Rana Daggubati: మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ పొరపాటున సినిమాల్లోకి వచ్చారని.. లేకపోతే ఎలాన్ మస్క్‌లా మార్స్‌కు రాకెట్లు ఎగరేసేవారని దగ్గుబాటి రానా అన్నారు. గురువారం జరిగిన భీమ్లా నాయక్ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఈ కార్యక్రమంలో రానా దగ్గుబాటి మాట్లాడుతూ...‘స్టేజీ మీద ఉన్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ఈ సినిమాతో నేను చాలా మంది మేధావులను కలిశాను. నేను నటుడినై 12 సంవత్సరాలు అయింది. ఎన్నో తెలుగు సినిమాలు, హిందీ సినిమాలు చేశాను కానీ... తెలుగు సినిమా హీరోని ఎలా అవ్వాలో తెలియలేదు.’


‘నా చిన్నప్పటి నుంచి చాలా మంది దర్శకులు నాకు నటన నేర్పించారు. కానీ హీరోని ఎలా అవ్వాలో తెలియలేదు. అప్పుడు నా కళ్ల ముందుకు వచ్చారు హీరో (పవన్ కల్యాణ్‌ను చూపిస్తూ). నేను భారతదేశంలో ఎంతో మంది హీరోలు, సూపర్ స్టార్లతో పనిచేశాను కానీ పవన్ కల్యాణ్ కొంచెం డిఫరెంట్. ఆయన స్పెషల్ కూడా.’


‘ఇప్పటివరకు నేను చేసిన సినిమాలు ఒకలా ఉంటే... పవన్ కల్యాణ్ ఇన్‌ఫ్లుయెన్స్‌తో ఇక ముందు చేసే సినిమాలు మరో స్థాయిలో ఉండబోతున్నాయి. ఈ సినిమాలో నేను కలసిన ఇంకో మేధావి త్రివిక్రమ్ శ్రీనివాస్. ఆయన పొరపాటున సినిమాల్లోకి వచ్చారు. కానీ బయట ఉండి ఉంటే ఎలాన్ మస్క్‌లా రాకెట్లు మార్స్‌కి ఎగరేసేవారు. అలాంటి ఆలోచనలు ఆయనవి. త్రివిక్రమ్ లేకపోతే ఈ సినిమా లేదు. ఆయనకు చాలా థ్యాంక్స్.’


‘ఈ సినిమా నిర్మాతలు సూర్యదేవర నాగవంశీ, చినబాబులకు ధన్యవాదాలు. నిజానికి ఈ సినిమాలో పవన్ కల్యాణ్ కంటే ముందునుంచే నేను ఉన్నాను. నా తర్వాతే మీరు జాయిన్ అయ్యారు. మీకు తెలుసో.. లేదో.. (పవన్ కల్యాణ్‌ను చూస్తూ). ఈ సినిమాలో ఎంతో మంది గొప్ప నటులు ఉన్నారు. వారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. తెలుగు సినిమాకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్న సపోర్ట్‌కు ధన్యవాదాలు. త్వరలో హైదరాబాద్ భారతీయ సినిమాకు రాజధాని అయ్యేలా చేస్తాం.’ అంటూ తన స్పీచ్‌ను ముగించారు.