Sankranti 2024 Telugu movie releases: తెలుగు చిత్రసీమలో ప్రతి పండక్కి రెండు మూడు కొత్త సినిమాలు విడుదల కావడం కామన్! అందులో మినిమమ్ ఒక్కటైనా డబ్బింగ్ సినిమా ఉంటుంది. అయితే... రాబోయే సంక్రాంతికి డబ్బింగ్ సినిమాలు కాకుండా ఐదారు తెలుగు సినిమాలు విడుదలకు రెడీ అయ్యాయి. వాటిలో అగ్ర హీరోలు, యంగ్ స్టార్స్ నటించినవి నాలుగు ఉన్నాయి. ఈ నేపథ్యంలో థియేటర్ల సర్దుబాటు, ఆ పోటీ గురించి చర్చించడానికి శుక్రవారం తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌లో నిర్మాతలు సమావేశం అయ్యారు. 


సంక్రాంతికి ఎవరెవరు వస్తున్నారు?
సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెరకెక్కించిన సినిమా 'గుంటూరు కారం' (Guntur Kaaram Movie). ఈ చిత్రాన్ని జనవరి 12న విడుదల చేస్తున్నారు. అదే రోజు మహేష్ సినిమాతో పాటు యంగ్ హీరో తేజా సజ్జాతో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన 'హను-మాన్' కూడా విడుదల కానుంది.


'గుంటూరు కారం', 'హనుమాన్' విడుదలైన తర్వాత రోజు థియేటర్లలోకి 'సైంధవ్', 'ఈగల్' రానున్నారు. మాస్ మహారాజా రవితేజ హీరోగా ఛాయాగ్రాహకుడు కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో పీపుల్ మీడియా అధినేత టీజీ విశ్వ ప్రసాద్ 'ఈగల్' నిర్మిస్తోంది. ముందు నుంచి సంక్రాంతి బరిలో సినిమా విడుదల చేస్తామని చెబుతున్నారు. నిజానికి, విక్టరీ వెంకటేష్ 'సైంధవ్'ను ఈ క్రిస్మస్ సీజన్‌లో విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ, 'సలార్' రావడంతో కుదరలేదు. 


Also Read: వేణు స్వామి ఎక్కడ? - ప్రభాస్ కెరీర్ కష్టం అన్నాడే, హిట్ రాదని చెప్పాడే!


సంక్రాంతి బరిలో అందరి కంటే లేటుగా వచ్చిన హీరో కింగ్ అక్కినేని నాగార్జున. కొరియోగ్రాఫర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ శ్రీనివాస చిట్టూరి 'నా సామి రంగ' నిర్మిస్తున్నారు. ఇంకా విడుదల తేదీని అధికారికంగా చెప్పలేదు. కానీ, జనవరి 13న విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 


థియేటర్ల సర్దుబాటుకు నిర్మాతల మీటింగ్!
తెలుగు ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్' రాజు నేతృత్వంలో జరిగిన సమావేశానికి 'గుంటూరు కారం' నిర్మాత సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) తరఫున ఆయన సోదరుడి కుమారుడు నాగవంశీ, 'ఈగల్' నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్, 'నా సామి రంగ' నిర్మాత శ్రీనివాస చిట్టూరి హాజరు అయ్యారు. 'హనుమాన్' నిర్మాత నిరంజన్ రెడ్డి ఈ సమావేశానికి డుమ్మా కొట్టారు. అయితే... సమస్య ఓ కొలిక్కి రాలేదని, మరో రెండు మూడు రోజుల తర్వాత మళ్ళీ సమావేశం కావాలని నిర్ణయించినట్టు తెలిసింది. 


వెనక్కి తగ్గేది లేదంటున్న నిర్మాతలు!
సంక్రాంతి బరి నుంచి వెనక్కి తగ్గడానికి నిర్మాతలు ఎవరూ సుముఖంగా లేరని ఫిల్మ్ ఛాంబర్ సన్నిహిత వర్గాల నుంచి అందించిన సమాచారం. 'గుంటూరు కారం' సినిమాకు క్రేజ్ ఉన్నప్పుడు తాము ఎందుకు వెనక్కి తగ్గాలని నాగవంశీ గతంలో చెప్పారు. తాము ముందు నుంచి థియేటర్ల అగ్రిమెంట్లు స్టార్ట్ చేశామని 'ఈగల్' నిర్మాత చెబుతున్నారు. నాగార్జునకు చెందిన అన్నపూర్ణ స్టూడియోస్ డిస్ట్రిబ్యూషన్ కూడా చేస్తుంది. అందువల్ల, తాము వెనక్కి తగ్గేది లేదన్నట్టు ఉన్నారట. 'హనుమాన్' దర్శకుడు ప్రశాంత్ వర్మ తమ సినిమాను 400 థియేటర్లలో విడుదల చేస్తామని ప్రకటించారు. మరి, చివరకు ఏ సినిమా వెనక్కి వెళుతుందో చూడాలి. 


Also Read: ఆ మూడు చిత్రాల రికార్ట్స్‌ను బ్రేక్ చేసిన ‘సలార్’, ఓపెనింగ్ డే కలెక్షన్స్ ఎంతంటే?


ప్రస్తుత ఛాంబర్ అధ్యక్షుడు 'దిల్' రాజు అగ్ర నిర్మాత మాత్రమే కాదు... ప్రముఖ డిస్ట్రిబ్యూటర్ కూడా! సంక్రాంతి సినిమాల్లో 'గుంటూరు కారం'తో పాటు మరో పెద్ద సినిమాను నైజాంలో ఆయన డిస్ట్రిబ్యూట్ చేయనున్నారు. మరి, నిర్మాతల మధ్య సమస్యను ఆయన ఎలా పరిష్కరిస్తారో చూడాలి. సంక్రాంతి బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ 'లాల్ సలాం'ను విడుదల చేయాలని ప్లాన్ చేసినప్పటికీ... ఆ సినిమా వెనక్కి తగ్గింది. ధనుష్ 'కెప్టెన్ మిల్లర్' మాత్రం రానుంది.


Also Readసలార్ రివ్యూ: ప్రభాస్, ప్రశాంత్ నీల్ సినిమా హిట్టా? ఫట్టా?