పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా ఈ రోజు కొత్త సినిమా ప్రకటించారు. దీనికి 'సాహో' ఫేమ్ సుజిత్ (Sujeeth) దర్శకుడు. డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై డీవీవీ దానయ్య నిర్మిస్తున్నారు. ఈ రోజు అధికారికంగా ఈ సినిమాను ప్రకటించారు. ఈ చిత్రానికి రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్. 'ఆయన్ను ఒరిజినల్ గ్యాంగ్ స్టర్ అంటారు' (They Call Him #OG) అని సినిమా అనౌన్స్‌మెంట్ పోస్టర్ మీద పేర్కొన్నారు. 
 
రీమేక్ కాదు... స్ట్రెయిట్ సినిమా!
పవన్ కళ్యాణ్, సుజిత్ కాంబినేషన్‌లో సినిమా రీమేక్ కాదని తెలిసింది. పవర్ స్టార్ ఇమేజ్ దృష్టిలో పెట్టుకుని సుజిత్ స్టయిలిష్ యాక్షన్ స్క్రిప్ట్ డిజైన్ చేశారట. ఈ కథ కంటే ముందు అతడి చేతిలో 'తెరి' (తెలుగులో 'పోలీస్' పేరుతో విడుదల అయిన విజయ్, సమంత సినిమా) స్క్రిప్ట్ పెట్టారని, ఆ రీమేక్ చేయవచ్చని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపించింది. అయితే... సుజిత్ చెప్పిన కథ నచ్చడంతో స్ట్రెయిట్ సినిమా చేయడానికి పవన్ మొగ్గు చూపారు.
 
Pawan Kalyan New Movie : 'సాహో' తర్వాత సుజిత్ మరో సినిమా చేయలేదు. మూడేళ్లుగా పలు స్క్రిప్ట్స్ మీద వర్క్ చేశారు. పవన్ సినిమాకు ముందు వరుణ్ తేజ్ హీరోగా ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు కూడా వార్తలు వచ్చాయి. అయితే... చివరకు పవర్ స్టార్‌ను ఆయన మెప్పించారు. సొంత కథతో ఒప్పించారు.


'ఆర్ఆర్ఆర్' తర్వాత...
డీవీవీ నుంచి వస్తున్న!
ప్రపంచ ప్రేక్షకులు అందరూ తెలుగు సినిమా వైపు చూసేలా చేసిన 'ఆర్ఆర్ఆర్' (RRR Movie) తర్వాత డీవీవీ ఎంటర్‌టైన్‌మెంట్ నిర్మిస్తున్న చిత్రమిది. పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా డీవీవీ సంస్థలో రెండో చిత్రమిది. ఇంతకు ముందు పూరి జగన్నాథ్ దర్శకత్వంలో పవన్ హీరోగా 'కెమెరామెన్ గంగతో రాంబాబు' సినిమా నిర్మించారు. పదేళ్ళ తర్వాత మళ్ళీ పవన్‌తో సినిమా చేస్తుండటం విశేషం.






హరీష్ శంకర్ సినిమా ఎప్పుడు?
సుజిత్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సినిమా ప్రకటన రావడంతో ఇప్పుడు తెలుగు చలన చిత్ర పరిశ్రమతో పాటు ప్రేక్షకుల దృష్టి దర్శకుడు హరీష్ శంకర్ (Harish Shankar) వైపు పడింది. ఎందుకంటే... తన అభిమాన కథానాయకుడు పవర్ స్టార్‌తో 'గబ్బర్ సింగ్' వంటి హిట్ సినిమా తీసిన ట్రాక్ రికార్డు అతనిది. ఆ సినిమా తర్వాత 'భవదీయుడు భగత్ సింగ్' (Bhavadeeyudu Bhagat Singh) సినిమా అనౌన్స్ చేశారు. మైతీ మూవీ మేకర్స్ నిర్మాణంలో ఆ సినిమా ప్రకటన వచ్చిన కూడా చాలా రోజులు అయ్యింది. కానీ, ఇంత వరకు ఎప్పుడు సెట్స్ మీదకు వెళుతుంది? అనే క్లారిటీ లేదు.


Also Read : నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్, నా ఓటమిని ఒప్పుకుంటాను - పవన్ కల్యాణ్


'భవదీయుడు భగత్ సింగ్' కథ పక్కన పెట్టి... 'తెరి' రీమేక్ మీద వర్క్ చేయమని హరీష్ శంకర్‌కు పవన్  చెప్పినట్టు ఫిల్మ్ నగర్ భోగట్టా. మరోవైపు పవన్ సినిమా సెట్స్ మీదకు వెళ్ళడానికి సమయం పట్టేలా ఉండటంతో మధ్యలో మరో సినిమా చేయాలని హరీష్ శంకర్ ఆలోచిస్తున్నట్లు కూడా గుసగుసలు వినిపించాయి. ఏది నిజం అనేది హరీష్ చెబితే తప్ప తెలియదు. పవన్ ఎప్పుడూ సినిమాల గురించి చెప్పింది లేదు!


ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో ఏయం రత్నం నిర్మిస్తున్న 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు పవన్ కళ్యాణ్. చారిత్రక కథతో ఆ సినిమా రూపొందుతోంది.