'లైగర్' సినిమా (Liger Movie) విడుదలై దాదాపు ఐదు నెలలు కావొస్తుంది. అయితే, ఇంకా గొడవలు సెటిల్ కాలేదని ఫిల్మ్ నగర్ టాక్. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'లైగర్'... 2022లో విడుదలైన డిజాస్టర్ సినిమాల్లో ఒకటిగా నిలిచింది. బడ్జెట్ రికవరీ కాలేదు. ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ నష్టాలు తీసుకు వచ్చింది. రిజల్ట్ మీద అందరికీ క్లారిటీ ఉంది. అయితే... డిజాస్టర్ అని తేలిన తర్వాత పూరికి, డిస్ట్రిబ్యూటర్లకు మధ్య గొడవలు వచ్చాయి. 


లేటెస్ట్ ఫిల్మ్ నగర్ టాక్ ఏంటంటే... 'లైగర్' కోసం చేసిన అప్పులు, అగ్రిమెంట్లు ఇంకా పూరిని వెంటాడుతున్నాయట. తమ నష్టాలు పూడ్చుకోవడనికి, తమ డబ్బు రికవరీ చేసుకోవడానికి డిస్ట్రిబ్యూటర్లు వెయిట్ చేస్తున్నారట. 


అగ్రిమెంట్లలో తిరకాసు!?
'లైగర్' నిర్మాతల్లో దర్శకుడు పూరి జగన్నాథ్, ఛార్మీ కౌర్ కూడా ఉన్నారు. అయితే, అగ్రిమెంట్లు వాళ్ళిద్దరూ చేయలేదని గుసగుస. ఇద్దరు ఫైనాన్షియర్లు చేశారట. ఆ అగ్రిమెంట్లలో కూడా తిరకాసు ఉందట. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లు చట్టపరంగా ముందుకు వెళ్ళాలని డిసైడ్ అయ్యారట. 


Also Read : 'మిషన్ మజ్ను' రివ్యూ : రష్మిక 'మజ్ను' గురి తప్పిందా? బావుందా? 


కమిషన్ తీసుకుని, 'లైగర్'ను అడ్వాన్స్ పద్ధతి మీద విడుదల చేయడానికి అగ్రిమెంట్లు చేసుకున్నారట. నష్టాలు రావడంతో ఫైనాన్షియర్లకు ఇచ్చిన డబ్బులు వెనక్కి ఇవ్వమని అడుగుతున్నారు. అటు ఫైనాన్షియర్లు, పూరికి కూడా గొడవలు ఉన్నాయని ఆ మధ్య వాట్సాప్ ఆడియో లీక్ కావడం, ఆ తర్వాత పూరి ఓ లేఖ విడుదల చేయడంతో తెలిసింది. ఇప్పుడు ఈ గొడవ ఎటు తిరిగి, ఎటు వెళుతుందనేది ఆసక్తిగా మారింది. గొడవలు పక్కన పెట్టి... పూరి తన తదుపరి స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. 


చిరంజీవి... రామ్...
పూరి సినిమా ఎవరితో!
'లైగర్' డిజాస్టర్ తర్వాత, ఆ సినిమా విడుదల కంటే ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో స్టార్ట్ చేసిన 'జన గణ మణ' సినిమాను విజయ్ దేవరకొండ పక్కన పెట్టేశారు. దాంతో పూరి ఖాళీ అయ్యారు. అలాగని, డిజప్పాయింట్ కాలేదు. తన  తదుపరి స్క్రిప్ట్ మీద కాన్సంట్రేట్ చేస్తున్నారు. 


Also Read : 'ఛత్రివాలి' రివ్యూ : కండోమ్ టెస్టర్‌గా రకుల్ శృంగార పాఠాలు - సినిమా ఎలా ఉందంటే? 


రామ్ హీరోగా 'ఇస్మార్ట్ శంకర్'కు సీక్వెల్ తీయాలనేది ప్లాన్. 'గాడ్ ఫాదర్' విడుదల సమయంలో పూరితో సినిమా చేయడానికి మెగాస్టార్ చిరంజీవి ఆసక్తి చూపించారు. వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరితో సినిమా చేస్తారా? లేదంటే ఆ మధ్య ముంబై వెళ్ళి నిర్మాణ సంస్థలతో చర్చించారు. సల్మాన్ హీరోగా సినిమా చేసే ఛాన్స్ ఉందని వినిపించింది. మరి, ఏ సినిమా ఓకే అవుతుందో చూడాలి. 



ఒక్కసారి 'లైగర్' విడుదల తర్వాత గొడవల నేపథ్యంలో పూరి జగన్నాథ్ విడుదల చేసిన లేఖ చూస్తే... 


దగా చేస్తే... ప్రేక్షకులనే చేశా! - పూరి
''ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా, ఎవరినీ మోసం చేయకుండా మన పని మనం చేసుకుంటూ పోతే... మనలను పీకే వాళ్ళు ఎవరూ ఉండరు. నేను ఎప్పుడు అయినా మోసం చేస్తే? దగా చేస్తే? అది నన్ను నమ్మి నా సినిమా టికెట్ కొన్న ప్రేక్షకులను మాత్రమే! ప్రేక్షకులను తప్ప నేను ఎవరిని మోసం చేయలేదు'' అని మీడియాకు రాసిన లేఖలో పూరి జగన్నాథ్ పేర్కొన్నారు. తన ప్రేక్షకులకు మాత్రమే తాను జవాబుదారీ అని ఆయన వివరించారు. మళ్ళీ ఇంకో సినిమా తీసి వాళ్ళను ఎంటర్‌టైన్ చేస్తానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. 


మోసం అనే మాట ఎందుకు వచ్చింది? 
పూరి లేఖలో మోసం అనే మాట ఎందుకు వచ్చిందంటే... ఈ మధ్య ఆయనకు, కొంత మందికి మధ్య జరిగిన గొడవల కారణంగా! 'లైగర్' బాక్సాఫీస్ దగ్గర ఘోరంగా బోల్తా కొట్టిన తర్వాత డబ్బులు వెనక్కి ఇవ్వమని డిస్ట్రిబ్యూటర్లు, ఫైనాన్షియర్లు, బయ్యర్లు, ఎగ్జిబిటర్స్ నుంచి పూరి జగన్నాథ్ మీద ఒత్తిడి పెరిగింది. తొలుత కొంత మొత్తం ఇవ్వడానికి ఆయన అంగీకరించారు. అయితే... డిస్ట్రిబ్యూటర్లు ధర్నా చేయడానికి రెడీ అవుతున్నారని తెలియడంతో పూరి హర్ట్ అయ్యారు. పరువు పోతుందని డబ్బులు ఇవ్వడానికి రెడీ అయితే... ధర్నా చేసిన వాళ్ళకు తప్ప మిగతా వాళ్ళకు ఇస్తానని తెలిపారు. అక్కడ నుంచి పరిస్థితులు మరింత దారుణంగా తయారయ్యాయి. 


కేసుతో మలుపు తిరిగిన పరిణామాలు! 
జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్‌లో డిస్ట్రిబ్యూటర్ వరంగల్ శ్రీను, ఫైనాన్షియర్ శోభన్ మీద పూరి జగన్నాథ్ కేసు పెట్టారు. తనకు, తన కుటుంబానికి వ్యతిరేకంగా హింసకు పాల్పడే విధంగా వ్యక్తులను ప్రేరేపిస్తున్నారని తన ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. తాను ప్రస్తుతం ముంబైలో ఉన్నానని, తాను ఇంటి దగ్గర లేని సమయంలో తన కుటుంబ సభ్యులకు ఏదైనా హాని తల పెట్టవచ్చని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దాంతో పూరి ఇంటి దగ్గర పోలీసులు భద్రత కల్పించారు.


పూరి జగన్నాథ్ ఫిర్యాదుతో డిస్ట్రిబ్యూటర్లకు షాక్ తగిలింది. తమను పూరి మోసం చేశారనే ఫీలింగ్ వారిలో ఉంది. ఫిలిం నగర్ అంతర్గత సంభాషణల్లో వారు ఆ అలా మాట్లాడుతున్నారట. అందుకని, తాను ఎవరినీ మోసం చేయలేదని పూరి చెప్పారనుకోవాలి. అదీ సంగతి! పూరి విడుదల చేసిన లేఖలో ఫిలాసఫీ ఎక్కువ కనిపించింది. మరణించిన తర్వాత ఎవరూ రూపాయి తీసుకు వెళ్లలేరని, సక్సెస్ అండ్ ఫెయిల్యూర్స్ ఒకదాని తర్వాత మరొకటి అలల తరహాలో వస్తాయని పేర్కొన్నారు.