ఇటీవల 'శ్యామ్ సింగరాయ్' సినిమాతో భారీ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్న సాయిపల్లవి ఇప్పుడు తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ తో బిజీగా గడుపుతోంది. అయితే 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో దేవదాసి గెటప్ లో సాయిపల్లవి అందంగా లేదని తమిళ మీడియా పోర్టల్ వార్తలు ప్రచురించింది. దీంతో చాలా మంది సదరు మీడియా పోర్టల్ ను తిట్టిపోశారు. టాలెంట్ చూడాలే కానీ అందం కాదంటూ మండిపడ్డారు. తెలంగాణ గవర్నర్ తమిళిసై కూడా ఈ విషయంపై స్పందించారు. బాడీ షేమింగ్ చేస్తూ ట్రోలింగ్ చేయడాన్ని గవర్నర్ తీవ్రంగా ఖండించారు.


ఈ ట్రోలింగ్స్ పై రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడింది సాయిపల్లవి. ఇదే సమయంలో ఆమెకి హీరో నాగశౌర్యకి సంబంధించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. గతంలో నాగశౌర్య.. సాయిపల్లవి కారణంగా ఇబ్బందిపడ్డానని చెప్పాడు. వీరిద్దరూ కలిసి 'కణం' అనే సినిమాలో నటించారు. ఆ సినిమా రిలీజ్ సమయంలో శౌర్య.. సాయిపల్లవిపై ఘాటు విమర్శలు చేశాడు. ఆమె అన్‌ ప్రొఫెషనల్‌ హీరోయిన్‌ అని... ప్రతిదానికి కోప్పడుతూ ఉంటుందని అన్నాడు. ఆమె ప్రవర్తన కారణంగా చాలా ఇబ్బంది పడినట్లు తెలిపాడు. 


ఈ మాటలు సాయిపల్లవి దృష్టికి వెళ్లడంతో అప్పట్లోనే  తాను ఆ సినిమా దర్శకుడు ఎ.ఎల్‌.విజయ్‌, కెమెరామెన్‌ నిరవ్‌షాకు ఫోన్‌ చేసి సెట్‌లో నా వల్ల ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొన్నారా.. అని అడగ్గా.. వారు అలాంటిది ఏమీ లేదు అని చెప్పినట్లు తాజాగా ఇంటర్వ్యూలో తెలిపింది సాయిపల్లవి. నాగశౌర్య అంటే నటుడిగా గౌరవం ఉందని.. ఆయన తనలో నచ్చని గుణాన్ని చెప్పారని.. ఆ విషయం పాజిటివ్ గా తీసుకున్నానని చెప్పుకొచ్చింది. 


తన కారణంగా సెట్ లో శౌర్య ఇబ్బంది పడ్డారని తెలిసి బాధగా అనిపించిందని.. ఈ సమాధానంతోనైనా శౌర్య సంతృప్తి చెందుతాడని ఆశిస్తున్నట్లు చెప్పుకొచ్చింది. దాదాపు మూడేళ్ల తరువాత సాయిపల్లవి శౌర్యకి సమాధానం చెప్పడం సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.