హైదరాబాద్‌లోని మాదాపూర్‌లో శుక్రవారం రాత్రి హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ప్రమాదం తర్వాత తేజ్ అపస్మారక స్థితిలోకి చేరడంతో సమీపంలోని ఓ ప్రైవేట్ హాస్పిటల్‌లో జాయిన్ చేశారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం అపోలో హాస్పిటల్‌కు తరలించారు. అయితే, ప్రమాదం సమయంలో తేజ్ మద్యం సేవించలేదని తేలింది. బైకు రోడ్డు మీద స్కిడ్ కావడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలంలోని సీసీటీవీ కెమేరాలో ఈ యాక్సిడెంట్ రికార్డైంది. 


వీడియోలో కనిపించిన దృశ్యాలను బట్టి చూస్తే.. బైకు మీద వేగంగా వస్తున్న సాయి ధరమ్ తేజ్ ఒక్కసారిగా కిందపడ్డాడు. రోడ్డు మీద ఇసుక వల్లే బైకు జారినట్లు తెలుస్తోంది. ఆ సమయంలో వేగంగా ప్రయాణిస్తుండటంతో ఒక్కసారిగా విసిరేసిన్నట్లుగా బైకుతో సహా రోడ్డు మీద జారడాన్ని వీడియోలో గమనించవచ్చు. ఆ సమయంలో అదే రోడ్డు మీద ఆటోలు, బైకులు కూడా వెళ్తున్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే హాస్పిటల్‌కు చేర్చడం వల్ల తేజ్‌కు ప్రాణాపాయం తప్పినట్లు తెలుస్తోంది. అలాగే బైకు నడుపుతున్నప్పుడు హెల్మెట్ ఉండటం వల్ల తలకు బలమైన గాయాలేవీ తగల్లేదు. వైద్య పరీక్షల్లో కూడా ఈ విషయం స్పష్టమైంది. 


సీసీటీవీలో రికార్డైన ప్రమాదం వీడియో:


తేజ్‌కు వైద్యం అందిస్తున్న డాక్టర్లు  స్పందిస్తూ.. ప్రస్తుతం తేజ్ వెంటి లేటర్ మీద ఉన్నాడని వైద్యులు తెలిపారు. తేజ్ ఆరోగ్యం నిలకడగానే ఉందని, మరో 48 గంటలు ఆయన్ని అబ్జర్వేషన్‌లో ఉంచాలని స్పష్టం చేశారు. అప్పటివరకు ఏవిషయాన్ని స్పష్టంగా చెప్పలేమని అన్నారు. ఎందుకంటే బైకు మీద నుంచి పడినప్పుడు ఎక్కడైనా గాయం కావచ్చని, అందుకే అబ్జర్వేషన్‌లో ఉంచామని తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి సర్జరీ అవసరం లేదని, కాలుకు దెబ్బ తగిలిందని మరో వైద్యుడు తెలిపారు. అయితే, ప్రమాదంలో గాయపడిన వ్యక్తులకు వెంటిలేటర్ మీద ఉంచడం సాధారణమేనని, ఆందోళన చెందవద్దని చెప్పారు. ఆయన కోసం ప్రార్థిద్దామని, త్వరలోనే కోలుకుంటారని తెలిపారు. 


2014లో ‘పిల్లా నువ్వు లేని జీవితం’ సినిమా ద్వారా సాయి ధరమ్ తేజ్ టాలీవుడ్‌కు పరిచయమయ్యాడు. ఆ తర్వాత రేయ్, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ సినిమాలతో ఆకట్టుకున్నాడు. సుప్రీం, విన్నర్ సినిమాల ద్వారా తేజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ తర్వాత కొన్ని ఫ్లాపులు వల్ల వెనుకబడినట్లు కనిపించినా.. ‘చిత్రలహరి’, ‘ప్రతి రోజు పండుగే’, ‘సోలో బ్రతుకే సో బెటర్’ సినిమాల ద్వారా మరోసారి ఫామ్‌లోకి వచ్చాడు. ప్రస్తుతం ‘రిపబ్లిక్’ సినిమాలో నటిస్తున్నాడు. ఈ సందర్భంగా గురువారం (సెప్టెంబరు 9న).. ‘రిపబ్లిక్’ మూవీ టీమ్ ద్వారా కలెక్టర్లను గౌరవిస్తూ.. ఓ వీడియోను విడుదల చేశారు. సాయి ధరమ్ తేజ్ సినిమాల్లోనే కాదు.. సామాజిక కార్యక్రమాల్లో సైతం చురుగ్గా పాల్గొంటాడు. ఇండస్ట్రీలో కూడా తేజ్‌కు సౌమ్యుడిగా మంచి పేరు ఉంది. 


Also Read: వెంటిలేటర్‌పై సాయి ధరమ్ తేజ్.. మరో 48 గంటలు అబ్జర్వేషన్: వైద్యులు


Also Read: ఉదయాన్నే ఆ ట్వీట్.. ఇంతలోనే ప్రమాదం.. సాయి ధరమ్ తేజ్ కోలుకోవాలని ప్రార్థనలు


Also Read: సాయి ధరమ్ తేజ్‌ హెల్త్‌పై స్పందించిన పవన్.. బైక్‌ ప్రమాదం అందుకే జరిగింది: పోలీసులు