టాలీవుడ్ మీడియాపై నటి తమన్నా బౌన్సర్లు దాడికి దిగడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అసలు విషయంలోకి వస్తే.. మిల్కీ బ్యూటీ తమన్నా నటించిన 'బబ్లీ బౌన్సర్' అనే సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. మధుర్ బండార్కర్ ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. ఈ సినిమా ప్రెస్ మీట్ ను అన్నపూర్ణ సెవెన్ ఏకర్స్ లో నిర్వహించారు. 


దీనికి టాలీవుడ్ మీడియా మొత్తం ఎటెండ్ అయింది. తమన్నా ఇంటర్వ్యూ అనంతరం ఆమెకి ఫొటోలు తీయాలని వెళ్తోన్న ఫొటోగ్రాఫర్లను తమన్నా బౌన్సర్లు అడ్డుకున్నారు. ఫొటో సెషన్ తమ షెడ్యూల్ లో లేదంటూ వారు వాగ్వాదానికి దిగారు. దీంతో మీడియా సిబ్బందికి, బౌన్సర్లకు మధ్య మాటా మాటా పెరిగింది. బౌన్సర్లు మీడియాపై దాడికి దిగారు. 


ఒక బౌన్సర్ అయితే పక్కనే ఉన్న డస్ట్ బిన్ తీసుకొని విసిరేసే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఇద్దరు కెమెరామెన్ లకు గాయాలైనట్లు తెలుస్తోంది. విషయం తీసుకున్న చిత్రబృందం మీడియాకి సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆ తరువాత కాసేపటికి బౌన్సర్లు మీడియాకు క్షమాపణలు చెప్పారు. ఈ విషయంపై తమన్నా ఇప్పటివరకు స్పందించలేదు. 


ఇక 'బబ్లీ బౌన్సర్' సినిమా విషయానికొస్తే.. బాక్స‌ర్స్ టౌన్ గా గుర్తింపు తెచ్చుకున్న అసోలా ఫ‌తైపూర్ బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను ఇటీవల విడుదల చేశారు. దీనికి ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. బాక్సర్స్ ఊళ్లో లేడీ బాక్సర్ గా తన కంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంటుంది హీరోయిన్. మగ రాయుడిగా బలాదూర్ తిరిగే ఆమెకి చివరకు ఢిల్లీలో లేడీ బౌన్సర్ గా ఉద్యోగం వస్తుంది. అక్కడ ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కొందనేదే సినిమా. 


ఓటీటీలో 'బబ్లీ బౌన్సర్':


'బబ్లీ బౌన్సర్‌' అనే లేడీ ఓరియెంటెడ్ సినిమాతో థియేటర్లలో హిట్ అందుకోవాలని తమన్నా అనుకున్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో థియేట‌ర్ల‌ను స్కిప్ చేయడమే మంచిది అనుకున్నారు దర్శకుడు మ‌ధుర్ భండార్క‌ర్. నేరుగా  ఓటీటీలోనే విడుదల చేయాలని నిర్ణయించారు. బబ్లీ బౌన్సర్ ను సెప్టెంబ‌ర్ 23న డిస్నీప్ల‌స్ హాట్‌స్టార్‌లో రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు. హిందీతో పాటు తెలుగు, త‌మిళ భాష‌ల్లో విడుదలకానున్నట్లు వెల్ల‌డించారు. డ‌బ్బింగ్ కార్య‌క్ర‌మాలు ఇప్పటికే పూర్త‌య్యాయ‌ని తెలిపారు.


కెరీర్ లో తొలిసారిగా ఓ బౌన్సర్ పాత్ర‌లో క‌నిపించ‌డం చాలా ఆనందంగా అనిపిస్తుందని తమన్నా చెప్పింది.  ఓ ఛాలెంజ్ గా తీసుకొని ఈ సినిమాలో నటించినట్లు వెల్లడించింది. మ‌ధుర్ ద‌ర్శ‌క‌త్వంలో తొలి సారిగా న‌టించ‌డం సంతోషంగా ఉందన్నారు. ఫాక్స్ స్టార్ స్టూడియోస్, జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించాయి. తమన్నా మ‌రోవైపు తెలుగులో చిరంజీవి స‌ర‌స‌న భోళాశంక‌ర్ సినిమాలో హీరోయిన్‌గా న‌టిస్తోంది. స‌త్య‌దేవ్‌ తో క‌లిసి గుర్తుందా శీతాకాలం సినిమాలో నటించింది.


Also Read: 'దెబ్బ‌కు థింకింగ్ మారిపోవాలా' - మరోసారి హడావిడి చేయనున్న బాలయ్య!


Also Read: ప్రభాస్ అభిమానులకు నిరాశ తప్పదా?