పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోగా, ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సలార్’. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణాంతర పనులు జరుపుకుంటోంది. తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ గుడ్ న్యూస్ చెప్పారు. ఈ మూవీ తొలి భాగం ‘సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్’ విడుదల తేదీని అధికారికంగా ప్రకటించారు. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్ సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. భారీ మాస్ యాక్షన్‌ మూవీగా తెరకెక్కిన ‘సలార్’ సినిమా డిసెంబర్ 22న థియేటర్లోకి రాబోతోందని తెలిపింది. వాస్తవానికి ఈ సినిమా ఈ నెల 28న విడుదల కావాల్సి ఉంది. అయితే, వీఎఫ్ఎక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడంతో సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు.  


‘సలార్’ టీజర్ రిలీజ్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలోని యాక్షన్ సీక్వెన్స్, సినిమా మీద అంచనాలు భారీగా ఏర్పడ్డాయి. ‘సలార్’ ప్రపంచాన్ని ఎప్పుడెప్పుడు చూస్తామా? అని ఆడియెన్స్ ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే హోంబలే సంస్థ  ఆడియెన్స్‌ కు అద్భుతమైన సినిమాటిక్ ఎక్స్‌పీరియెన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. క్రిస్మస్ సీజన్‌లో ‘సలార్’ సినిమాను రిలీజ్ చేస్తున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి.


ఒంటినిండా రక్తంతో ప్రభాస్ బీభత్సం


ఇక తాజాగా విడుదలైన రిలీజ్ డేట్ పోస్టర్‌ను చూసి ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. పాన్ ఇండియ్ స్టార్, డార్లింగ్ ప్రభాస్ ఈ పోస్టర్‌లో బీభత్సం సృష్టించినట్టుగా కనిపిస్తోంది. ఒళ్లంతా రక్తం నిండిపోయింది. విలన్స్ బ్యాచ్ ను వేటాడి వెంటాడినట్టుగా అనిపిస్తోంది. ప్రభాస్ చేతిలో కత్తి, ఒంటికి అంటిన రక్తం చూస్తేనే ఈ సినిమాలో ఎలాంటి యాక్షన్ సీక్వెన్స్ ఉండబోతోన్నాయో అర్థం అవుతోంది.






దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాని మాఫియా, గ్యాంగ్ స్టర్ నేపథ్యంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ప్రభాస్ సరసన ఈ సినిమాలో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇందులో ఆమె 'ఆధ్య' అనే జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది. హోంబలే ఫిల్మ్స్ బ్యానర్ లో విజయ్ కిరగంధూర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ కుమార్ విలన్ పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా 'సలార్' మూవీ రాబోతోంది. అటు ‘మహానటి’ దర్శకుడు నాగ్ అశ్విన్‌తో కలిసి ప్రభాస్ ‘Kalki 2898 AD’ లో నటిస్తున్నారు. మరోవైపు మారుతి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని చేస్తున్నారు.  


వరుస సినిమాలతో అభిమానులను అలరించబోతున్న హొంబలే ఫిల్మ్స్ 


మరోవైపు ‘సలార్’ చిత్ర నిర్మాణ సంస్థ హొంబలే ఫిల్మ్స్  వరుసగా సినిమాలను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతోంది. ‘యువ’, ‘కాంతారా 2’, ‘రఘు తాత’, ‘రిచర్డ్ ఆంటోని’, ‘కేజీయఫ్ 3’, ‘సలార్ పార్ట్ 2’, ‘టైసన్’ లాంటి వంటి సినిమాలతో మున్ముందు ప్రేక్షకులను థ్రిల్ చేయబోతోంది.



ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial