'తెలుగు ఇండియన్ ఐడల్'ను ప్రారంభిస్తున్నట్లు ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం ఆహా అధికారికంగా ప్రకటించింది. ఈ షోకు 'బిగ్ బాస్ 5' కంటెస్టెంట్, ఇండియన్ ఐడల్ విన్నర్ శ్రీరామచంద్రను హోస్ట్‌గా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమానికి సంగీత దర్శకులు తమన్, కార్తిక్‌‌తోపాటు నటి, గాయని నిత్యా మీనన్‌లు జడ్జ్‌గా వ్యవహరించనున్నారు. ఇక ఈ షో ఫిబ్రవరి 25 నుంచి ప్రతి శుక్రవారం, శనివారం రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్ కానుందని ప్రకటించారు. 


తాజాగా ఫస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమోను విడుదల చేశారు. 'వేలాది కలలు, విభిన్న స్వరాలు.. ఒక్క వేదిక, ఒక్క విజేత' అనే క్యాప్షన్ తో వీడియోను షేర్ చేశారు. ఈ ప్రోమో చాలా ఫన్నీగా ఉంది. కొందరు వాయిస్ కి తమన్ ఫిదా అయిపోయారు. ఇక స్టేజ్ పైకి వచ్చిన ఓ వ్యక్తి.. నిత్యామీనన్ కి పెద్ద ఫ్యాన్ అని ఆమెతో ఓ స్టెప్ వేయాలనుందని కోరాడు.డ్ దానికి నిత్యా నవ్వేసింది. ఇక మరో కంటెస్టెంట్ 'పుష్ప' గెటప్ లో స్టేజ్ పైకి రాగా.. ఆ సినిమాలో 'తగ్గేదేలే' డైలాగ్ చెప్పి ఆకట్టుకుంది నిత్యామీనన్. 


శ్రీరామచంద్ర వేసుకున్న షర్ట్ పై తమన్ వేసిన కామెంట్స్ హైలైట్ గా నిలిచాయి. ఇక మరో అమ్మాయి.. కార్తీక్ కి పెద్ద అభిమానినంటూ అతడికోసం వేసిన పెన్సిల్ స్కెచ్ ని తీసుకొచ్చి ఇచ్చింది. కార్తీక్ తనను హత్తుకోగానే ఎమోషనల్ అయి ఏడ్చేసింది. హిందీలో పన్నెండు సీజన్లు కంప్లీట్‌ చేసుకున్న ఇండియన్ ఐడల్ షో ఇప్పటి వరకు తెలుగులోకి రాలేదు. తెలుగు సింగింగ్‌ టాలెంట్‌ను ప్రపంచానికి పరిచయం చేసే ఉద్దేశంతోనే ఆహా ఈ సరికొత్త రియాలిటీ షోను ప్లాన్ చేశారు.