Rajamouli About Bahubali Crown Of Blood: ‘బాహుబలి’.. తెలుగు సినిమా ఘనతకు ప్రపంచానికి చాటిచెప్పిన మూవీ ఇది. ఈ సినిమా కోసం మాహిష్మతి అనే ఒక రాజ్యాన్ని సృష్టించి ప్రేక్షకులు అందరికీ తన విజన్ ఎలా ఉంటుందో చూపించారు రాజమౌళి. పైగా కథను ఒక్క భాగంతో చెప్పడం కష్టమని రెండు భాగాలుగా విడుదల చేశారు. రాజమౌళి సృష్టించిన ఈ ట్రెండ్‌ను ఇప్పటికీ చాలామంది ఫిల్మ్ మేకర్స్ ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ‘బాహుబలి’ కథ.. యానిమేషన్ సిరీస్‌‌లాగా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమయ్యింది. ఈ సిరీస్ తెరకెక్కించడానికి అనుమతి ఇవ్వడానికి ఎంతగా ఆలోచించారో బయటపెట్టారు రాజమౌళి.


దూరం చేసుకోవడం కష్టం..


‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ అనే పేరుతో బాహుబలి కథను యానిమేషన్ సిరీస్ రూపంలో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు దర్శకుడు శరద్ దేవరాజన్. డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ అవ్వనున్న ఈ సిరీస్‌ ట్రైలర్ ఇప్పటికే విడుదలయ్యింది. మే 17న ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ హాట్‌స్టార్ సబ్‌స్క్రైబర్ల ముందుకు రానున్న సందర్భంగా టీమ్ అంతా ఒక ప్రెస్ మీట్‌ను ఏర్పాటు చేసింది. దానికి రాజమౌళిని కూడా ఆహ్వానించగా.. ముందుగా ‘బాహుబలి క్రౌన్ ఆఫ్ బ్లడ్’ ఐడియాతో తనను కలిసినప్పుడు ఎలా ఫీల్ అయ్యారో బయటపెట్టారు రాజమౌళి. ‘‘నన్ను నేను బాహుబలి నుంచి దూరం చేసుకొని శరద్‌కు ఇచ్చి ముందుకు తీసుకెళ్లు అని చెప్పడం నాకు చాలా కష్టమైన నిర్ణయం’’ అని చెప్పుకొచ్చారు జక్కన్న.


కష్టమైన నిర్ణయం..


‘‘మొదట్లో నా అనుమతి లేకుండా ఏదీ చేయనివ్వకూడదు అని మొండిగా ఉండాలనుకున్నాను. కానీ మెల్లగా దీనిని నేను వదిలేయాలి అని తెలుసుకున్నాను. కానీ దీనిని వదిలేసే ముందు అసలు మేము బాహుబలి ఎలా చేశామని వారికి వివరించాను. అందులోని పాత్రలు, కథ గురించి చెప్పాను. దీని చుట్టూ నీకు నచ్చిన కథ రాసుకో, నచ్చిన పాత్రలను క్రియేట్ చేసుకో కానీ బాహుబలి అనేదానికి ఒక ప్రత్యేకత ఉంది. అది ప్రపంచం మొత్తానికి, ముఖ్యంగా ఇండియన్ ప్రేక్షకులకు బాహుబలిని దగ్గర చేసింది అనే విషయాన్ని వాళ్లకి వివరించే ప్రయత్నం చేశాను. నాకు బాహుబలిలోని పాత్రలంటే ఎంత ఇష్టమో తను అర్థం చేసుకున్నాడు’’ అని రాజమౌళి అన్నారు.


యానిమేషన్‌లో దిట్ట..


ఇండియాలో యానిమేషన్ అనేది ఎక్కువ ఫేమస్ కాదని, ఇతర దేశాల్లో లాగానే ఇండియాలో కూడా యానిమేషన్‌ను ఫేమస్ చేయాలని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు రాజమౌళి. తను ఫిల్మ్ మేకింగ్‌లో దిట్ట అయినా కూడా.. యానిమేషన్, గేమింగ్ లాంటి వాటిలో దిట్ట కాదని, దానికోసం సరైన వ్యక్తులతో కలిసి పనిచేయడం ముఖ్యమని అన్నారు. అలా సరైన వ్యక్తులు దొరకడానికి చాలా సమయం పట్టిందని.. కానీ యానిమేషన్‌ను ఇండియన్ ప్రేక్షకులకు దగ్గర చేయాలనే శరద్ దేవరాజన్ విజన్ చాలా గొప్పది అని ప్రశంసించారు రాజమౌళి. ఇంతకు ముందు కూడా ‘ది లెజెండ్ ఆఫ్ హనుమాన్’ అనే యానిమేషన్ సిరీస్‌తో ప్రేక్షకులను మెప్పించారు శరద్.



Also Read: ‘పుష్ప’ నన్ను ఎక్కడికో తీసుకెళ్తుందని అనుకోవడం లేదు, నా బలం మలయాళం సినిమా - ఫాహద్ ఫాజిల్