Rajkumar Hirani About Ram Charan: దర్శకధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి తెరకెక్కించిన ‘RRR’ చిత్రంతో అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు మెగా పవర్‌స్టార్ రామ్ చరణ్‌. ఈ చిత్రంలో అల్లూరి సీతారామ రాజు పాత్రలో నటించి ప్రపంచ వ్యాప్తంగా పాపులర్ అయ్యారు. ప్రస్తుతం తమిళ దర్శకుడు శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ సినిమా చేస్తున్న ఆయన, ‘ధూమ్ 4’లో నటిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అటు బాలీవుడ్  దర్శకుడు రాజ్ కుమార్ హిరానీతో కూడా ఓ సినిమా చేస్తున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా ఈ వార్తలపై రాజ్ కుమార్ స్పందించారు. అవన్నీ కేవలం ఊహాగానాలు మాత్రమేనని వెల్లడించారు.


తక్కువ సినిమాలు చేసినా అద్భుత గుర్తింపు


హిందీ చిత్ర పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు రాజ్‌కుమార్ హిరానీ. ఆయన సినిమా తీశారంటే బ్లాక్ బస్టర్ అందుకోవాల్సిందే. ఆయన ఇప్పటి వరకు చాలా తక్కువ సినిమాలు తీసినప్పటికీ, ఇండియన్ బెస్ట్ డైరెక్టర్ల లిస్టులో ఆయన పేరు తప్పకుండా ఉంటుంది. IMD వ‌ర‌ల్డ్ టాప్ 10 ద‌ర్శ‌కుల‌లో రాజ్‌కుమార్ రెండ‌వ స్థానాన్ని సంపాదించారు. అంటే, ఆయన స్థాయి ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. రాజ్ కుమార్ ఇప్పటి వరకు కేవలం 5 సినిమాలను మాత్రమే తెరకెక్కించారు. ఒక్కో జానర్ లో ఒక్కో సినిమా రూపొందింది. ఈ ఐదు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర మంచ వసూళ్లను రాబట్టాయి. 2018లో ఆయన తెరకెక్కించి ‘సంజు’ త‌ర్వాత దాదాపు ఐదేళ్లు గ్యాప్ తీసుకుని, బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ తో ‘డంకీ’ సినిమా చేశారు. డిసెంబ‌ర్ 21న విడుద‌లై ఈ మూవీ 10 రోజుల్లో రూ. 340 కోట్లు వసూళు చేసింది.


ప్రస్తుతం ఎలాంటి సినిమా ప్లాన్ లేదు- రాజ్ కుమార్


అటు రాజ్ కుమార్ హిరానీ తదుపరి చిత్రం రామ్ చరణ్ తో ఉండబోతుందని వార్తలు వచ్చాయి. ఈ వార్తలపై తాజాగా ఆయన స్పందించారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన ఈ వార్తలన్నీ అవాస్తవాలేనని చెప్పారు. ప్రస్తుతం తాను ఎలాంటి సినిమా ప్లాన్ చేయడం లేదన్నారు. అయితే, రామ్ చరణ్ నటించిన ‘RRR’ సినిమాను చూసినట్లు చెప్పారు. అందులో చెర్రీ నటన చాలా బాగుందన్నారు. ఆయనతో ఇప్పుడు సినిమా చేయకపోయినా, భవిష్యత్ లో తప్పకుండా చేస్తానని చెప్పారు. తన ప్రాజెక్టులో ఆయన భాగస్వామ్యం కావాలని కోరారు.  


‘గేమ్ ఛేంజర్’ షూటింగ్ లో చెర్రీ బిజీ


ప్రస్తుతం రామ్ చరణ్ దర్శకుడు శంకర్ తో ‘గేమ్ ఛేంజర్’ అనే సినిమా చేస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కొనసాగుతోంది. బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది వినాయక చవితికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన తెలిపారు. ఈ సినిమా తర్వాత ‘ఉప్పెన’ దర్శకుడు బుచ్చిబాబుతో కలిసి ఓ ప్రాజెక్ట్ చేయబోతున్నారు.


Read Also: సంక్రాంతికి 'నా సామిరంగ' - రిలీజ్ డేట్ చెప్పిన నాగ్, సెంటిమెంట్ వర్కవుట్ అయ్యేనా?