టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రపంచవ్యాప్తంగా అభిమానులను సొంతం చేసుకున్న ఈ స్టార్ 'రాధేశ్యామ్' సినిమాతో ప్రేక్షకులను అలరించడానికి రెడీ అవుతున్నారు. మార్చి 11న తెలుగు, తమిళ, హిందీ, మలయాళ, కన్నడ భాషల్లో సినిమాను రిలీజ్ చేస్తున్నారు. దానికి తగ్గట్లుగానే ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ప్రస్తుతం ముంబైలో పలు ఛానెల్స్ కి ఇంటర్వ్యూలు ఇస్తున్నారు ప్రభాస్. 


ఈ క్రమంలో ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. నిజానికి ప్రభాస్ కి సిగ్గు చాలా ఎక్కువ. సినిమాల్లో రొమాంటిక్ సీన్స్, తన బాడీని ఎక్స్ పోజ్ చేసే సన్నివేశాల్లో నటించడానికి ప్రభాస్ చాలా ఇబ్బంది పడతారు. అందుకే దర్శకనిర్మాతాలకు ముందుగానే అలాంటి సీన్లు లేకుండా ఉండాలని చెబుతుంటారు. ఒకవేళ కథ డిమాండ్ చేస్తే మాత్రం.. ఇక తప్పని పరిస్థితి. అలాంటప్పుడు సెట్ లో అతి తక్కువ మంది ఉండేలా చూసుకుంటారు మేకర్స్. ఆ విధంగా ప్రభాస్ కొంత కంఫర్ట్ గా ఫీల్ అవుతారు. 


అయితే 'రాధేశ్యామ్' సినిమా విషయంలో డైరెక్టర్ కి ఎలాంటి రిక్వెస్ట్ చేయలేని పరిస్థితి. ఎందుకంటే ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ.. కాబట్టి సినిమాలో రొమాన్స్ కచ్చితంగా ఉంటుంది. కథ ప్రకారం.. ప్రభాస్ తన కోస్టార్ పూజాహెగ్డేతో కొన్ని కిస్సింగ్ సీన్స్ లో నటించాల్సి వచ్చిందట. ఆ సన్నివేశాలకు 'నో' చెప్పలేకపోయానని.. ఎందుకంటే ఈ సినిమాలో రొమాన్స్ ఉండాల్సిందేనని ప్రభాస్ చెప్పుకొచ్చారు. కమర్షియల్ సినిమాల్లో అలాంటి సీన్స్ ను అవైడ్ చేయొచ్చు కానీ 'రాధేశ్యామ్' లాంటి ప్రాజెక్ట్స్ లో పక్కన పెట్టలేమని అన్నారు. 


ఇన్ని సినిమాల్లో నటించినా.. ఇప్పటికీ తనకు సిగ్గు పోలేదని.. కోస్టార్స్ తో ఆన్ స్క్రీన్ రొమాన్స్ చేయడానికి ఇబ్బంది పడతానని.. అలానే షర్ట్ లేకుండా క్రూ మెంబర్స్ ముందు యాక్ట్ చేయడం కూడా తన వల్ల కాదని చెప్పుకొచ్చారు. అందుకే ఇలాంటి సీన్స్ ను ఐసోలేటెడ్ ఏరియాల్లో చిత్రీకరించామని దర్శకులను రిక్వెస్ట్ చూస్తుంటానని తెలిపారు ప్రభాస్. చాలా కాలం తరువాత ప్రభాస్ ఓ లవ్ స్టోరీలో నటించారు. ఈ సినిమాపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. మరి వాటిని ఈ సినిమా ఎంతవరకు రీచ్ అవుతుందో చూడాలి!