారపనుల నిమిత్తం ఇటీవల ముస్తఫా అమెరికా వెళ్లారని చెప్పింది. ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ప్రతిరోజూ సాయంత్రం త‌న‌కు వీడియో కాల్‌ చేసి మాట్లాడతారని చెప్పుకొచ్చింది. ఎవరెన్ని ఆరోపణలు చేసినా.. త‌మ‌ మధ్య అనుబంధం ఎప్పటికీ చెరిగిపోద‌ని ప్రియమణి ధీమాగా చెప్పింది. 


ఇటీవలే ఆమె నటించిన 'ది ఫ్యామిలీ మ్యాన్ 2' వెబ్ సిరీస్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఆమె నటించిన 'నారప్ప' సినిమా అమెజాన్ ప్రైమ్ లో విడుదలై హిట్ టాక్ తెచ్చుకుంది. ప్రస్తుతం ఈ బ్యూటీ వెబ్ సిరీస్ లు, టీవీ షోలు, సినిమాలంటూ చాలా బిజీగా గడుపుతోంది.