సెప్టెంబరు 10న దుర్గంచెరువు వద్ద బైకు మీద ప్రయాణిస్తూ.. రోడ్డు ప్రమాదానికి గురైన సుప్రీం హీరో సాయి దరమ్ తేజ్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ప్రకటించారు. తీవ్ర గాయాలతో జూబ్లీహిల్స్‌లోని అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సాయిధరమ్‌ తేజ్‌ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా మెరుగుపడింది. గత కొద్ది రోజులుగా అపస్మారక స్థితిలో ఉన్న తేజ్ ఇప్పుడు స్పృహలోనే ఉన్నారని, వెంటిలేటర్‌ కూడా తొలగించామని వైద్య బృందం వెల్లడించింది.


ప్రమాదం తర్వాత సాయి ధరమ్ తేజ్ శ్వాస తీసుకోడానికి ఇబ్బందిపడ్డాడు. దీంతో వైద్యులు వెంటిలేటర్ ద్వారా కృత్రిమ శ్వాస అందించారు. ప్రస్తుతం తేజ్ తనంతట తానే ఊపిరి పీల్చుకోగలుగుతున్నాడు. దీంతో ఐసీయూ నుంచి సాధారణ గదికి షిఫ్ట్ చేశారు. ఆరోగ్యం కూడా మెరుగుపడటంతో మరో రెండు మూడు రోజుల్లో తేజ్‌ను ఆస్పత్రి నుంచి డిశ్చార్జి చేసే అవకాశాలు ఉన్నాయని వైద్యులు తెలిపారు. తేజ్ కోలుకున్నాడనే సమాచారం మెగా అభిమానుల్లో కూడా సంతోషం నింపింది. 


Also Read: అర్ధరాత్రి రెస్ట్ రూమ్‌లో లహరి, రవి హగ్.. ప్రియా కామెంట్స్‌తో హీటెక్కిన బిగ్ బాస్ హౌస్


వినాయక చవితి రోజు రాత్రి తేజ్ దుర్గం చెరువు మార్గంలో బైకు మీద వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. మాదాపూర్ ఏసీపీ తెలిపిన వివరాల ప్రకారం.. ప్రమాదం జరిగిన సమయంలో హెల్మెట్‌ తేజ్ హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం తప్పింది. ఆ సమయంలో అతడు మద్యం సేవించలేదు. రహదారిపై ఇసుక ఉండటం వల్ల బైక్‌ స్కిడ్‌ అయ్యింది. దీంతో తేజ్ వాహనాన్ని అదుపుచేయలేక పడిపోయాడు. సైబరాబాద్‌ కమిషనరేట్‌ రాయదుర్గం పరిధి ఐకియా స్టోర్‌ సమీపంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రమాదంలో సాయిధరమ్‌ తేజ్‌ కుడి కంటి పైభాగంతో పాటు ఛాతీ భాగంలో గాయాలయ్యాయి. ప్రమాదంలో కాలర్‌ బోన్‌ విరిగిందని వైద్యులు వెల్లడించారు. రాయదుర్గం పోలీసులు సాయి ధరమ్ తేజ్‌పై నిర్లక్ష్యం, రాష్ డ్రైవింగ్ కింద కేసు ఐపీసీ 336, 184 ఎంవీ యాక్టు కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రాత్రి 8 గంటల 5 నిమిషాలకు ప్రమాదం జరిగినట్లు సీసీ పుటేజీ రికార్డుల్లో నమోదయినట్లు పోలీసులు తెలిపారు.