సమంత (Samantha) ఆరోగ్యం ఎలా ఉంది? ఇప్పటికి ఇప్పుడు ఈ ప్రశ్నకు ఎవరూ సమాధానం చెప్పలేరు. తనకు మయోసైటిస్ ఉందని వెల్లడించిన స్టార్ హీరోయిన్, చికిత్స తీసుకుంటున్నానని 'యశోద' విడుదల సందర్భంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. ఆ తర్వాత మరో అప్‌డేట్ ఇవ్వలేదు. రెండు రోజుల క్రితం సమంత ఆసుపత్రిలో చేరారని, ఆమె ఆరోగ్యం బాలేదని పుకార్లు చికారు చేశాయి. వాటికి సామ్ టీమ్ చెక్ పెట్టింది. అసలు, ఇప్పుడు ఆమె ఆరోగ్యం ఎలా ఉందని ఆరా తీస్తే...
 
ఇంగ్లీష్ మందులు వద్దు...
ఆయుర్వేదం చాలా ముద్దు!
సమంత బాడీకి ఇంగ్లీష్ మందులు పడటం లేదని టాక్. వాటి కంటే ఆయుర్వేద మందులకు ఆమె శరీరం బాగా స్పందిస్తోందట. అందుకని, సమంత ట్రీట్మెంట్ ఛేంజ్ చేశారని టాక్. ఇప్పుడు లోకల్ ఆయుర్వేదిక్ డాక్టర్ ఒకరు ఆమెకు ట్రీట్మెంట్ ఇస్తున్నారని సమాచారం. ఆవిడ అమెరికా వెళ్లారని జరిగిన ప్రచారంలో ఎటువంటి నిజం లేదట! నాలుగు నెలల క్రితం అయితే ఆవిడ అమెరికా వెళ్లిన మాట నిజమేనని తెలిసింది. అక్కడ నుంచి హైదరాబాద్ వచ్చిన తర్వాత మరో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ తీసుకున్నారట. భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉండటం కోసం ఆయుర్వేదాన్ని ఆశ్రయించారట!


కొత్త ఏడాదిలో సెట్స్‌కు!
ఇప్పుడు సమంత ఆరోగ్యం ఇంతకు ముందు కంటే మెరుగైందని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కొత్త ఏడాదిలో ఆమె షూటింగ్స్ స్టార్ట్ చేసే అవకాశం ఉందట. విజయ్ దేవరకొండకు జోడిగా 'ఖుషి' సినిమాలో ఆమె నటిస్తున్నారు. ఆమెతో 'మజిలీ' వంటి హిట్ సినిమా తీసిన శివ నిర్వాణ ఆ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు.


సమంత అనారోగ్యం కారణంగా 'ఖుషి' చిత్రీకరణ వాయిదా వేశారు. ఈ విరామంలో 'లైగర్' షూటింగ్ సమయంలో అయిన గాయాలకు విజయ్ దేవరకొండ కూడా చికిత్స తీసుకున్నారు. ఇద్దరూ బావుండటంతో కొత్త ఏడాది మళ్ళీ షూటింగ్ స్టార్ట్ చేయనున్నారు.  


Also Read : కల్పిక అకౌంట్‌ను సస్పెండ్ చేసిన ఇన్‌స్టాగ్రామ్


తన వ్యాధి గురించి ''మీ ప్రేమ, అనుబంధం జీవితం నాకు విసిరే ప్రతి సవాల్‌ను ఎదుర్కోవడానికి శక్తిని ఇస్తోంది. కొన్ని నెలలుగా నేను మైయోసిటిస్ అనే ఆటో ఇమ్యూన్ కండిషన్‌తో బాధ పడుతున్నాను. దీన్నుంచి కోలుకున్న తర్వాత ఈ విషయాన్ని అందరికీ చెప్పాలనుకున్నా. కానీ, నేను అనుకున్న దాని కంటే కోలుకోవడానికి ఎక్కువ సమయం పట్టేలా ఉంది. నేను ఈ స్థితిని అంగీకరించడానికి కష్టపడుతున్నాను. అయితే... పూర్తిగా కోలుకుంటానని వైద్యులు నమ్ముతున్నారు'' అని సమంత సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన సంగతి తెలిసిందే.


మయోసైటిస్ కారణంగా 'యశోద' ప్రచారానికి సమంత రాలేకపోయారు. అయితే... ఓ వీడియో ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఆ తర్వాత ప్రేక్షకులకు థాంక్స్ చెబుతూ సమంత ఒక నోట్ కూడా విడుదల చేశారు. ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ రూపొందించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆల్రెడీ దర్శకులు హరి, హరీష్ తమ దగ్గర స్టోరీ ఐడియా రెడీగా ఉందని చెప్పారు. సమంత పూర్తిగా కోలుకున్నాక కథ వినాలి. ఆమె ఓకే అనాలి. అప్పుడు సినిమా సెట్స్ మీదకు వెళుతుంది.