బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కు ఎలాంటి ఫాలోయింగ్ ఉంటుందో అందిరికీ తెలిసిందే. అయితే బాలీవుడ్ లో ఇప్పటికీ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ తీస్తే అందులో సల్మాన్ ఖాన్ ముందు వరుసలో కనిపిస్తాడు. ఐదు పదులు వయసు దాటినా ఇప్పటికీ ఆయన పెళ్లి చేసుకోలేదు. ఆయన ఎప్పుడు పెళ్లి చేసుకుంటారా అని ఎదురుచూస్తున్నారంతా. కానీ ఆ శుభవార్త మాత్రం చెప్పడం లేదు. గత కొన్నేళ్లుగా ఆయన పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి. పెళ్లి గురించి ఎప్పుడు ప్రశ్నలు వేసినా ఓ నవ్వు నవ్వి వెళ్లిపోతున్నారు. అయితే తాజాగా సల్మాన్ పెళ్లికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో ఆయన తన ఇష్టపడిన అమ్మాయి గురించి చెప్పుకొచ్చారు. దీంతో ఈ వీడియో కాస్తా ఇంటర్నెట్ లో వైరల్ అయింది. 


ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. సల్మాన్ ఖాన్ బాలీవుడ్ మాజీ నటి జుహీ చావ్లాను పెళ్లి చేసుకోవాలనుకున్నానని అన్నారు. ఆమె చాలా ఆత్మీయతగల అమ్మాయి అని అన్నారు. ఆమె వ్యక్తిత్వం కూడా తనకెంతో ఇష్టమని చెప్పుకొచ్చారు సల్మాన్. అందుకే తాను జుహీ వాళ్ల నాన్న దగ్గరకు వెళ్లానని, జుహిను తనకిచ్చి పెళ్లి చేయాలని అడిగానని చెప్పారు. దానికి జుహీ వాళ్ల నాన్న ఒప్పుకోలేదని అన్నారు. ఎందుకు? అని అడిగితే ‘తాను వాళ్లకి సరిపోనని అనుకున్నారో ఏమో’ అంటూ నవ్వుతూ బదులిచ్చారు. దీంతో ఈ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఇంతకీ అసలు విషయం ఏంటంటే.. ఆ వీడియో ఇప్పటిది కాదు. దాదాపు పాతికేళ్ల క్రితం సల్మాన్ ఓ ఇంటర్య్వూలో పాల్గొన్నారు. అప్పటి ఇంటర్వ్యూకు సంబంధించిన వీడియోలో ఓ క్లిప్ ను ఒక నెటిజన్ తాజాగా సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. దీంతో ఆ వీడియో మళ్లీ తెరపైకి వచ్చింది. 


ఇప్పుడు ఆ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీంతో మళ్లీ సల్మాన్ ఖాన్ పెళ్లి విషయం చర్చలోకి వచ్చింది. దీనిపై నెటిజన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు. అప్పుడే జుహీ వాళ్ల నాన్న ఒప్పుకొని ఉంటే బాగుండేది అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా చాలా రోజుల తర్వాత మళ్లీ నెట్టింట సల్మాన్ ఖాన్ పెళ్లి అంశంపై చర్చ మొదలైంది. అయితే జుహీ తండ్రి ఆ విషయాన్ని ఇప్పటి వరకూ ఎవరితోనూ పంచుకోలేదు. 1995 లో జుహీ వ్యాపారవేత్త జే మెహతాను పెళ్లి చేసుకుంది. ఇక సల్మాన్ ఖాన్, జుహీ కలసి ‘దీవానా మస్తానా’(1997) లో కలసి పనిచేశారు. తర్వాత సల్మాన్ ఖాన్ హోస్ట్ గా చేసిన రియాలిటీ షో ‘బిగ్ బాస్‌’ లో కూడా జుహీ అతిథిగా కనిపించింది.


ఇక సల్మాన్ ఖాన్ వరుస సినిమాలలో నటిస్తున్నారు. గతంలో వచ్చిన ‘గాడ్ ఫాదర్’ సినిమాలో నటించి తెలుగులో కూడా ఎంట్రీ ఇచ్చారు. తాజాగా బాలీవుడ్ లో ‘కిసీ కా భాయ్ కిసీ కి జాన్‌’ సినిమాలో నటించారు. ఈ మూవీలో పూజా హెగ్డే హీరోయిన్ గా కనిపించనుంది. ఈ మూవీను ఏప్రిల్ 21 న విడుదల చేయనున్నారు. తర్వాత ‘టైగర్ 3’ లో నటించనున్నారు సల్మాన్.