కరోనా కాలంలో థియేటర్లన్నీ మూతపడ్డ సంగతి తెలిసిందే. ఇప్పుడిప్పుడే థియేటర్లు తెరుచుకుంటున్నాయి. దీంతో కొన్ని సినిమాలు థియేటర్లో విడుదల కావడానికి సిద్ధమవుతున్నాయి. అందులో యంగ్ హీరో సత్యదేవ్ సినిమా కూడా ఉంది. ఆయన ప్రధాన పాత్రలో శరణ్‌ కొప్పిశెట్టి తెరకెక్కించిన నూతన చిత్రం 'తిమ్మరుసు'. ప్రియాంక జవాల్కర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. 

ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్, మ్యాంగో, ఎస్ ఒరిజినల్స్ బ్యానర్లపై మహేష్ కోనేరు, సృజన్‌ ఎరబోలు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. జూలై 30న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది. దీంతో సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు ఎన్టీఆర్‌ చేతుల మీదుగా సినిమా ట్రైలర్‌ ని విడుదల చేయించారు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ టీమ్ కు శుభాకాంక్షలు చెప్పారు. కోర్టు నేపథ్యంలో సాగే ఈ సినిమా ట్రైలర్ ను ఎంతో ఆసక్తికరంగా కట్ చేశారు. 

''డిఫెన్స్ లాయర్ రామచంద్ర.. తెలివైన వాడే కానీ ప్రాక్టికల్ గయ్ కాదు.. ఎవరైనా కేసు గెలిస్తే బైకు నుంచి కారుకు వెళ్తారు.. కానీ రామ్.. కారు నుంచి బైక్‌కు వచ్చాడు'' అంటూ సత్యదేవ్ ను ఉద్దేశిస్తూ అతడి క్యారెక్టర్ ఎలా ఉండబోతుందో హీరోయిన్ చెప్పేసింది. ''గుర్రం పని గుర్రం చేయాలి.. గాడిద పని గాడిద చేయాలి..'' అని ఆమె చెప్పే మరో డైలాగ్‌ అదిరిపోయింది. 

''ఎనిమిదేళ్ల క్రితం క్లోజ్ అయిన కేసును నువ్ ఓపెన్ చేయొచ్చు.. ఏడాది క్రితం క్లోజ్ అయిన కేసును నేను ఓపెన్ చేయకూడదా..?'' అని పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో ఉన్న అజయ్.. సత్యదేవ్ ను ప్రశ్నించడం చూస్తుంటే.. ఓ భయంకరమైన హత్య కేసును వాదించడానికి డిఫెన్స్ లాయర్ చేసే ప్రయత్నాల నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కించారని తెలుస్తోంది. 

'నీ ముందు ఉన్నది వాలి అని మర్చిపోకు.. నీ ఎదురుగా ఉండే సగం బలం లాగుతా లాయర్‌ రామచంద్రా' అంటూ సత్యదేవ్‌ కు వార్నింగ్‌ ఇస్తే.. 'నువ్వు సగం బలం లాక్కునే వాలి అయితే, నేను దండేసి దండించే రాముడిలాంటి వాడిని' అంటూ అంతే దీటుగా సత్యదేవ్‌ చెప్పిన పంచ్‌ డైలాగ్‌ ఓ రేంజ్ లో ఉంది. ఇక ట్రైలర్ లో సత్యదేవ్ యాక్షన్ సీక్వెన్స్ లు కూడా అదిరిపోయాయి. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కారణంగా సన్నివేశాలు మరింత బాగా ఎలివేట్ అయ్యాయి. 

ఈ సినిమాలో బ్రహ్మాజీ, రవిబాబు,అజయ్‌, ప్రవీణ్‌, ఆదర్శ్‌ బాలకృష్ణ, వైవా హర్ష తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం: శ్రీ చరణ్‌ పాకాల, ఛాయాగ్రహణం: అప్పూ ప్రభాకర్‌.