రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా శుక్రవారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పూజా హెగ్డే హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రభాస్ పామిస్ట్ గా నటించారు. అంటే చేతిరేఖలను చూసి భవిష్యత్తు చెప్పే క్యారెక్టర్. అవుట్ అండ్ అవుట్ లవ్ స్టోరీగా రూపొందించిన ఈ సినిమాకి మిశ్రమ స్పందన వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొన్నారు ప్రభాస్. ఈ క్రమంలో చాలా విషయాలను షేర్ చేసుకున్నారు. 

 

నటి కంగనా రనౌత్ గురించి ఓ ఇంట్రెస్టింగ్ విషయాన్ని మీడియా వేదికగా వెల్లడించారు ప్రభాస్. వీరిద్దరూ కలిసి 'ఏక్ నిరంజన్' అనే సినిమాలో నటించారు. ఈ సినిమా విడుదలైన పన్నెండేళ్లు దాటేసింది. అయితే ఈ సినిమా షూటింగ్ సమయంలో ప్రభాస్-కంగనా మధ్య ఓ ఆసక్తికర సంభాషణ జరిగింది. ఆ సంగతులను వెల్లడించారు ప్రభాస్. కంగనా ఓ చిన్న గ్రామం నుంచి సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. 

 

ఆమెకి ఎలాంటి సినిమా బ్యాక్ గ్రౌండ్ లేదు. తను హీరోయిన్ అవుతానని ఎప్పుడూ అనుకోలేదట. అయితే ఓసారి తన ఊర్లో ఉండే ఓ జ్యోతిష్కుడి దగ్గరకు వెళ్లిందట. నిజానికి ఆమెకి జ్యోతిష్యంపై నమ్మకం లేనప్పటికీ సరదాగా తన జాతకం చూపించిందట. ఆ సమయంలో కంగనా హీరోయిన్ అవుతుందని ఆయన చెప్పారట. విలేజ్ కి చెందిన అమ్మాయిని కావడంతో వారు ఏడిపిస్తున్నారని భావించి అక్కడ నుంచి వచ్చేసిందట కంగనా. 

 

కానీ నిజంగానే 18 ఏళ్లకు నటిగా బాలీవుడ్ లో ఎంటర్ అయ్యానని.. ఆ జ్యోతిష్కుడు చెప్పిన విషయం అలా గుర్తుండిపోయిందని ప్రభాస్ తో చెప్పిందట. కంగనా చెప్పిన ఈ స్టోరీని ప్రభాస్ ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ప్రస్తుతం కంగనా.. వరుసగా లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటిస్తోంది. అలానే రీసెంట్ గా ఓ టీవీ షోకి హోస్ట్ గా కూడా వ్యవహరిస్తోంది.