గుండెపోటుతో కన్నుమూసిన నటుడు నందమూరి తారకరత్న(40) పార్దివదేహాన్ని హైదరాబాద్ లోని ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహం నుంచి కాసేపటి భౌతికకాయాన్ని తీసుకొచ్చారు. తారకరత్న తల్లిదండ్రులు మోహన్ కృష్ణ, సీతతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు ఫిలిం చాంబర్‌కు చేరుకుని ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు. పలువురు సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు, అభిమానులు, ప్రజలు తారకరత్నకు నివాళుల్పించనున్నారు. అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని ఫిలిం ఛాంబర్‌లో ఉంచారు. సాయంత్రం జూబ్లీహిల్స్ మహాప్రస్థానంలో  తారకరత్న అంత్యక్రియలు నిర్వహించనున్నారు.


శనివారం రాత్రి తారకరత్న కన్నుమూత


నందమూరి తారకరత్నశనివారం(ఫిబ్రవరి 18) రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయారు. టీడీపీ నేత నారా లోకేశ్‌ చేపట్టిన యువగళం పాదయాత్ర ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు జనవరి 27న కుప్పం వెళ్లిన ఆయన..  గుండెపోటుతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. జనం మధ్యలోనే ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. వెంటనే తారకరత్నను కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం పీఈఎస్‌ మెడికల్‌ కాలేజీ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి మరింత విషమించడంతో అదే రోజు రాత్రి బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రికి తరలించారు. గుండెపోటు వచ్చిన సమయంలో తారకరత్న మెదడుకు దాదాపు అరగంట పాటు రక్తప్రసరణ ఆగిపోవడంతో మెదడులోని కొంతభాగం దెబ్బతిన్నట్లు వైద్యులు గుర్తించారు. ఆయనను కాపాడేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించారు. విదేశీ వైద్య బృందం సైతం ఆయన ప్రాణాలు కాపాడేందుకు శాయాశక్తులా ప్రయత్నించింది. అయినా, కాపాడలేకపోయారు. 23 రోజుల చికిత్స అనంతం శనివారం రాత్రి  తారకరత్న శాశ్వత నిద్రలోకి జారుకున్నారు.


బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్ నుంచి తారకరత్న భౌతికకాయాన్ని రోడ్డు మార్గం ద్వారా రంగారెడ్డి జిల్లా మోకిలలోని ఆయన స్వగృహానికి తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులు, బంధు మిత్రులు, పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు తారకరత్న భౌతికకాయాన్ని సందర్శించారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ  నివాళులు అర్పించారు. ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. కల్మషం ఎరుగని మంచి మనిషి శాశ్వతంగా దూరం అయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 


భర్త మరణాన్ని తట్టుకోలకపోయిన అలేఖ్య


అటు భర్త మరణంతో ఆయన భార్య అలేఖ్య రెడ్డి తట్టుకోలేకపోయింది. గుండెలు అవిసేలా రోదించింది. కుటుంబ సభ్యులు ఆమెను ఓదార్చినా దుఖాన్ని ఆపుకోలేకపోయింది. బిడ్డలతో కలిసి కంటికి ధారగా విలపించింది. దీంతో ఆమె ఆస్వస్థతకు గురయ్యింది. వెంటనే ఆమెను ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు.  అలేఖ్య కొంత మానసిక ఒత్తిడికి లోనైందని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి చెప్పారు. అయితే అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. అమితంగా ప్రేమించిన వ్యక్తిని కోల్పోవడం చిన్న విషయం కాదని, కొంతకాలం ఒడిదుడుకులు ఉంటాయని అన్నారు.  తారకరత్న, అలేఖ్య ఇద్దరు ఓ కామన్ ఫ్రెండ్ ద్వారా  పరిచయమయ్యారు. అది కాస్త ప్రేమగా మారి ఏడడుగుల బంధంతో ఒక్కటయ్యారు.  


Read Also: భుజాలపై మోయలేనంత భారం, ఒత్తిడి! ముఖంలో చెరగని చిరునవ్వు - అదే తారకరత్న అంటే