తెలుగు సినిమా పరిశ్రమలో సక్సెస్ ఫుల్ నిర్మాతగా కొనసాగుతున్నారు దిల్ రాజు. 70 శాతానికి పైగా సక్సెస్ రేట్ తో దూసుకెళ్తున్నారు. తాజాగా ఆయన ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి 20 ఏళ్లు పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూ‌లో మాట్లాడారు. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో ఏడాదికి ఒక్క సినిమా మాత్రమే చేసే వాడినని చెప్పారు. అందుకే అప్పట్లు చాలా క్వాలిటీ సినిమాలు వచ్చేవని తెలిపారు. ఇప్పుడు ఒకేసారి పలు ప్రాజెక్టులు చేపడుతున్నట్లు వెల్లడించారు. అలా చేయడం వల్ల క్వాలిటీ కూడా తగ్గే అవకాశం ఉంటుందన్నారు. అందుకే అలాంటి పొరపాట్లు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ఇక దిల్ రాజు ప్రొడక్షన్స్ బాధ్యతలను తన కూతురు హన్సితారెడ్డి, మేనల్లుడు హరీష్ రెడ్డి చూసుకుంటారని రాజు తెలిపారు. వర్క్‌ని వైవిధ్యపరచడానికి  రెండు వేర్వేరు బ్యానర్‌లపై సినిమాలు చేస్తున్నట్లు వెల్లడించారు.  


ఆయన పవన్ కళ్యాణ్ అన్నారు, నేను రామ్ చరణ్ ను ఓకే చేశా - దిల్ రాజు


ఇక పాన్ ఇండియన్ సినిమాలు చేయాలనే కుతూహలంతోనే శంకర్ తో సినిమా చేస్తున్నట్లు వస్తున్న వార్తలను ఆయన ఖండించారు. “పాన్ ఇండియా సినిమా చేయాలనే ఎగ్జైట్ మెంట్ తో శంకర్ సినిమా చేయడం లేదు. శంకర్, నేను ‘ఇండియన్ 2’ అనుకున్నాం. కొన్ని కారణాల వల్ల బయటకు వచ్చాను. ‘ఇండియన్ 2’ సినిమా మధ్యలో బ్రేక్ వచ్చింది. కమల్ హాసన్ వేరే సినిమా చేశారు. అప్పుడు శంకర్ మేనేజర్ దగ్గర నుంచి నాకు ఓ కాల్ వచ్చింది. ఓ మంచి కథ ఉంది అని చెప్పారు. నేను కథ విన్నాను. 45 నిమిషాల పాటు స్టోరీ నేరేషన్ చేశారు.. నచ్చింది. హీరో ఎవరు అనుకుంటున్నారు అని అడిగాను. అతను పవన్ కళ్యాణ్ లాంటి వారు అయితే బాగుటుంది అని చెప్పారు. అప్పుడు నేను రామ్ చరణ్‌ని సూచించాను. ఆయన అయితేనే బాగుంటుంది అని చెప్పాను” అన్నారు.


ఒక్కో పాటకు రూ. 12 కోట్లు ఖర్చు పెట్టిస్తున్నారు - దిల్ రాజు


వాస్తవానికి ఆ సమయంలో రామ్ చరణ్ ‘ఆర్ఆర్ఆర్’ షూటింగ్ లో ఉన్నట్లు దిల్ రాజు తెలిపారు. “రామోజీ ఫిల్మ్ సిటీలో షూటింగ్ జరుగుతుంటే అక్కడికి వెళ్లాను. చరణ్ తో మాట్లాడాను. ఓ కథ విన్నాను బాగుంది అని చెప్పాను. ఆ తర్వాత శంకర్‌తో చరణ్ కు ఫోన్ ద్వారా కథ చెప్పించాను. నేను పక్కనే ఉన్నాను. ఫోన్ లో చెప్పాక, నేను చరణ్ మళ్లీ డిస్కస్ చేసుకున్నాం. చరణ్‌కు స్టోరీ నచ్చింది. ప్రాజెక్ట్ లాక్ అని చెప్పాను. అది నా 50వ సినిమా. అప్పటికి ‘ఆర్ఆర్ఆర్’ రిలీజ్ కాలేదు. ఇక ‘గేమ్ ఛేంజర్’ సినిమాలో ఒక్కో పాటకు 10 నుంచి 12 కోట్లు ఖర్చు పెట్టించారు శంకర్. ఐదు పాటలను 5 రకాలుగా షూట్ చేశారు. సినిమా 70 శాతం అయిపోయింది. మళ్లీ ‘ఇండియన్ 2’ తెరమీదికి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆ సినిమాకు 10 రోజులు, ఈ సినిమాకు 10 రోజులు సమయం కేటాయిస్తున్నారు. సెప్టెంబర్ లో రామ్ చరణ్, శంకర్ మూవీ కంప్లీట్ అవుతుంది“ అని దిల్ రాజు తెలిపారు.


Read Also: రేపు నా బర్త్ డే, ఎవరూ విష్ చేయకండి - ఆర్జీవీ ఆసక్తికర ట్వీట్!