పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీఎంట్రీలో బిజీ ఆర్టిస్ట్ గా మారారు. ఈ ఏడాది 'వకీల్ సాబ్' సినిమాతో ప్రేక్షకులను అలరించిన పవన్ కళ్యాణ్ ఇప్పుడు మలయాళంలో సూపర్ హిట్ గా నిలిచిన 'అయ్యప్పనుమ్ కోశియుమ్' రీమేక్ లో నటిస్తున్నారు. సితారా ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై ప్రస్తుతానికి 'ప్రొడక్షన్ నెం.12' అనే వర్కింగ్ టైటిల్‌ తో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పోలీస్ ఆఫీసర్ గా కనిపించనున్నారు. 


ఇటీవల ఆయన లుక్ ని, క్యారెక్టర్ పేరుని రివీల్ చేస్తూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో పవన్ కళ్యాణ్.. భీమ్లా నాయక్ అనే పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు. ఈ వీడియోకి ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు పవన్ అభిమానులను ఖుషీ చేసే మరో అప్డేట్ వచ్చింది. అదేంటంటే.. ఈ సినిమా టైటిల్ ను, ఫస్ట్ గ్లిమ్ప్స్ ను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. ఈ విషయాన్ని చిత్రబృందం తెలియజేస్తూ ఓ పోస్టర్ ను విడుదల చేసింది. 


ఇందులో పవన్ కళ్యాణ్ లుంగీ కట్టుకొని.. దాన్ని పైకి మడత పెడుతున్నట్లుగా కనిపిస్తున్నారు. పవన్ వెనుక నుండి కనిపిస్తున్న ఈ లుక్ ఫ్యాన్స్ ను ఎంతగానో ఆకట్టుకుంటుంది. 'భీమ్లా నాయక్ లుంగీ కట్టాడు' అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఈ పోస్టరే ఇలా ఉందంటే.. ఇక ఫస్ట్ గ్లిమ్ప్స్, టైటిల్ కి ఏ రేంజ్ రేంజ్ రెస్పాన్స్ వస్తుందో చూడాలి. సాగర్ చంద్ర డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాకి త్రివిక్రమ్ మాటలు-స్క్రీన్ ప్లే అందిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తున్నారు. 


ఇక ఈ సినిమాలో పవన్ తో పాటు రానా దగ్గుబాటి కూడా నటిస్తున్నారు. కథ ప్రకారం వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చే సన్నివేశాలు సినిమాకి హైలైట్ గా నిలవనున్నాయి. ఇక ఈ సినిమాలో పవన్ సరసన నిత్యామీనన్ హీరోయిన్ గా కనిపించనుంది. రానాకి జోడీగా ఐశ్వర్యా రాజేష్ నటిస్తుంది.