Sonakshi Sinha Apologised To Manisha Koirala: బాలీవుడ్ దిగ్గజ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ తెరకెక్కించిన తాజా వెబ్ సిరీస్ ‘హీరామండి: ది డైమండ్ బజార్’. రీసెంట్ గా నెట్ ఫ్లిక్స్ వేదికగా అందుబాటులోకి వచ్చిన ఈ సిరీస్ అద్భుత ఆదరణ దక్కించుకుంటోంది. పలువురు సినీ ప్రముఖులు ఈ సిరీస్ పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న బాలీవుడ్ స్టార్ నటి సోనాక్షి సిన్హా ఈ వెబ్ సిరీస్ గురించి కీలక విషయాలు వెల్లడించింది. దర్శకుడు భన్సాలీతో పాటు తన తోటి నటీనటుల గురించి కీలక వ్యాఖ్యలు చేసింది.


మనీషాతో నటించడం నా అదృష్టం- సోనాక్షి సిన్హా


‘హీరామండి’ వెబ్ సిరీస్ లో తనపాటు కలిసి నటించిన మనీషా కొయిరాలాకు క్షమాపణలు చెప్పినట్లు సోనాక్షి సిన్హా వెల్లడించింది. ఈ సిరీస్ లో ఆమెతో దురుసుగా ప్రవర్తించడం పట్ల బాధ కలిగిందని చెప్పింది. “నాకు మనీషా కొయిరాల అంటే చాలా ఇష్టం. ఆమెతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. అయితే, ‘హీరామండి’ వెబ్ సిరీస్ చూసిన తర్వాత ఆమెకు సారీ చెప్పాను. కొన్ని సన్నివేశాలలో ఆమెతో నేను చాలా దురుసుగా వ్యవహరించాను. నేను ఆమెతో అలా ఎలా ప్రవర్తించాను? అనిపించింది. మనీషా నిజంగా గొప్ప నటి. ఆమెతో కలిసి పని చేసే అవకాశం లభించడం నా అదృష్టం. మరోసారి ఆమెతో నటించే అవకాశం కోసం ఎదురుచూస్తున్నాను” అని సోనాక్షి వెల్లడించింది.


భన్సాలీలతో సినిమా అంటే కష్టపడాల్సి అవసరం లేదు- సోనాక్షి


ఇక ‘హీరామండి’ దర్శకుడు సంజయ్ లీలా భన్సాలీ గురించి సోనాక్షి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. “సంజయ్ లీలా భన్సాలీ దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఎవరైనా ఇష్టపడుతారు. ఆయనతో మూవీ చేస్తే కష్టపడాల్సిన అవసరం ఉండదు. ఆయా సన్నివేశాల షూట్ కు ముందే అన్ని విషయాల గురించి చెప్తారు. ఈ సిరీస్ లో నా నటనకు ఆయన నుంచి ప్రశంసలు దక్కడం సంతోషం కలిగించింది. గొప్ప పాత్ర చేసే అవకాశం కల్పించినందుకు ఆయనకు ఎప్పటికీ రుణపడి ఉంటాను” అని చెప్పుకొచ్చింది.    


‘హీరమండి’లో సోనాక్షి డ్యుయెల్ రోల్


‘హీరామండి’ వెబ్ సిరీస్ లో సోనాక్షి సిన్హా డ్యుయెల్ రోల్ పోషించింది. రహానా, ఫరీదన్ అనే క్యారెక్టర్లు చేసింది. నెగెటివ్ లక్షణాలున్న ఫరీదన్ క్యారెక్టర్ అద్భుతంగా నటించి మెప్పించింది. ఈ సిరీస్ లో ఆమె నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు లభించాయి. ఈ వెబ్ సిరీస్ లో నటించేందుకు సోనాక్షి ఏకంగా రూ.2 కోట్లు రెమ్యునరేషన్ తీసుకున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుత పాకిస్తాన్ లోని పంజాబ్ లోని వేశ్యల జీవిత కథ ఆధారంగా సంజయ్ లీలా భన్సాలీ ఈ వెబ్ సిరీస్ ను తెరకెక్కించారు. మల్లికా జాన్ పాత్రలో మనీషా కొయిరాల నటించారు. అదితిరావు హైదరి, రిచా చద్ధా, షర్మిన్‌ సెగల్‌, సంజీదా షేక్‌ కీలక పాత్రలు పోషించారు. 


Read Also: అతడి కలలే నా కలలు - శిఖర్ పహారియాతో ప్రేమాయణంపై తొలిసారి నోరు విప్పిన జాన్వీ కపూర్