పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి ఉన్న ఫాలోయింగ్ గురించి తెలిసిందే. 'బాహుబలి' లాంటి సినిమా ఆయన ఇమేజ్ ను అమాంతం పెంచేసింది. ఆ తరువాత విడుదలైన 'సాహో' సినిమాకి ఫ్లాప్ టాక్ వచ్చినా.. వసూళ్లు మాత్రం ఓ రేంజ్ లో వచ్చాయి. ప్రస్తుతం ఈ హీరో 'రాధేశ్యామ్' సినిమాలో నటిస్తున్నాడు. రాధాకృష్ణ కుమార్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేయనున్నారు. ఈ సినిమాతో పాటు మరోపక్క 'సలార్' సినిమాలో కూడా నటిస్తున్నాడు. 


'కేజీఎఫ్' ఫేమ్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా ఫస్ట్ లుక్ తోనే ఫ్యాన్స్ ను ఖుషీ చేశాడు ప్రశాంత్ నీల్. ఇందులో ప్రభాస్ డాన్ తరహా పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా కనిపించనుంది. హైదరాబాద్ లో జరుగుతోన్న ఈ సినిమా షూటింగ్ కోసం రీసెంట్ గానే శృతిహాసన్ ముంబై నుండి హైదరాబాద్ కు వచ్చింది. 


దీంతో ఆమెకి స్పెషల్ ట్రీట్ ఇచ్చాడు ప్రభాస్. మామూలుగానే తన సినిమా సెట్స్ లోకి రెస్టారెంట్ లాంటి మెనూతో ఇంటి ఫుడ్ ను తీసుకొస్తాడు ప్రభాస్. ఆయన ఇంట్లో కూడా అలానే ఉంటుందట. ఇంటికి చాలా మంది వచ్చి తిని వెళ్తుంటారట. మొన్నామధ్య ఓ ఇంటర్వ్యూలో కృష్ణంరాజు భార్య తమ అతిథి మర్యాదల గురించి చెప్పుకొచ్చారు. తాజాగా ప్రభాస్ 'సలార్' సెట్ లో అందరికీ నోరూరిపోయే వంటకాలను వండించి మరీ తీసుకొచ్చినట్టు ఉన్నారు. 


ఈ మేరకు శృతిహాసన్ ముందు చాలా వంటలకు పెట్టినట్లు ఉన్నారు. దాదాపు ఇరవై రకాల వంటకాలను ప్రభాస్ స్పెషల్ గా తీసుకొచ్చారట. వాటిని ఆరగించిన శృతిహాసన్ ఒక్కో వంటకం గురించి సోషల్ మీడియా వేదికగా చెప్పుకొచ్చింది.  చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, గోంగూర మాంసం, కబాబ్, రకరకాల పప్పులు, సాంబార్, కర్రీలు ఇలా ప్రభాస్ తెచ్చిన వెరైటీ వంటకాలన్నింటిని చూపించారు. దీనికి సంబంధించిన వీడియోను ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ లో పోస్ట్ చేస్తూ ప్రభాస్ కు థాంక్స్ చెప్పింది. 


ఇక 'సలార్' సినిమా విషయానికొస్తే.. ప్రస్తుతం సినిమాకి సంబంధించిన కొన్ని కీలక యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సినిమాకి యాక్షన్ సీన్స్ హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ తో ఐటెం సాంగ్ ప్లాన్ చేస్తున్నారట. కత్రినా కైఫ్ లాంటి వాళ్లను రంగంలోకి దింపాలని చూస్తున్నారు. వచ్చే ఏడాదిలో ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.