'ఆర్ఎక్స్ 100' సినిమాతో టాలీవుడ్ లో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని పలు సినిమా అవకాశాలు దక్కించుకుంది. కానీ స్క్రిప్ట్ సెలెక్షన్ లో కొన్ని పొరపాట్లు చేయడంతో చాలా తక్కువ సమయంలోనే ఫేడవుట్ అయిపోయింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫొటోలు షేర్ చేస్తూ కాలం గడుపుతోంది. పంజాబీలో ఒకట్రెండు అవకాశాలు వచ్చినప్పటికీ.. టాలీవుడ్ మేకర్స్ మాత్రం ఆమెని మర్చిపోయారు. 


ఇలాంటి సమయంలో పాయల్ కి ఓ సినిమా ఆఫర్ వచ్చింది. మంచు విష్ణు హీరోగా ఓ సినిమా తెరకెక్కుతోంది. అవ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో ఈషాన్ సూర్య దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. కథ, స్క్రీన్ ప్లేతో అందించడంతో పాటు క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వ్యవహరించనున్నారు కోన వెంకట్. చోటా.కె.నాయుడు, అనూప్ రూబెన్స్ వంటి క్రేజీ టెక్నీషియన్స్ ఈ సినిమాకి పని చేయనున్నారు.


ఈ సినిమాలో మంచు విష్ణు 'గాలి నాగేశ్వరరావు' అనే పాత్ర పోషిస్తున్నట్లు అనౌన్స్ చేశారు. ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గా పాయల్ రాజ్ పుత్ ను ఫిక్స్ చేశారు. ఈ మేరకు ఆమె నుంచి అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. ఇందులో ఆమె స్వాతి అనే పాత్రలో కనిపించబోతుంది. మరి ఈ సినిమాతోనైనా పాయల్ హిట్టు కొడుతుందేమో చూడాలి. త్వరలోనే ఈ సినిమాను ప్రారంభించి రెగ్యులర్ షూటింగ్ మొదలుపెట్టనున్నారు.