‘RRR’ సినిమాతో ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి. ఇప్పటికే పలు అంతర్జాతీయ అవార్డులను అందుకున్నారు. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్పీల్ బర్గ్, జేమ్స్ కామెరూన్ సైతం ‘RRR’ మూవీపై ప్రశంసలు కురిపించారు. రాజమౌళి ప్రతిభను కొనియాడారు. ఓ తెలుగు దర్శకుడిని హాలీవుడ్ దర్శకులు అభినందించడం భారతీయులందరూ గర్వించాల్సిన విషయం.


ఈ నేపథ్యంలో వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సంచలన విషయాన్ని వెల్లడించారు. రోజు రోజుకు రాజమౌళి ప్రతిభ పెరిగిపోతున్న నేపథ్యంలో పలువురు భారతీయ దర్శకులు ఈర్ష్యతో రగిలిపోతున్నట్లు తెలిపారు. అంతేకాదు, జక్కన్నను హత్య చేసేందుకు కుట్ర చేస్తున్నారంటూ సంచలన విషయాన్ని వెల్లడించారు. ట్విట్టర్ వేదికగా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు. జేమ్స్‌ కామెరూన్‌ లాంటి హాలీవుడ్ దిగ్గజ దర్శకుడు రాజమౌళిపై ప్రశంసలు కురిపించడంపై ఆర్జీవీ స్పందించారు. కామెరూన్‌తో రాజమౌళి మాట్లాడే వీడియోను షేర్‌ చేస్తూ సక్తికర వ్యాఖ్యలు చేశారు. “‘మొఘల్ ఈ ఆజాం’ తీసిన కా ఆసిఫ్ నుంచి మొదలుకొని.. ‘షోలే’ తీసిన రమేష్‌ సిప్పీ వరకు అందరినీ నువ్వు అధిగమించావు. ఆదిత్య చోప్రాలు, కరణ్‌ జోహర్‌లు, భన్సాలి వంటి వారిని దాటేశావు. నీ కాలి బొటనవేలుని చీకాలని ఉంది” అంటూ ఆర్జీవీ ట్వీట్ చేశారు.  






రాజమౌళి హత్యకు దర్శకుల కుట్ర-ఆర్జీవీ


ఈ ట్వీట్ తర్వాత మరో సంచలన ట్వీట్ చేశారు. రాజమౌళి భద్రతపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. “రాజమౌళి సర్, దయచేసి మీరు సెక్యూరిటీ పెంచుకోండి.  భారతీయ ఫిల్మ్ మేకర్స్ అంతా మీ మీద ద్వేషంతో రగిలిపోతోన్నారు. వారంతా మిమ్మల్ని చంపేందుకు కుట్ర చేస్తున్నారు. అందులో నేను కూడా ఉన్నాను. కానీ, నాకు నాలుగు రౌండ్లు పడే సరికి ఇలా చెప్పేశాను” అంటూ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్లు వైరల్‌ అవుతున్నాయి. ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్లపై నెటిజన్లు ఫన్నీగా స్పందిస్తున్నారు.  రాజమౌళిని ప్రశంసించడానికే ఆర్జీవీ ఇలాంటి ట్వీట్స్ చేశారని కామెంట్స్ పెడుతున్నారు. అందరి లాగే ఆయన ట్వీట్ చేస్తే ఆర్జీవీ ఎందుకు అవుతారు? అంటూ నవ్వుకుంటున్నారు.






‘RRR’కు ఆస్కార్ దక్కేనా?


 ఇక ‘RRR’ సినిమాకు ఇప్పటికే గోల్డెన్ గ్లోబ్, క్రిటిక్స్ ఛాయిస్ లాంటి ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఆస్కార్ అవార్డుల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.


Read Also: ‘మిషన్ మజ్ను’ కోసం రష్మిక మందన్న అంత రెమ్యునరేషన్ తీసుకుందా?