దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన 'ఆర్ఆర్ఆర్' సినిమా ఎంత పెద్ద సక్సెస్ అయిందో తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల ప్రేక్షకులు ఈ సినిమాకి బ్రహ్మరథం పట్టారు. అమెరికన్లు కూడా ఈ సినిమా చూసి ఫిదా అయ్యారు. ప్రేక్షకులతో పాటు హాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్, ఆర్టిస్ట్ లు కూడా ఈ సినిమా చూసి యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. అయితే ఈ సినిమా ఆస్కార్ అవార్డ్స్ లో కూడా ప్రభావం చూపించొచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. 

 

ఇప్పటికే ప్రముఖ దర్శక నిర్మాత అనురాగ్ కశ్యప్ 'ఆర్ఆర్ఆర్'కి ఆస్కార్ గ్యారెంటీ అని కామెంట్స్ చేశారు. ఇండియా నుంచి 'ఆర్ఆర్ఆర్' నామినేట్ అయితే ఉత్తమ చిత్రంగా అవార్డు గెలిచే ఛాన్స్ ఉందని అన్నారు. ఇప్పుడు మరో టాప్ సైట్ IMDb ఆస్కార్ బరిలో 'ఆర్ఆర్ఆర్' సినిమా ఉండొచ్చని ప్రెడిక్షన్ చెబుతోంది. రీసెంట్ గా ఈ వెబ్ సైట్ ఆస్కార్ 2023, 95వ అకాడమీ అవార్డ్స్ కి సంబంధించి ప్రెడిక్షన్ లిస్ట్ ను వదిలింది. అందులో Babylon, She Said, Don't Worry Darling, Amsterdam, The Whale లాంటి హాలీవుడ్ సినిమాలతో పాటు ఇండియన్ ఫిల్మ్ 'ఆర్ఆర్ఆర్' కూడా ఉంది. దీంతో ఫ్యాన్స్ ఈ లిస్ట్ ను తెగ షేర్ చేస్తున్నారు. 

 

ఆస్కార్స్ లిస్టులో 'ఆర్ఆర్ఆర్' పేరు వినిపించడం ఇది తొలిసారి కాదు. ఇంతకు ముందు 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం'కు ఈ ఏడాది ఆస్కార్ అవార్డుల్లో 'బెస్ట్ ఇంటర్నేషనల్ ఫీచర్ ఫిల్మ్' కేటగిరీలో పురస్కారం వచ్చే ఆస్కారం ఉందని ఒక ఆంగ్ల మీడియా సంస్థ పేర్కొంది. మన దేశం నుంచి ఆస్కార్స్‌కు ఎప్పుడూ సరైన సినిమాలను పంపరని సుతిమెత్తగా విమర్శలు చేసింది. డానీ బోయెల్ దర్శకత్వం వహించిన 'స్లమ్ డాగ్ మిలియనీర్'కు ఎనిమిది ఆస్కార్స్ వచ్చినప్పుడు రాజమౌళి 'ఆర్ఆర్ఆర్'కు ఎందుకు రాకూడదు? అని సూటిగా ప్రశ్నించింది.

 

ఎన్టీఆర్‌కు ఆస్కార్?

'ఆర్ఆర్ఆర్' సినిమాలో కొమురం భీమ్(Komaram Bheem) పాత్రలో ఎన్టీఆర్ నటించారు. భారతీయ ప్రేక్షకులను మాత్రమే కాదు, హాలీవుడ్ సినిమా ప్రముఖులను సైతం ఆయన నటన మెప్పించింది. ముఖ్యంగా పెద్ద పులితో ఎన్టీఆర్ ఫైట్ చేసే సీన్, ఇంటర్వెల్ సీన్ అద్భుతం. భావోద్వేగభరిత సన్నివేశాల్లోనూ ఎన్టీఆర్ అద్భుతంగా నటించారు. ఆయన నటనకు ఆస్కార్ వచ్చే అవకాశం ఉందనేది హాలీవుడ్ విశ్లేషకుల అభిప్రాయం.


ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన ఈ సినిమాలో ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటించారు. అజయ్ దేవగణ్, శ్రియా కీలక పాత్రలు పోషించగా... అలీసన్ డూడీ, రే స్టీవెన్ సన్ విలన్ రోల్స్ చేశారు. ఎంఎం కీరవాణి సంగీతం అందించారు. డీవీవీ మూవీస్ పతాకంపై డీవీవీ దానయ్య సినిమా నిర్మించారు.