జర్నలిస్టుగా కెరీర్ స్టార్ట్ చేసి... ఆ తర్వాత తెలుగు చిత్రసీమలో లిరిసిస్టుగా, దర్శక నిర్మాతలుగా సక్సెస్ అయిన వ్యక్తులు ఉన్నారు. ఇప్పుడు ఆ లిస్టులో ఆదిత్య దేవులపల్లి (Aditya Devulapally) చేరారు. దొర సాయి తేజ (Dora Sai Teja) హీరోగా నటించిన చాయ్ షాట్స్ (Chai Shots) ఒరిజినల్ వర్టికల్ సిరీస్ 'దందా' (Dhandha Series)కు దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సిరీస్ ట్రెండింగ్ లిస్టులో ఉంది. 'దందా' సక్సెస్ నేపథ్యంలో ఆదిత్య దేవులపల్లి చెప్పిన విషయాలు...
ఇంజినీరింగ్ వదిలేసి జర్నలిజంలోకి!చదువులో నేను టాపర్. అయితే చిన్నప్పట్నుంచి సినిమాలంటే పిచ్చి. అందుకే, ఇంజనీరింగ్ మధ్యలో వదిలేశా. ఇంటిలో సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ గురించి చెప్పడంతో చిన్న కెమెరా కొన్నారు. ఆ తర్వాత సెయింట్ మేరీస్ కాలేజీలో మాస్ కమ్యూనికేషన్ చేశా. ఫోటోగ్రఫీ నేర్చుకున్నాను. మా ప్రొఫెసర్ అమృత్ సార్ వల్ల ఫ్రెంచ్, ఇంగ్లీష్ సహా వరల్డ్ సినిమాలు చూశా. మాస్ కామ్ చదివాకా జర్నలిజంలోకి వచ్చాను. అప్పుడే 'ఛాయ్ బిస్కెట్' అనురాగ్ అన్న పరిచయం అయ్యారు.
28 ఏళ్ళకు దర్శకుడు అవ్వాలనుకున్నా!నేను 28 ఏళ్ళకు డైరెక్టర్ అవ్వాలనుకునేవాడిని. ఇప్పుడు అయ్యాను. అనురాగ్ అన్నకు మొదట నేనొక వయలెంట్ కథ చెప్పా. ఆయనకు నచ్చింది. కానీ, మన తెలుగులో ఇటువంటి కథను తీసే ధైర్యం ఎవరూ చేయరని చెప్పారు. ఆ తర్వాత కొన్ని రోజులకు 'ఛాయ్ షాట్స్' ప్రారంభించి క్రియేటివ్ ప్రొడ్యూసర్గా చేరమన్నారు. పలు కథలు వినడంతో పాటు కొన్ని షోస్ చేశాక... రొటీన్గా అనిపించింది. అనురాగ్ అన్న దగ్గరకు వెళ్ళి ''క్రేజీ షో డైరెక్ట్ చేసి చూపిస్తా" అని పట్టుబట్టి మరీ 'దందా' కథ చెప్పాను. 'ఛాయ్ షాట్స్'లో నా ప్రయాణం అలా మొదలైంది.
సెలబ్రిటీలు ఫోన్ చేసి అభినందిస్తున్నారు!'దందా' కథను విజయ్ కుమార్ రాశారు. అందులో కొన్ని లోపాలు ఉండటంతో నేను రీ రైట్ చేశా. ప్రధాన పాత్రల నేపథ్యాలు మార్చడంతో పాటు 40 శాతం మార్పులు చేశా. ఆ తర్వాత దొర సాయి తేజ 'దందా'లో అడుగు పెట్టారు. అయితే... అతని చుట్టూ కొన్ని వివాదాలు ఉండటం వల్ల నాకు కొన్ని అనుమానాలు ఉండేవి. అతడిని కలిశాక దొర సాయి తేజ ఎంత మంచి వ్యక్తో అర్థమైంది. మేమంతా ఓ టీంగా సిరీస్ చేశాం. రివ్యూస్ అన్నీ బావున్నాయి. మేకింగ్ స్టైల్, కంటెంట్ గురించి ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తుంటే సంతోషంగా ఉంది. సెలబ్రిటీలు సైతం అనురాగ్ అన్నకి ఫోన్ చేసి సిరీస్ బావుందని అభినందిస్తున్నారు.
వర్టికల్ కంటెంట్ కోసం రీసెర్చ్ చేశా!ఓటీటీ ఆడియన్స్ మైక్రో డ్రామాలను చూస్తున్నారు. సినిమాల్లో ఇంటర్వెల్, క్లైమాక్స్ వంటి బ్యాంగ్స్ హై ఇస్తాయి. అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. కానీ వర్టికల్ సిరీస్లో ప్రతి సీన్ క్లైమాక్స్లా ఉండాలి. మెయిన్ స్ట్రీమ్ సినిమాలు తీయడం కంటే మైక్రో డ్రామాలు తీయడం చాలా కష్టం. మొదటి క్షణం నుంచి ఆడియన్స్ను హుక్ చేయాలి. అందులో సక్సెస్ కావడం గర్వంగా ఉంది. నాకు ఇదొక ఛాలెంజింగ్ & ఎగ్జైటింగ్ జర్నీ.
రాజమౌళి గారిని అలా వాడేశా... అది మేజిక్!రాజమౌళి గారు లెజెండ్. హి ఈజ్ ది GOAT. నా దర్శకత్వంలో ఆయన భాగం కావాలనేది నా కోరిక. అయితే ఆయన్ను సంప్రదించే స్థాయి నాకు లేదు. అందుకే సైబర్ క్రైమ్పై ఆయన చేసిన వీడియోను సిరీస్లో వాడుకున్నాం. నేను 'దందా'ను ఎంటర్టైన్మెంట్ మైండ్సెట్తో తీశా. అందులో సమాజానికి ఉపయోగపడే చిన్న మెసేజ్ ఉంది. సైబర్ క్రైమ్స్ చేసే నేరగాళ్లు వేల కోట్లు కొల్లగొడుతున్నారు. వాళ్లను పట్టుకోలేకపోతున్నాం. చిన్న ఓటీపీతో లక్షలు కాజేస్తున్నారు. దానికి అవగాహన తీసుకు రావాలని కథను డిజైన్ చేశా.
