'బాహుబలి'తో టాలీవుడ్ రేంజ్ మార్చేసిన రాజమౌళి తర్వాతి ప్రాజెక్ట్ ‘ఆర్ఆర్ఆర్’ పై భారీ అంచనాలున్నాయి. ఈ చిత్రంలో మెగా-నందమూరి వారసులు నటిస్తుండడంతో క్రేజ్ ఓ రేంజ్‌లో ఉంది.  ఈ సినిమాను వచ్చే సంవత్సరం జనవరి 7వ తేదిన విడుదల చేయబోతున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో సినిమా ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇటీవల దీపావళి సందర్భంగా 'ఆర్‌ఆర్‌ఆర్‌' గ్లింప్స్ ను విడుదల చేసి అభిమానుల్లో జోష్ పెంచారు. 


Also Read: అల్లు అర్జున్ కి షాక్.. లీగల్ నోటీసులు పంపించిన సజ్జనార్..


45 సెకన్ల నిడివి ఉన్న ఈ వీడియో సినిమాపై అంచనాలను పెంచేసింది. దీనిపై మొత్తం ఇండస్ట్రీ స్పందించింది. అభిమానులైతే ఈ విజువల్ ట్రీట్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే సినిమాలో మొదటి పాటను విడుదల చేయగా..  రీసెంట్ గా సినిమాలో రెండో పాటను విడుదల చేయబోతున్నట్లు చెప్పారు. దీనికి సంబంధించిన ప్రోమో కూడా వచ్చింది. తాజాగా పూర్తి పాటను విడుదల చేశారు.


'పొలం గట్టు దుమ్ములోన పోట్లగిత్త దూకినట్టు.. పోలేరమ్మ జాతరలో పోతరాజు ఊగినట్టు..' అంటూ సాగే ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించారు. ఎం.ఎం. కీరవాణి సంగీతం అందించిన ఈ పాటను రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించారు. ఐదు భాషల్లో సాంగ్ ను రిలీజ్ చేశారు. చిత్రబృందం చెప్పినట్లుగానే ఈ బ్లాస్టింగ్ బీట్స్.. ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక పాటలో రామ్ చరణ్, ఎన్టీఆర్ ల డాన్స్ స్టెప్పులు ఫ్యాన్స్ కు విజువల్ ట్రీట్ అనే చెప్పాలి. ఇద్దరూ తమ ఎనర్జిటిక్ పెర్ఫార్మన్స్ తో ఇరగదీశారు. 


ఎన్టీఆర్ సరసన ఒలీవియా మోరీస్, రామ్ చరణ్ జంటగా ఆలియా భట్ నటిస్తున్న ఈ సినిమాలో అజయ్ దేవగణ్, శ్రియా శరణ్, అలీసన్ డూడీ, రాహుల్ రామకృష్ణ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. రాజమౌళి దర్శకత్వంలో డీవీవీ దానయ్య భారీ బడ్జెట్ తో సినిమాను నిర్మిస్తున్నారు.