ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి (Samantha Health Condition) ఏంటి? అనేది అందరికీ తెలుసు. ఆవిడ మయోసైటిస్ వ్యాధితో పోరాటం చేస్తున్నారు (Samantha Fight With Myositis). ఒకవైపు ఆరోగ్యం బాలేనప్పటికీ... ఒక్కోరోజు అడుగు తీసి వేయడానికి కష్టం అయినప్పటికీ... సినిమా కోసం సమంత ముందుకు వచ్చారు. సెలైన్ బాటిల్ పెట్టుకుని మరీ 'యశోద' (Yashoda) సినిమాకు డబ్బింగ్ చెప్పారు. ఎందుకు అలా చేశారు? అని సమంతను అడిగితే...
 
నేను మొండి...
'యశోద'కు తాను డబ్బింగ్ చెప్పాలని షూటింగ్ చేసేటప్పుడు నిర్ణయించుకున్నట్టు సమంత తెలిపారు. ఇంకా ఆవిడ మాట్లాడుతూ... ''ఓ క్యారెక్టర్ చేసేటప్పుడు ఆర్టిస్ట్ ప్రాణం పెట్టారంటే... వాళ్ళే డబ్బింగ్ చెప్పాలనుకుంటారు. తమ పాత్రకు సొంత గొంతు వినిపించాలని అనుకుంటారు. నాకు మొండితనం ఎక్కువ. ఏదైనా అనుకుంటే పట్టుదలగా చేస్తా. ఒక్కసారి కమిట్ అయ్యానంటే... చేయాల్సిందే. సవాళ్ళు ఎదురైనప్పటికీ డబ్బింగ్ చెప్పగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది'' అని సమంత తెలిపారు.


సమంత మాటలు వింటుంటే... 'పోకిరి'లో మహేష్ బాబు డైలాగ్ గుర్తుకు రావడం లేదూ!? 'ఒక్కసారి కమిట్ అయ్యానంటే... నా మాట నేనే వినను' అన్నట్టు లేదూ!?



సమంత ఆరోగ్య పరిస్థితి తెలిసిన తర్వాత వేరే వాళ్ళతో డబ్బింగ్ చెప్పించాలని అనుకున్నట్టు నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ చెప్పారు. తమకు సమంత హెల్త్ కండిషన్ గురించి డబ్బింగ్ సమయంలో తెలిసిందని, తమిళంలో వేరే వాళ్ళతో చెప్పిందామని అంటే... ఆవిడ ఒప్పుకోలేదని, తాను చెబుతానని అన్నట్టు ఆయన ఇంటర్వ్యూలో చెప్పారు.
 
నేనింకా చావలేదు...
ఎమోషనల్ అయిన సమంత!
'యశోద' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో సమంత ఎమోషనల్ అయ్యారు. తన ఆరోగ్య పరిస్థితిపై మీడియాలో వస్తున్న వార్తలు గురించి ప్రస్తావిస్తూ ''నేను చాలా ఆర్టికల్స్ చూశాను. ప్రస్తుతానికి నేను చావలేదు (నవ్వులు). ఫైట్ చేస్తున్నాను. నేను ఉన్న పరిస్థితుల్లో ఈ వ్యాధి (మయోసైటిస్) ప్రాణాంతకం ఏమీ కాదు. జీవితంలో కొన్ని మంచి రోజులు, కొన్ని చెడ్డ రోజులు ఉంటాయి. ఒక్కోరోజు ఇంకొక్క అడుగు కూడా ముందు వేయలేనేమో అనిపిస్తుంది. కొన్ని రోజులు వెనక్కి తిరిగి చూస్తే... ఇంత దూరం వచ్చానా? అనిపిస్తోంది'' అని సమంత కన్నీళ్లు పెట్టుకున్నారు.


Also Read : ఇక్కడ సమంత, అక్కడ వరుణ్ ధావన్ - ఫ్యాన్స్‌కు టెన్షన్ టెన్షన్



హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ నిర్మించిన 'యశోద'లో వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, మధురిమ, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ తదితరులు ప్రధాన తారాగణం. 


ఈ చిత్రానికి సంగీతం: మణిశర్మ, మాటలు: పులగం చిన్నారాయణ, డా. చల్లా భాగ్యలక్ష్మి, పాటలు: రామజోగయ్య శాస్త్రి, కెమెరా: ఎం. సుకుమార్,  ఆర్ట్: అశోక్, ఫైట్స్: వెంకట్, యానిక్ బెన్, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలు : రవికుమార్ జీపీ, రాజా సెంథిల్, క్రియేటివ్ డైరెక్టర్: హేమంబ‌ర్ జాస్తి, లైన్ ప్రొడ్యూసర్: విద్య శివలెంక, సహ నిర్మాత: చింతా గోపాలకృష్ణారెడ్డి, దర్శకత్వం: హరి మరియు హరీష్, నిర్మాత: శివలెంక కృష్ణప్రసాద్.