సోనూ సూద్ మంచి మనసు గురించి తెలిసిందే. కరోనా కాలంలో ఎంతో మందికి ఆయన సాయం చేశారు. ఎంతో మంది ప్రాణాలు కాపాడారు. తన వంతు ప్రయత్నం చేశారు. ఇప్పుడు మరోసారి ఆయన మానవత్వం చాటుకున్నారు. రోడ్డు ప్రమాదానికి గురైన యువకుడి ప్రాణాలు కాపాడారు. అసలు వివరాల్లోకి వెళితే... 
ప్రస్తుతం సోనూ సూద్ పంజాబ్‌లో ఉన్నారు. అక్కడ మొగ జిల్లాలో ప్రయాణం చేస్తుండగా... రోడ్డు మీద జరిగిన ఓ యాక్సిడెంట్ ఆయన కంట పడింది. రెండు కార్లు ఢీ కొట్టుకోవడంతో అందులో యువకులు అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. విషయం తెలిసిన సోనూ సూద్... తీవ్ర గాయాల పాలైన యువకుడిని ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సోనూ సూద్ మానవత్వం గురించి మరోసారి ప్రజలు గొప్పగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ యువకుడి ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం లేదని తెలిసింది.