తెలుగు సినీ ఇండస్ట్రీలో ఒకప్పుడు లవర్ బాయ్ గా స్టార్ హీరో ఇమేజ్ను కైవసం చేసుకున్నాడు తరుణ్. 'అంజలి' అనే సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన తరుణ్.. 'నువ్వే కావాలి' సినిమాతో హీరోగా మారాడు. మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ అందుకొని యూత్లో ఫుల్ క్రేజ్ ని సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత 'ప్రియమైన నీకు',  'నువ్వు లేక నేను లేను',  'నువ్వే నువ్వే' వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ అందుకున్నాడు. ఈ సినిమాలతో టాలీవుడ్ లో తరుణ్ కి లవర్ బాయ్ ఇమేజ్ వచ్చేసింది. ఇక స్టార్ హీరోగా మంచి ఫామ్ లో ఉన్న తరుణ్ కి కొన్నాళ్ల తర్వాత వరుస ప్లాపులు ఎదురవడంతో సినిమాలకు దూరమై ప్రస్తుతం వ్యాపార రంగంలో రాణిస్తున్నాడు. నిజానికి మళ్లీ సినీ ఇండస్ట్రీలో తన సెకండ్ ఇన్నింగ్స్ ని మొదలు పెట్టాలనే ప్రయత్నాలు చేస్తున్నాడు. కానీ అవి ఇంకా ఆరంభ దశలోనే ఉన్నట్టు తెలుస్తోంది.


తరుణ్ పెళ్లి పై తల్లి ఆసక్తికర వ్యాఖ్యలు


ఇదిలా ఉంటే తాజాగా తరుణ్ తల్లి, అలనాటి హీరోయిన్ రోజా రమణి తరుణ్ పెళ్లి గురించి ఓ ఇంటర్వ్యూలో పలు ఇంట్రెస్టింగ్ విషయాలను బయటపెట్టారు.  తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో రోజా రమణి మాట్లాడుతూ.. తన కొడుకు గురించి మీడియాలో వస్తున్న రూమర్స్ తనని ఎంతో బాధ కలిగించాయని అన్నారు. తరుణ్ రోజూ రెండున్నర గంటల పాటు పూజలు చేస్తాడని,  ప్రతి సంవత్సరం తిరుపతికి వెళ్తాడని, తనకంటే తన కొడుకుకే భక్తి ఎక్కువ అని చెప్పారు. ఇక శనివారం, మంగళవారం తరుణ్ నాన్ వెజ్ తినడు. మిగతా రోజుల్లో ఎక్కువగా చికెన్ తింటాడు. ప్రస్తుతం తెలుగు అభిమానుల ఆశీస్సులతో మేము సంతోషంగా ఉన్నామని చెప్పారు. ఇక తనకు పెద్దగా కోరికలు అంటూ ఏమీ లేవని,  తన కొడుకు పెళ్లి అయితే చాలని అంతకుమించి ఏమీ లేదని,  తరుణ్ పెళ్లి కూడా తొందరలోనే అవుతుందంటూ పేర్కొన్నారు.


త్వరలోనే తరుణ్ రీ ఎంట్రీ


అలాగే తరుణ్ త్వరలోనే రీఎంట్రీ ఇవ్వబోతున్నాడని గుడ్ న్యూస్ కూడా చెప్పారు. ‘‘తరుణ్ తొందర్లోనే ఓ వెబ్ సిరీస్ తో పాటు ఓ సినిమా కూడా చేయబోతున్నాడు. అయితే వీటిలో ఏది ముందు విడుదలవుతుందో చెప్పలేను. ప్రేక్షకుల అందరి ఆశీస్సులతో తరుణ్ మళ్లీ హీరోగా కచ్చితంగా రాణిస్తాడని కోరుకుంటున్నాను’’ అంటూ తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు రోజా రమణి. ఇక తరుణ్ త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్నాడనే విషయం తెలియడంతో ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తూ తన సెకండ్ ఇన్నింగ్స్ లో మంచి విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నారు. తరుణ్ చివరగా నటించిన చిత్రం 'ఇది నా లవ్ స్టోరీ'. రమేష్ గోపి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో తరుణ్ సరసన ఓవియా హీరోయి‌న్‌గా నటించింది. 2018లో విడుదలైన ఈ సినిమా ఆశించిన స్థాయిలో విజయాన్ని అందుకోలేకపోయింది.



Read Also: తమిళ దర్శకుల దెబ్బ, తెలుగు హీరోలు అబ్బ - పవన్, చరణ్ పరిస్థితి ఎలా ఉంటుందో?