Tiger Nageswara Rao: మాస్ మహరాజ్ రవితేజ హీరోగా, వంశీ దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక పాన్ ఇండియన్ చిత్రం ‘టైగర్ నాగేశ్వరరావు’. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి భారీగా అంచనాలు నెలకొన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న ఈ సినిమా పలు భాషల్లో విడుదలకానుంది. మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండడంతో చిత్రబృందం ప్రచార కార్యక్రమాలు ముమ్మరం చేసింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్ ను చిత్రబృందం విడుదల చేసింది.


యాక్షన్ సీన్లతో చెలరేగిన టైగర్


చిత్రబృందం ముందుగా ప్రకటించినట్లుగానే ‘టైగర్ నాగేశ్వరరావు’  ట్రైలర్ ను ఇవాళ విడుదల చేసింది. గత కొద్ది రోజులుగా సినిమాలోని ప్రముఖ పాత్రలను  ఒక్కొక్కటిగా పరిచయం చేసిన మేకర్స్, మోస్ట్ వాంటెడ్ దొంగలకు స్థావరంగా ఉన్న స్టువర్టుపురాన్ని ప్రపంచానికి పరిచయం చేశారు. తాజాగా అదిరిపోయే ట్రైలర్ లో టైగర్ నాగేశ్వర్ రావు గర్జించారు.  ముంబైలో జరిగిన గ్రాండ్ ఈవెంట్‌లో ఈ మూవీ ట్రైలర్‌ను విడుదల చేశారు. నాగేశర్వర్ రావు బలహీనతలతో పాటు బలాన్ని చూపించే ప్రయత్నం చేశారు. అధికారం మీద ఆశ, మగువల మీద మక్కువ, డబ్బుపై వ్యామోహం కలిగిన వ్యక్తిగా ప్రొజెక్ట్ చేశారు.


ఎవరినైనా తిట్టాలన్నా, ఏదైనా దోచుకోవాలన్నా ముందు హెచ్చరికలు చేయడం టైగర్ కు అలవాటు.  అయితే, నాగేశ్వరరావును ఎలిమినేట్ చేయడానికి ఒక చెడ్డ పోలీసు రంగంలోకి దిగుతాడు. స్టువర్టుపురం  నాగేశ్వరరావు కథ అతని అరెస్టుతో ముగుస్తుంది. కానీ,  ‘టైగర్ నాగేశ్వరరావు’ కథ అక్కడి నుంచే ప్రారంభమవుతుంది. రెండున్నర నిమిషాల ట్రైలర్ లో నాగేశ్వరరావు జీవితంలోని కీలక ఘట్టాలను చూపించారు. టైటిల్ రోల్‌లో రవితేజ యంగ్‌ అండ్  డైనమిక్‌ తో పాటు అత్యంత క్రూరంగా కనిపించాడు. ఈ ట్రైలర్ సినిమాపై ఓ రేంజిలో అంచనాలను పెంచింది.


‘టైగర్ నాగేశ్వరరావు’ యాక్షన్-ప్యాక్డ్  ట్రైలర్ రవితేజ చరిష్మాకు తగినట్లుగా అద్భుతమైన రీతిలో అలరించింది.  అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ టాప్ క్లాస్ ప్రొడక్షన్ డిజైన్, ప్రపంచ స్థాయి యాక్షన్ కొరియోగ్రఫీ, ఆర్ మదీ తీసిన విజువల్స్ టెర్రిఫిక్ గా ఉన్నాయి.  జివి ప్రకాష్ కుమార్ ఆర్ఆర్ హీరోయిజాన్ని బాగా ఎలివేట్ చేసింది. అవినాష్ కొల్లా ఆర్ట్ వర్క్, శ్రీకాంత్ విస్సా డైలాగ్స్ పవర్ ఫుల్ గా ఉన్నాయి. దసరా కానుకగా అక్టోబర్ 20న తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సినిమా గ్రాండ్​గా రిలీజ్ కానుంది.  నుపుర్ సనన్, గాయత్రి భరద్వాజ్, రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, నాజర్ సహా పలువురు ఇందులో కీలక పాత్రలు పోషిస్తున్నారు.



'టైగర్ నాగేశ్వరరావు' కథ ఏంటంటే?


'టైగర్ నాగేశ్వరరావు' చిత్రాన్ని దర్శకుడు వంశీ తెరకెక్కిస్తున్నారు.  70వ దశకంలో స్టువర్టు​పురంలో పేరు మోసిన గజదొంగ టైగర్ నాగేశ్వరరావు నిజ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ‘ది కాశ్మీర్ ఫైల్స్’, ‘కార్తికేయ 2’ వంటి బ్లాక్ బస్టర్ హిట్స్ అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ ఈ మూవీని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ చిత్రానికి తేజ్ నారాయణ్ అగర్వాల్ సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.  


Read Also: యుద్ధానికి రెడీ అవుతున్న జూ. ఎన్టీఆర్ - దర్శకుడు అయాన్‌తో కీలక భేటీ


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial