16 ఏళ్ల వయస్సులోనే సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది రింకూ రాజ్ గురు. ఆమె తొలి చిత్రం ‘సైరత్’తోనే దేశ వ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకుంది. నాగరాజ్ మంజులే దర్శకత్వంలో జీ స్టూడియోస్ సంస్థ నిర్మించిన ఈ సినిమా సంచలన విజయం సాధించింది. ఏప్రిల్ 29, 2016లో రిలీజ్ అయిన ఈ లవ్ స్టోరీ ఏకంగా రూ. 100 కోట్లు వసూలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. అంతేకాదు, తను నటించి తొలి చిత్రంతోనే జాతీయ అవార్డును అందుకుంది రింకూ. దేశ వ్యాప్తంగా కోట్లాది మంది అభిమానులను సంపాదించుకుంది.


టాలీవుడ్ లోకి ‘సైరత్’ బ్యూటీ ఎంట్రీ


ఈ యంగ్ బ్యూటీ ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టబోతోంది. ఇక్కడ కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతోంది. క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ లో రాకేష్ వర్రే హీరోగా నటిస్తున్న ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘వెళ్లిపోమాకే’ సినిమాకు దర్శకత్వం వహించిన యాకుబ్ అలీ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. ఇప్పటికే ఈ సినిమాలో హీరోయిన్ గా రింకూను ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది.  త్వరలోనే ఈ సినిమాకు సంబంధించి అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది.        


రూ. 100 కోట్లు సాధించిన తొలి చిత్రం ‘సైరత్’


2016లో మరాఠీలో వచ్చి బాక్సాఫీస్‌ దగ్గర దుమ్మురేపి ‘సైరత్’ తర్వాత రింకూ పలు భాషల్లో సినిమాలు చేసింది. కన్నడతో పాటు హిందీలోనూ పలు అవకాశాలు వచ్చాయి. అయితే, ‘సైరత్’ స్థాయిలో గుర్తింపు రాలేదు. ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం టాలీవుడ్‌లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతోంది.  ‘సైరత్’ మూవీ మరాఠీ సినిమా చరిత్రలో తొలిసారి రూ. 100 కోట్లు వసూలు చేసిన చిత్రంగా నిలిచింది. పరువు హత్య కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లో పలు భాషల్లో విడుదల అయ్యింది. కన్నడలో ‘మనసు మలిగే’ పేరుతో ‘సైరత్‌’ను రీమేక్‌ చేశారు. ఈ చిత్రంలో కూడా రింకూ హీరోయిన్ గా నటించింది. అయితే, మరాఠీ సినిమా స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అందుకోలేకపోయింది.    


సినిమాల్లోకి వస్తాను అనుకోలేదు- రింకూ


ప్రస్తుతం సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలోనూ నటిస్తోంది. ‘హండ్రెడ్‌’ అనే వెబ్ ‌సిరీస్‌లో లారా దత్తాతో పోటీపడి నటించింది. పలువురు సినీ ప్రముఖులు ప్రశంసలు దక్కించుకుంది. ఓవైపు సినీ రంగంలో కొనసాగుతూనే మరోవైపు చదువులోనూ ముందుంటుంది. వెటర్నరీ డాక్టర్ కావాలనేదే తన లక్ష్యం అని రింకూ గతంలో వెల్లడించింది. ఇక తాను సినిమాల్లోకి వస్తానని అస్సలూ ఊహించలేదని చెప్పింది. ‘సైరత్’ దర్శకుడు నాగరాజుది తమ ఊరే కావడంతో తనకు ఈ సినిమాలో అవకాశం ఇచ్చినట్లు చెప్పింది. ఈ సినిమా పనులు మొదలైనప్పుడు తాను 8వ తరగతి చదవుతున్నట్లు రింకూ తెలిపింది.






Read Also: ఆ ఓటీటీకి ‘జవాన్‘ రైట్స్ - స్ట్రీమింగ్ ఎప్పటి నుంచి అంటే?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial