Maruthi Nagar Subramanyam Trailer: సీనియర్ నటుడు రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం 'మారుతీ నగర్ సుబ్రమణ్యం'. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించిన ఈ సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ట్రైలర్ విడుదల చేశారు. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా ఈ రోజు ట్రైలర్ ను రిలీజ్ చేశారు. స్టార్టింగ్ టు ఎండింగ్ వరకు  ఫుల్ ఫన్నీగా ఆకట్టుకుంటుంది.


నవ్వుల పువ్వులు పూయిస్తున్న ట్రైలర్


మారుతి నగర్ వాసి సుబ్రహ్మణ్యం(రావు రమేష్)కు ఎటకారం బాగా ఎక్కువ. ఉదయాన్నే కిటికీ నుంచి వస్తున్న పొగలు చూసిన పొరుగింటి వ్యక్తి 'పొద్దున్నే పూజ మొదలు పెట్టావా? అగరబత్తి పొగలు కక్కుతోంది' అని అడిగితే... 'గోల్డ్ ఫ్లాక్ కింగ్ అని కొత్త బ్రాండ్ అగరబత్తి. నీ కూతురు వాడుతుంటే చూసి కొన్నాను' అని రావు రమేష్ చెప్పడం అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ మూవీలో టైటిల్ రోల్ రావు రమేష్ చేయగా... ఆయన భార్యగా ఇంద్రజ కనిపించారు. భర్త సిగరెట్లకు భార్య రోజూ డబ్బులు ఇస్తుంది. 'ఈ రోజు నుంచి మీ సిగరెట్ ఖర్చులకు నేను డబ్బులు ఇవ్వను' అనే డైలాగ్ తో ఇంద్రజ కనిపిస్తుంది. ఆ వెంటనే 'నీకు అదృష్టం ఆవగింజ అంత ఉంటే... దురదృష్టం ఆకాశమంత ఉందిరా బాబు' అంటూ రావు రమేష్ పరిస్థితి గురించి అన్నపూర్ణమ్మ చెప్పే డైలాగ్ పటాసు లా పేలుతుంది. ఈ సినిమాలో ఆమె రావు రమేష్ అత్తగారి పాత్ర చేశారు. సుబ్రమణ్యం కుమారుడు ఏమో 'మా నాన్న అల్లు అరవింద్' అని గొప్పలు చెప్పి ఓ డబ్బున్న అమ్మాయిని ప్రేమలో పడేశాడు. సుబ్రమణ్యం, అతని కుమారుడు ఏం చేశారు? ఆ కుటుంబ కథ ఏమిటి? థియేటర్లలో చూడాల్సిందే.


అదిరిపోయే యాటిట్యూడ్ తో ఆకట్టుకున్న రావు రమేష్


'మారుతి నగర్ సుబ్రమణ్యం' ట్రైలర్ చూస్తే ఇది కంటెంట్ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని అర్థం అవుతోంది. ఆ కంటెంట్ ఒక ఎత్తు అయితే... రావు రమేష్ నటన మరొక ఎత్తు. టిపికల్ డైలాగ్ డెలివరీతో సుబ్రమణ్యం పాత్రలో జీవించారు. నుదుట నామాలు పెట్టి కుర్చీ తీసిన సన్నివేశంలో ఆయన చూపించిన యాటిట్యూడ్ నెవ్వర్ బిఫోర్ ఎవ్వర్ ఆఫ్టర్. అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి సైతం తమ నటనతో ఆకట్టుకున్నారు. డైలాగులు బావున్నాయి. సినిమాపై ట్రైలర్‌ భారీగా అంచనాలు పెంచింది.



ఆగష్టు 23న 'మారుతి నగర్ సుబ్రమణ్యం' విడుదల


ఈ సినిమాలో రావు రమేష్ తో పాటు ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి, హర్షవర్ధన్, అజయ్, అన్నపూర్ణమ్మ, ప్రవీణ్ ప్రధాన పాత్రలు పోషించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలు సంయుక్తంగా 'మారుతి నగర్ సుబ్రమణ్యం'తో చిత్రాన్ని నిర్మించాయి. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేస్తోంది. ఆగస్టు 23న సినిమాను గ్రాండ్ గా రిలీజ్ చేయబోతున్నారు. 


Read Also: ఈ దేశాన్ని పీడుస్తుంది దరిద్రం కాదు సార్‌.. నల్లధనం - ఆసక్తి పెంచుతున్న 'మిస్టర్‌ బచ్చన్‌' టీజర్‌