మణిరత్నం కలల చిత్రం 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్ మంగళవారం రాత్రి చెన్నైలో విడుదలైంది. ట్రైలర్‌తో పాటు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన పాటల్ని కూడా విడుదల చేశారు. ఈ వేడుకకు సూపర్ స్టార్ రజనీకాంత్, లోక నాయకుడు కమల్ హాసన్ ముఖ్య అతిథులుగా విచ్చేశారు. ఈవెంట్ హైలైట్స్ ఏంటి? అని చూస్తే...


రజనీకాంత్ (Rajinikanth) కు జంటగా 'రోబో' సినిమాలో ఐశ్వర్యా రాయ్ బచ్చన్ (Aishwarya Rai Bachchan) నటించారు. ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చాలా రోజుల తర్వాత వీళ్ళిద్దరూ 'పొన్నియన్ సెల్వన్' వేడుకలో కలిశారు. సూపర్ స్టార్‌ను చూడగానే ఆయన కాళ్ళకు ఐశ్వర్య నమస్కరించారు. పాదాలు తాకి తన గౌరవాన్ని చాటుకున్నారు. ఆమెను రజనీకాంత్ ఆత్మీయంగా దగ్గరకు తీసుకున్నారు.






గతంలోనూ ఐశ్వర్య ఈ విధంగా రజనీకాంత్ కాళ్ళకు నమస్కరించారు. అందువల్ల, 'పొన్నియన్ సెల్వన్' వేడుకలో ఆ విధంగా జరగవచ్చని ప్రేక్షకులు ముందుగా ఊహించారు. ఆ ఊహ నిజమైంది.






కమల్ హాసన్ చేయాలనుకున్న చిత్రమిది
మణిరత్నంతో 1989లో 'పొన్నియన్ సెల్వన్' సినిమాను కమల్ హాసన్ చేయాలని అనుకున్నారు. అయితే, ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కలేదు. ఆయన చేయకపోవడం వల్ల తమకు అవకాశం వచ్చిందని కార్తీ అన్నారు. కమల్ హాసన్‌కు థాంక్స్ చెప్పారు. కమల్ చేయాలనుకున్న పాత్ర తాను చేశానని, ఈ పాత్ర చేయడానికి చాలా భయపడ్డానని కార్తీ తెలిపారు.
 
రెండు సినిమాలు 155 రోజుల్లో పూర్తి
Ponniyin selvan Second Part Shoot Completed : 'పొన్నియన్ సెల్వన్'ను రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మొదటి భాగం పాటలు, ప్రచార చిత్రాలు విడుదల అయ్యాయి. సెప్టెంబర్ 30న సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది. అయితే, రెండో భాగం చిత్రీకరణ కూడా పూర్తయింది. రెండు భాగాలను 155 రోజుల్లో పూర్తి చేశామని 'జయం' రవి తెలిపారు. మణిరత్నం లేకపోతే ఈ సినిమా సాధ్యమయ్యేది కాదని ఆయన పేర్కొన్నారు.


కమల్ - రజనీ ఆత్మీయ పలకరింపు
'పొన్నియన్ సెల్వన్' వేడుకకు రజనీకాంత్ ముందుగా వచ్చారు. ఆయన తర్వాత వచ్చిన కమల్ హాసన్... ముందుగా చిరకాల మిత్రుడి దగ్గరకు వెళ్లారు. వాళ్ళిద్దరి పలకరింపు, ఆత్మీయ కౌగిలింత అందరి దృష్టిని ఆకర్షించింది. సౌత్ ఇండియన్ స్టార్ దర్శకుడు శంకర్, హీరోయిన్ అదితీ రావు హైదరి తదితరులు కూడా ఈ వేడుకకు అతిథులుగా హాజరయ్యారు.


'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్‌ (Ponniyin Selvan Movie) కు హిందీలో అనిల్ కపూర్, తమిళంలో కమల్ హాసన్, తెలుగులో రానా దగ్గుబాటి, మలయాళంలో పృథ్వీరాజ్ సుకుమారన్, కన్నడలో జయంత్ కైకిని వాయిస్ ఓవర్ అందించారు.


Also Read : రాజ మందిరంలోకి వంచన, ద్రోహం - మణిరత్నం తీసిన విజువల్ వండర్, 'పొన్నియన్ సెల్వన్' ట్రైలర్


మద్రాస్ టాకీస్, లైకా ప్రొడక్షన్స్ సంస్థలు ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మించాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో సెప్టెంబర్ 30న భారీ ఎత్తున విడుదల చేస్తున్నారు. ఈ సినిమాలో త్రిష, శోభితా ధూళిపాళ, పార్తీబన్, నాజర్, ప్రకాష్ రాజ్, జయరామ్, ఐశ్వర్య లక్ష్మి, విక్రమ్ ప్రభు ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.


Also Read : పవన్ కోసం మూడు కథలు రెడీ చేసిన సుజిత్ - 'బిల్లా', 'పంజా' తరహాలో?