పునీత్ రాజ్‌కుమార్ మరణించి దాదాపు నాలుగు నెలలు దాటిపోతోంది. ఇప్పటికీ అభిమానులు అతడి మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. మార్చి 17నే ఆయన పుట్టినరోజు. దీంతో ఆయన అభిమానులంతా ఈ రోజు ఎన్నో సేవాకార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన మరణించిన సంగతి ఇప్పటికీ అతని కుటుంబసభ్యుల్లోని ఓ వ్యక్తికి తెలియదు. ఆమె పునీత్ మేనత్త నాగమ్మ. ఆమెకు 90 ఏళ్లు ఉంటాయి. పునీత్ తండ్రికి ఆమె సొంత చెల్లెల్లు. అన్న కుటుంబమంటే ప్రాణం. ముఖ్యంగా అన్న పిల్లలంటే మరీ ఇష్టం. కొన్నేళ్ల క్రితం పునీత్ రెండో అన్న చనిపోతే ఆమె తట్టుకోలేకపోయింది. తీవ్రమైన బాధతో గుండెపోటుకు గురైంది. ఆసుపత్రిలో చేర్చింది చికిత్స అందించాల్సి వచ్చింది. అప్పట్నించి ఆమెను చాలా జాగ్రత్తగా చూసుకుంటోంది పునీత్ కుటుంబం. అందరిలో చిన్నవాడైన పునీత్ అంటే ఆమెకు ఎంతో ప్రాణం. దీంతో అతని మరణవార్త తెలిస్తే ఆమె ఏమైపోతుందోనని భయపడింది కుటుంబం. అందుకే ఆమెకు ఇంతవరకు పునీత్ లేరన్న విషయాన్ని చెప్పలేదు. ఆమె అడిగినప్పుడల్లా విదేశాలకు షూటింగ్‌కు వెళ్లారని చెబుతున్నారు. అంతేకాదు ఇంటికొచ్చే అతిధులు కూడా ఆమె ముందు పునీత్ పేరు ఎత్తకుండా జాగ్రత్తపడుతున్నారట. 


చివరి సినిమా
పునీత్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ ను థియేటర్లలో విడుదలచేశారు. అతడి అభిమానులు భారీగా థియేటర్లకు తరలివెళ్లారు. తమ అభిమాన నటుడిని చూసి కేరింతలు కొట్టారు. ఈ సినిమాలు కన్నడతో పాటూ తెలుగు, హిందీలో కూడా నిర్మించారు. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 4000 స్క్రీన్లపై సినిమాను ప్రదర్శిస్తున్నారు. థియేటర్లో పునీత్ పేరు మారుమోగిపోతోంది. 


గతేడది అక్టోబరు 29న జిమ్ లో ఉండగా ఆయనకు గుండెలో ఇబ్బందిగా అనిపించింది. తమ వ్యక్తిగత డాక్టరును కలిసి ఆయన సలహామేరకు ఆసుపత్రిలో చేరేందుకు భార్యతో కలిసి బయల్దేరారు పునీత్. కానీ కార్డియాక్ అరెస్టు రావడంతో ఆసుపత్రి దగ్గరే మరణించారు. అకస్మాత్తుగా గుండెకు రక్త ప్రసరణ ఆగిపోవడం మరణించినట్టు పునీత్ కుటుంబ వైద్యుడు తెలిపారు.