ప్రియమణి (Priyamani) అలియాస్ ప్రియ వాసుదేవ్ మణి అయ్యర్ వ్యక్తిగత జీవితంలో ఏం జరుగుతోంది? ఆమె వైవాహిక జీవితంలో సమస్యలు మొదలు అయ్యాయా? తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పలు పుకార్లు షికార్లు చేస్తున్నాయి. అయితే, ఆ పుకార్లలో నిజం లేదని సమాచారం. కాకపోతే కథానాయిక కావడంతో ప్రియమణి జీవితంపై ఇటు పరిశ్రమలో, అటు జనాల్లో ఆసక్తి ఎక్కువ ఉంది. అసలు వివరాల్లోకి వెళితే... 


వేర్వేరుగా ప్రియమణి, ముస్తఫా?
ప్రియమణి పెళ్లి జరిగి ఐదేళ్లు దాటింది. ఆగస్టు 23, 2017లో వ్యాపారవేత్త (ఈవెంట్ ఆర్గనైజర్) ముస్తఫా రాజ్‌తో ఆమె వైవాహిక బంధంలోకి అడుగు పెట్టారు. ఆయనకు ఇది రెండో పెళ్లి. మొదటి భార్యతో వేరు పడిన తర్వాత ప్రియమణిని పెళ్లాడారు. ఇంకో విషయం... ఆయన ముస్లిం. ప్రియమణి అయ్యంగార్స్ అమ్మాయి. మతం వీళ్లిద్దరి ప్రేమకు, పెళ్ళికి అడ్డు కాలేదు. ముస్లింను పెళ్లి చేసుకున్నందుకు కొన్ని విమర్శలు వచ్చినప్పటికీ... ప్రియమణి ఎప్పుడూ ఆలోచించినది లేదు. భర్తపై తనకు ఉన్న ప్రేమను పలు సందర్భాల్లో చాటుకున్నారు. 


ఇప్పుడు రూమర్ విషయానికి వస్తే... ప్రియమణి, ముస్తఫా రాజ్ (Priyamani Husband Mustafa Raj) మధ్య విబేధాలు వచ్చాయని, ఇద్దరూ వేర్వేరుగా ఉంటున్నారని, ఒకే ఇంటిలో కాపురం చేయడం లేదని పుకార్లు వినిపిస్తున్నాయి. వీటిని ప్రియమణి టీమ్ కొట్టి పారేసింది. మాధవన్ కథానాయకుడిగా నటించడంతో పాటు దర్శకత్వం వహించిన 'రాకెట్రీ : ద నంబి ఎఫెక్ట్' సక్సెస్ పార్టీకి ప్రియమణి భర్తతో అటెండ్ అయ్యారని, అక్కడ పార్టీలో వీడియో ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారని ఆమె టీమ్ గుర్తు చేసింది. ఆ పార్టీ జరిగి పది వారాలు మాత్రమే అయ్యిందని, ఆ వీడియో ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో ఉందని పేర్కొంది. వాళ్ళిద్దరూ కలిసి ఉన్నారని చెప్పడానికి అంత కంటే ప్రూఫ్ అవసరమా? అని ప్రశ్నించింది. 


Also Read : 'అమ్ము' రివ్యూ : చిత్రహింసలు పెట్టే, కొట్టే భర్తను భార్య భరించాల్సిందేనా? ఐశ్వర్య లక్ష్మీ సినిమా ఎలా ఉందంటే?






మొదటి భార్యతో ప్రియమణి భర్తకు గొడవ?
ప్రియమణి భర్తకు మొదటి భార్యతో గొడవలు జరుగుతున్నాయని, లీగల్ ఇష్యూస్ ఏవో ఉన్నాయని సమాచారం. ఆ గొడవ వల్ల ప్రియమణి జీవితంలో ఎటువంటి సమస్య లేదని టాక్. తన వ్యక్తిగత జీవితంపై వస్తున్న పుకార్లకు త్వరలో ఆమె స్పందించనున్నట్లు సమాచారం.


వరుస సినిమాలతో ప్రియమణి బిజీ!
ప్రియమణి సినిమాలకు వస్తే... ఇప్పుడు ఆమె చాలా బిజీ బిజీ. ఈ ఏడాది 'ఆహా' ఓటీటీలో విడుదలైన 'భామా కలాపం'లో ప్రధాన పాత్ర పోషించారు. రానా దగ్గుబాటి, సాయి పల్లవి జంటగా నటించిన 'విరాట పర్వం'లో కీలక పాత్ర చేశారు. ప్రస్తుతం అక్కినేని నాగచైతన్య కథానాయకుడిగా దర్శకుడు వెంకట్ ప్రభు తెరకెక్కిస్తున్న తెలుగు, తమిళ ద్విభాషా చిత్రంలో ఓ పాత్ర చేస్తున్నారు. హిందీలో షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వం వహిస్తున్న 'జవాన్'లోనూ ఓ పాత్ర చేస్తున్నారు. 


విలన్ లేదంటే కామెడీ!
ప్రియమణి తన కెరీర్‌లో చాలా చిత్రాలు ఉన్నాయి. హిట్ వెబ్ సిరీస్ 'ది ఫ్యామిలీ మ్యాన్' ఉంది. కథానాయికగా కమర్షియల్ సినిమాలు చేశారు. వైవిధ్యమైన పాత్రల్లో కనిపించారు. ప్రత్యేక గీతాల్లో డ్యాన్స్ చేశారు. మరి, ఆమెకు డ్రీమ్ రోల్ ఏమైనా ఉందా? అంటే... "ఫుల్ లెంగ్త్ కామెడీ ఫిల్మ్ చేయాలని ఉంది. అలాగే, గ్రే షేడ్స్ ఉన్న క్యారెక్టర్  కూడా చేయాలని ఉంది. ఈ రెండూ నేను ఇప్పటి వరకూ చేయలేదు" అని ఆ మధ్య ప్రియమణి తెలిపారు.