తమిళ నటుడు సిద్ధార్ నటించిన తాజా చిత్రం ‘చిత్తా’ (తెలుగులో ‘చిన్నా’). ఈ నెల 28న తమిళంతో పాటు కన్నడలో ఒకేసారి విడుదల అయ్యింది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్ కోసం కర్నాటకకు వెళ్లిన సిద్ధార్థ్ కు ఘోర అవమానం జరిగింది. బెంగళూరులోని ఓ హోటల్ లో మూవీ ప్రమోషన్ ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. సిద్ధార్థ్ మాట్లాడుతుండగా, కావేరీ జలాల పోరాట సమితి సభ్యులు అడ్డుకున్నారు. తమిళోడివి నీకు కర్ణాటకలో ఏం పని? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రెస్ మీట్ ఆపేయాలని డిమాండ్ చేశారు. తమిళ సినిమాలను కర్నాటకలో ప్రోత్సహించవద్దని అక్కడ ఉన్న విలేకరులకు విజ్ఞప్తి చేశారు. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది.


బెంగళూరు అవమానంపై స్పందించిన సిద్ధార్థ్


తాజాగా కర్ణాటకలో తనకు ఎదురైన ఘటనపై హీరో సిద్ధార్థ్‌ రియాక్ట్ అయ్యారు. బెంగళూరులో తన ప్రెసెమీట్‌ను నిరసనకారులు అడ్డుకోవడం బాధ కలిగించిందన్నారు. తన సినిమాకు, అక్కడ జరుగుతున్న కావేరి జలాల వివాదానికి ఎలాంటి సంబంధం లేదన్నారు. ఈ ప్రెస్ మీట్ ను అడ్డుకోవడం మూలంగా చిత్ర నిర్మాణ సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘‘’చిన్నా’ సినిమా నిర్మాతగా రిలీజ్ కు ముందే ఈ సినిమాను చాలా మందికి చూపించాలి అనుకున్నాను. చెన్నైలో కొంత మందికి చూపించాను. అలాగే బెంగళూరులో మీడియా ప్రతినిధులకు ఈ సినిమా చూపించాలి అనుకున్నాను. 2 వేల మంది విద్యార్థులకు కూడా చూపించాలి అనుకున్నాను. కానీ, బంద్ కారణంగా రద్దు చేయాల్సి వచ్చింది. దీని వల్ల నిర్మాణ సంస్థకు పెద్ద మొత్తంలో నష్టం జరిగింది” అని సిద్ధార్థ్ చెప్పారు.


నా సినిమాకు కావేరి జల వివాదానికి సంబంధం లేదు- సిద్ధార్థ్


అటు తన సినిమాకు కావేరి జల వివాదానికి ఎలాంటి సంబంధం లేదని సిద్ధార్థ్ వివరించారు. “ప్రెస్ మీట్ తర్వాత బెంగళూరులో పలువురికి ఈ సినిమా చూపించాలి అనుకున్నాను. కానీ, అక్కడ ఏం జరిగిందో మీకు తెలుసు. ఈ సినిమాకు మంచి ప్రేక్షకాదరణ వస్తోంది. నా చిత్రాలు కేవలం సామాజిక బాధ్యతతోనే చేస్తున్నాను. ఎలాంటి చెడు ఉద్దేశం లేదు. నా సినిమాకు కావేరి జల వివాదానికి సంబంధమే లేదు” అన్నారు.


క్షమాపణలు చెప్పిన ప్రకాశ్‌ రాజ్‌, శివరాజ్‌ కుమార్‌


సిద్ధార్థ్ ప్రెస్ మీట్ ను కావేరి జలాల ఆందోళనకారులు అడ్డుకోడంపై పలువురు కన్నడ నటుడు  క్షమాపణలు చెప్తున్నారు. ఇప్పటికే ప్రకాష్ రాజ్‌, శివరాజ్‌ కుమార్‌ సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేశారు. కన్నడ ప్రజల తరఫున సారీ చెప్పారు.    


తెలుగులో అక్టోబర్ 6న విడుదల


ఇక ‘చిన్నా’ సినిమా సిద్ధార్థ్  సొంత బ్యానర్‌ ఎతకీ ఎంటర్‌టైన్మెంట్ నిర్మించింది.  ఎస్.యు.అరుణ్ కుమార్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. మలయాళ నటి నిమిషా సాజయన్ హీరోయిన్‌గా నటించింది. తెలుగులో కూడా 28న విడుదల కావాల్సి ఉన్నా, ‘స్కంద’, ‘చంద్రముఖి 2’, ‘పెదకాపు’ సినిమాలు క్యూ కట్టడంతో అక్టోబరు 6కు వాయిదా వేశారు.


Read Also: 2 రోజుల్లో రిలీజ్ డేట్ చెప్పకపోతే సూసైడ్ చేసుకుంటా, ‘గేమ్ ఛేంజర్‘ టీమ్ కు చెర్రీ ఫ్యాన్ వార్నింగ్



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial