భారతీయులు ఎంతగానో ఎదురు చూసిన ఆస్కార్ వచ్చేసింది. ‘RRR’ నాటు నాటు.. పాటకు ప్రపంచ ప్రఖ్యాత సినీ అవార్డు మోకరిల్లింది. హాలీవుడ్ దిగ్గజ సినిమాల్లోని పాటలను వెనక్కి నెట్టి సగర్వంగా ఆస్కార్ ను అందుకుంది. అయితే, ప్రపంచ వ్యాప్తంగా ఊపు ఊపేస్తున్న ‘నాటు నాటు’ పాటకు ఆస్కార్ వేదికపై హీరోలు రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేస్తారని ముందు ప్రచారం జరిగింది. కానీ, చివరకు వారు ప్రదర్శనలో పాల్గొనలేదు. దీంతో అభిమానులు చాలా హర్ట్ అయ్యారు.


ఎందుకు డ్యాన్స్ చేయలేదంటే?


‘RRR’ హీరోలు ఆస్కార్ వేదికపై ఫర్మార్మెన్స్ ఎందుకు ఇవ్వలేదో తాజాగా నిర్మాత రాజ్ కపూర్ వెల్లడించారు. వారి స్థానంలో లాస్ ఏంజెల్స్ డ్యాన్సర్లను ఎంపిక చేసినట్లు చెప్పారు. “ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను ప్రదర్శించే అరుదైన అవకాశం మన వారికి దక్కింది. ఆస్కార్ 2023 వేదికపై కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ పాడుతుంటే రామ్ చరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్ చేయాల్సి ఉండేది. కానీ, పలు కారణాలతో వారు వెనక్కి తగ్గారు. వారి వ్యక్తిగత కారణాలు, ప్రాక్టీస్ కు సమయం లేకపోవడం సహా పలు కారణాలతో తప్పుకున్నారు. ఒరిజినల్ నంబర్‌ సాంగ్ కు సంబంధించి రెండు నెలల పాటు వర్క్‌ షాప్ చేశారు. ఆ తర్వాత రిహార్సల్ చేసి 15 రోజుల పాటు పాటను చిత్రీకరించారు.  కానీ, ఇక్కడ వారికి ప్రాక్టీస్ చేసే అవకాశం దొరకకపోవడంతో ‘నాటు నాటు’ ప్రదర్శనను  లాస్ ఏంజిల్స్‌ లో ప్రొఫెషనల్ డ్యాన్సర్‌లతో రిహార్సల్ చేయించాం. సుమారు 18 గంటల పాటు వారి రిహార్సల్స్ కొనసాగాయి” అని వెల్లడించారు. న్యూఢిల్లీలో పుట్టి కెనడాలో పెరిగిన నిర్మాత రాజ్‌కపూర్‌కి చాలా సంవత్సరాలుగా అకాడమీ సంస్థతో అనుబంధం ఉంది. గాయకులు, కాల భైరవ, రాహుల్ సిప్లిగంజ్‌ తో ‘నాటు నాటు’ ప్రత్యక్ష ప్రదర్శన కోసం అతను ‘RRR’ బృందంతో కలిసి పనిచేశారు.


ముందుగానే హింట్ ఇచ్చిన జూ. ఎన్టీఆర్


అటు ఎన్టీఆర్ కూడా ఆస్కార్ వేదికపై తమ ప్రదర్శన ఉండబోదని ముందుగానే వెల్లడించారు.  “ఆ ఆస్కార్‌ వేదికపై ‘నాటు నాటు’ పాటను లైవ్‌లో చూడాలని ఆసక్తిగా ఉన్నాను. మేము ఆ పాటకు డ్యాన్స్‌ వేస్తామని కచ్చితంగా చెప్పలేను. నాకు, రామ్‌ చరణ్‌కు రిహార్సల్స్‌ చేసే సమయం లేదు. అందుకే మేము ఆస్కార్‌ వేదికపై డ్యాన్స్‌ చేయలేకపోతున్నాం. ఆ పాటను ఎప్పుడు విన్నా నా కాళ్లు డాన్స్‌ చేస్తూనే ఉంటాయి’’ అంటూ వేడుకకు ముందే ఆయన ప్రకటించారు. ఆయన చెప్పినట్లుగానే ఈ వేదికపై చెర్రీ, జూనియర్ కాకుండా ప్రొఫెషనల్ డ్యాన్సర్ ప్రదర్శనలో పాల్గొన్నారు.  


ఆస్కార్స్ వేడుకలో ‘RRR’ టీమ్ సందడి


లాస్ ఏంజిల్స్ లో జరిగిన ఆస్కార్ అవార్డుల వేడుకలో ‘RRR’ టీమ్ సందడి చేసింది.  దర్శకుడు SS రాజమౌళి, అతని భార్య రమా రాజమౌళి, రామ్ చరణ్, అతడి భార్య ఉపాసన, Jr NTR, MM కీరవాణి, అతడి భార్య  శ్రీ వల్లి, గీత రచయిత చంద్రబోస్, కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్, SS కార్తికేయ ఆస్కార్ 2023లో టీమ్ ‘RRR’కి ప్రాతినిధ్యం వహించారు.


Read Also: మీకు తెలుసా? చెర్రీ, ఉపాసన ఎక్కడకెళ్లినా చిన్న సైజు ఆలయాన్ని వెంట తీసుకెళ్తారట!