సీక్వెల్స్... సీక్వెల్స్... సీక్వెల్స్... ఇప్పుడు సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా ఉంది. హిట్ సినిమాల్లో క్యారెక్టర్లను కంటిన్యూ చేస్తూ... దర్శక నిర్మాతలు ఫ్రాంచైజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఆ జాబితాలో సమంత 'యశోద' కూడా త్వరలో చేరనుంది.


సీక్వెల్ మాత్రమే కాదు...
ఆ తర్వాత మరో పార్ట్ కూడా!
'యశోద' సక్సెస్ మీట్‌లో సీక్వెల్ ఐడియా రెడీగా ఉన్నట్లు దర్శకులు హరి, హరీష్ వెల్లడించారు. ''యశోద 2'కు విషయంలో మాకు ఓ ఐడియా ఉంది. ఆల్రెడీ మేం ఓ పాయింట్ అనుకున్నాం. సెకండ్ పార్ట్ మాత్రమే కాదు... థర్డ్ పార్ట్‌కు లీడ్ కూడా రెడీగా ఉంది'' అని హరి, హరీష్ తెలిపారు. అయితే... సీక్వెల్స్ సెట్స్ మీదకు ఎప్పుడు వెళ్ళేది సమంత చేతుల్లో ఉందని, ఆమె నిర్ణయంపై ఆధారపడి ఉందని చెప్పారు. ఇప్పుడు సమంత ఆరోగ్య పరిస్థితి అందరికీ తెలిసిందే. ఆవిడ ఆరోగ్యంగా తిరిగి వచ్చిన తర్వాత స్టోరీ నేరేట్ చేస్తామన్నారు. సీక్వెల్ తీయడానికి నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ కూడా రెడీగా ఉన్నారు.
 
ప్రపంచంలో కొత్త క్రైమ్స్ వస్తున్నాయిగా... 
'యశోద' విడుదలైన తర్వాత నుంచి సీక్వెల్ గురించి అందరూ అడుగుతున్నారని నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాద్ తెలిపారు. ''ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్తగా క్రైమ్స్ పుట్టుకొస్తున్నాయి. వాటికి పరిష్కరాలూ ఎవరో ఒకరు తీసుకొస్తారు. 'యశోద' సీక్వెల్ ప్రయత్నం హరి, హరీష్ నుంచి రావాలి'' అని ఆయన తెలిపారు. సమంత ఓకే అంటే సీక్వెల్ చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన మాటలు వింటే అర్థం అవుతోంది. 'యశోద'కు వస్తున్న వసూళ్ల పట్ల ఆయన సంతోషం వ్యక్తం చేశారు.
 
'యశోద' బాక్సాఫీస్ రన్ స్లోగా స్టార్ట్ అయినా... 
'యశోద' సినిమాకు విడుదలైన రోజు బాక్సాఫీస్ రన్ స్లోగా స్టార్ట్ అయ్యిందని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ తెలిపారు. ''విడుదలైన శుక్రవారం రోజు సాయంత్రానికి మా 'యశోద' మౌత్‌టాక్‌తో హౌస్‌ఫుల్స్ తెచ్చుకుంది. వీకెండ్... శని, ఆదివారాలు అయితే ప్రభంజనమే. హీరోయిన్‌ ఓరియంటెడ్‌ సినిమాకు ఈ రేంజ్‌ రెస్పాన్స్, యుఎస్‌లో ఈ రేంజ్‌ కలెక్షన్లను ఎవరూ ఎక్స్‌పెక్ట్ చేయలేదు'' అని శివలెంక కృష్ణ ప్రసాద్ చెప్పారు. 
  
అమెరికాలో హాఫ్ మిలియన్ డాలర్!
అమెరికా, ఆస్ట్రేలియాలో 'యశోద'కు ఆదరణ బావుంది. ముఖ్యంగా అమెరికాలో 'యశోద' హాఫ్ మిలియన్ మార్క్ చేరుకుంది. నాలుగు కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఆస్ట్రేలియాలో కూడా కలెక్షన్స్ బావున్నాయి. అమెరికా కాకుండా ఇతర ఓవర్సీస్ మార్కెట్స్‌లో అర కోటికి పైగా వసూలు చేసింది. ఇండియన్ బాక్సాఫీస్ మార్కెట్‌లో 20 కోట్ల రూపాయలకు పైగా వసూలు చేసింది. సమంత స్టార్‌డమ్‌కు 'యశోద' వసూళ్లు గీటురాయిగా చూస్తున్నారు ట్రేడ్ వర్గాలు.


Also Read : 'అహ నా పెళ్ళంట' వెబ్ సిరీస్ రివ్యూ : రాజ్ తరుణ్, శివానీ రాజశేఖర్‌ల కామెడీ, రొమాన్స్ ఎలా ఉందంటే?


హరి, హరీష్ దర్శకత్వంలో శ్రీదేవి మూవీస్ పతాకంపై శివలెంక కృష్ణ ప్రసాద్ 'యశోద'ను నిర్మించారు. గతంలో 'ఆదిత్య 369' వంటి న్యూ ఏజ్ కాన్సెప్ట్ సినిమా తీసిన ఆయన, మరోసారి 'యశోద'తో కొత్త కాన్సెప్ట్ ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చారు.ఫ్యూచరిస్టిక్ ఐడియాస్‌తో సినిమాలు తీసే నిర్మాతగా పేరు తెచ్చుకున్నారు. 


'యశోద' కథ కొత్తగా ఉందని ఆడియన్స్ అంటున్నారు. సమంత నటనతో పాటు మణిశర్మ నేపథ్య సంగీతానికి... పులగం చిన్నారాయణ, డా చల్లా భాగ్యలక్ష్మి రాసిన మాటలకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు లభిస్తున్నాయి. వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్, రావు రమేశ్, మురళీ శర్మ, సంపత్ రాజ్, శత్రు, కల్పికా గణేష్, దివ్య శ్రీపాద, ప్రియాంకా శర్మ ప్రధాన పాత్రల్లో నటించారు. అశోక్ ఆర్ట్ వర్క్ కూడా ప్రశంసలు అందుకుంటోంది.