గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) వెబ్ సిరీస్ చేయనున్నారా? ఆయనతో 'ఆహా' కోసం వెబ్ సిరీస్ చేసే ప్రయత్నాలు షురూ చేశారా? ఆ దిశగా ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) ప్లాన్ చేస్తున్నారా? అంటే... 'అవును' అనే సమాధానం వినబడుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే... 


తెలుగు చిత్రసీమలోని నలుగురు అగ్ర కథానాయకులలో బాలకృష్ణ ఒకరు. ఆయన కంటే ముందు మెగాస్టార్ చిరంజీవి, కింగ్ అక్కినేని నాగార్జున టీవీ షోలు హోస్ట్ చేశారు. 'ఎవరు మీలో కోటీశ్వరుడు', 'బిగ్ బాస్' కార్యక్రమాలతో నాగార్జున విజయాలు అందుకున్నారు. అయితే, బాలకృష్ణ 'అన్‌స్టాపబుల్' అన్నిటికి కంటే ఎక్కువ సక్సెస్ అయ్యింది. టాక్ షోలలో సరికొత్త చరిత్ర సృష్టించింది. రికార్డులు క్రియేట్ చేసింది.
 
బాలకృష్ణను డిజిటల్ స్క్రీన్ మీదకు తీసుకు రావడం వెనుక ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ కృషి ఉంది. 'ఆహా' ఓటీటీలో ఆయనకు భాగస్వామ్యం ఉంది. నందమూరి కుటుంబంలో పరిచయాలు ఉన్నాయి. బాలకృష్ణను ఒప్పించిన వ్యక్తుల్లో ఆయన కూడా ఒకరు. ఇప్పుడు బాలకృష్ణతో వెబ్ సిరీస్ చేయిస్తే బావుంటుందనే ఆలోచన కూడా ఆయనదే అట. అల్లు అరవింద్ ప్రయత్నాలు ఫలిస్తే బాలకృష్ణను త్వరలో వెబ్ సిరీస్ లో చూడవచ్చు.


'ఆహా' ఓటీటీకి ఎక్కువ పేరు, సబ్‌స్క్రిప్షన్‌లు తీసుకు వచ్చిన షోగా 'అన్‌స్టాపబుల్' నిలిచింది. ఫస్ట్ సీజన్ సూపర్ డూపర్ సక్సెస్ అయ్యింది. ఆ స్థాయిలో సెకండ్ సీజన్ వీక్షకులను ఆకట్టుకోలేదు. నారా చంద్రబాబు నాయుడు, లోకేష్, ప్రభాస్, పవన్ కళ్యాణ్, కిరణ్ కుమార్ రెడ్డి, జయసుధ, జయప్రద వంటి రాజకీయ, సినిమా తారలను షోకి తీసుకు వచ్చారు. యువ హీరోలు శర్వానంద్, అడివి శేష్, విశ్వక్ సేన్, సిద్ధూ జొన్నలగడ్డ వచ్చిన ఎపిసోడ్స్ కూడా ఆకట్టుకున్నాయి. అందుకని, మరోసారి బాలకృష్ణతో భారీ అండ్ క్రేజీ వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తోంది 'ఆహా'


అనిల్ రావిపూడి దర్శకత్వంలో...  
ప్రస్తుతం బాలకృష్ణ చేస్తున్న సినిమాలకు వస్తే... అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. దాని తర్వాత ఏదీ ఇంకా కమిట్ కాలేదు. కానీ, ఎన్నికలకు ముందు రాజకీయ నేపథ్యంలో ఓ సినిమా చేసే అవకాశాలు ఉన్నాయని ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినబడుతున్న మాట. బోయపాటి శ్రీను దర్శకత్వంలో ఆ సినిమా ఉండొచ్చు. లేదంటే సంక్రాంతికి బాలకృష్ణతో 'వీర సింహా రెడ్డి'తో విజయం అందుకున్న గోపీచంద్ మలినేని పేరు దర్శకుడిగా మరో ఆప్షన్. 


దసరాకు ఎన్.బి.కె 108!
బాలకృష్ణ కథానాయకుడిగా యువ దర్శకుడు అనిల్ రావిపూడి వాణిజ్య హంగులతో కూడిన వైవిధ్యమైన కథాంశంతో ఓ సినిమా తెరకెక్కిస్తున్నారు. ఇందులో కాజల్ అగర్వాల్ (Kajal Aggarwal) కథానాయిక. బాలయ్యకు జోడీగా కనిపించనున్నారు. యువ కథానాయిక శ్రీ లీల కీలక పాత్ర చేస్తున్నారు. ఆమెది కూతురు తరహా పాత్ర. ఈ సినిమాను ఈ ఏడాది విజయ దశమికి థియేటర్లలోకి తీసుకు రావాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతానికి విజయ దశమి బరిలో మరో సినిమా లేదు.


Also Read మోహన్ బాబు ఆశీసులతో మనోజ్ - మౌనిక పెళ్లి, పుకార్లకు చెక్ పెట్టిన మంచు ఫ్యామిలీ