ఈమధ్య ఓటీటీల్లో వెబ్ సిరీస్ లకు ఆదరణ మరింత పెరిగిన విషయం తెలిసిందే. దీన్ని పసిగట్టిన పలు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ స్వయంగా వెబ్ సిరీస్ లను నిర్మిస్తూ ఆడియన్స్ కి అందిస్తున్నాయి. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ సంస్థ డిస్నీ ప్లస్ హాట్ స్టార్ ఇప్పటికే పలు వెబ్ సిరీస్ లను నిర్మించిన విషయం తెలిసిందే. రీసెంట్ టైమ్స్ లో డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మించిన 'సైతాన్', 'దయా' వంటి వెబ్ సిరీస్ లు తెలుగు ఆడియన్స్ ని విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఈ రెండు వెబ్ సిరీస్ లకు సంబంధించి నెక్స్ట్ సీజన్ కోసం సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే హాట్ స్టార్ ఇప్పుడు మరో హారర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ వెబ్ సిరీస్ ని ప్రముఖ బుల్లితెర యాంకర్, డైరెక్టర్ ఓంకార్ తెరకెక్కించడం విశేషం.


ఒకప్పుడు బుల్లితెరపై టీవీ రియాలిటీ షోస్, డాన్స్ షోలతో ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఓంకార్ 'రాజు గారి గది' సినిమాతో డైరెక్టర్ గా మారారు. ఆ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత సమంత, నాగార్జునతో కలిసి 'రాజు గారి గది 2', తన తమ్ముడు అశ్విన్ బాబుతో 'రాజుగారిగది 3' వంటి సినిమాలను తెరకెక్కించారు. వీటికి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. చివరగా 2019లో 'రాజు గారి గది 3' తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఓంకార్, ఆ తర్వాత మళ్ళీ దర్శకత్వం వైపు వెళ్లలేదు. డైరెక్షన్ నుంచి బ్రేక్ తీసుకొని మళ్లీ బుల్లితెరపై డాన్స్ ఐకాన్, సిక్స్త్ సెన్స్, కామెడీ స్టార్స్ ధమాకా అవ్వండి టీవీ రియాలిటీ షోస్ కి క్రియేటర్ గా, హోస్ట్గా వ్యవహరించారు. అయితే ఇప్పుడు డిజిటల్ రంగంలోకి అడుగు పెడుతూ 'మాన్షన్ 24' అనే హారర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు.


కోలీవుడ్ ప్రముఖ నటి వరలక్ష్మి శరత్ కుమార్ ఈ వెబ్ సిరీస్ లో లీడ్ రోల్ ప్లే చేస్తోంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్ ని కూడా విడుదల చేశారు. వరలక్ష్మి తో పాటు మరికొంతమంది ఈ వెబ్ సిరీస్ లో నటిస్తుండగా, తాజాగా ఈ వెబ్ సిరీస్ నుంచి తమిళ సీనియర్ నటుడు సత్యరాజ్ ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు. ఇందులో డిఫరెంట్ లుక్ లో కనిపించారు సత్యరాజ్. కన్నీళ్లు పెట్టుకుంటూ దీనంగా చూస్తున్నట్లు ఆయన లుక్ ఉంది. అంతేకాదు ఆయన వెనకాల ఓ భవంతి కూడా కనిపిస్తుంది. దీన్ని బట్టి చూస్తే సత్యరాజ్ కూడా ఇందులో మరో మెయిన్ లీడ్ ప్లే చేస్తున్నట్లు స్పష్టం అవుతోంది.


డిస్నీ ప్లస్ హాట్ స్టార్ నిర్మాణంలో రూపొందిన ఈ హారర్ వెబ్ సిరీస్ ని త్వరలోనే విడుదల చేయనున్నారు. వరలక్ష్మి, సత్య రాజ్ లతో పాటు హీరోయిన్ బిందు మాధవి, నందు, బిగ్ బాస్ మానస్, అమర్దీప్ చౌదరి, అవికా గోర్ విద్యుల్లేఖ రామన్, జయ ప్రకాష్, రావు రమేష్, రాజీవ్ కనకాల ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఓంకార్ తెరకెక్కించిన 'రాజు గారి గది' సినిమా తరహాలోనే 'మ్యాన్షన్ 24' వెబ్ సిరీస్ ఉంటుందట. ఓ పాడుబడ్డ భవంతిలో కొంతమంది యువతీ, యువకులు చిక్కుకోవడం అక్కడ వాళ్లకు ఎదురైన పరిస్థితుల నేపథ్యంలో ఈ వెబ్ సిరీస్ ఉండనున్నట్లు సమాచారం.


Also Read : నువ్వేం చేయగలవు చెప్పు - 'ఉస్తాద్' దర్శకుడు హరీష్ శంకర్ స్ట్రాంగ్ కౌంటర్!



Join Us on Telegram: https://t.me/abpdesamofficial