సినీనటి, రాకీయనాయకురాలు ఖుష్భూ, ప్రముఖ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియాపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎయిర్ పోర్టులో తనకు కనీస సౌకర్యాలు కల్పించడంతో విఫలం అయ్యారంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు. ఖుష్భూ కాలికి ఇటీవల గాయం అయ్యింది. ఇప్పటికీ గాయం పూర్తి స్థాయిలో నయం కాలేదు. అయినా, సినిమా, పార్టీ వ్యవహారాల నేపథ్యంలో నిత్యం ప్రయాణాలు కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా తను వేరే రాష్ట్రానికి వెళ్లాల్సి ఉండటంతో చెన్నై ఎయిర్ పోర్టుకు వెళ్లారు. అక్కడే తను అసలు సమస్య మొదలయ్యింది.
కనీసం వీల్ చైర్ లేదా?-ఖుష్బూ ఆగ్రహం
గాలి గాయంతోనే ఎయిర్ పోర్టులోకి వెళ్లారు. తనకు వీల్ చైర్ కావాలని ఎయిర్ ఇండియా సిబ్బందికి చెప్పారు. కానీ, అక్కడ వీల్ చైర్ అందుబాటులో లేదు. దీంతో చాలా సేపు ఆమె ఇబ్బంది పడ్డారు. అక్కడి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అంతటితో ఆగకుండా ట్విట్టర్ వేదికగా తనకు జరిగిన చేదు అనుభవాన్ని వివరించారు. ఎయిర్ ఇండియా సంస్థకు కనీసం వీల్ చైర్ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ఘాటుగా ప్రశ్నించారు.
ఖుష్బూకు క్షమాపణలు చెప్పిన ఎయిర్ ఇండియా
అక్కడ ఖుష్బూకు వీల్చైర్ అందుబాటులో లేదు. దీంతో తీవ్ర ఇబ్బంది పడ్డారు. తన అసంతృప్తిని ట్విట్టర్ ద్వారా వ్యక్తం చేశారు. అందులో ఎయిర్ ఇండియా సంస్థకు వీల్చైర్ ఏర్పాటు చేసే స్థోమత లేదా? అంటూ ప్రశ్నించారు. “ఎయిర్ ఇండియా దగ్గర బేసిక్ వీల్ చైర్ లేదా? నేను కాలి నొప్పితో వీల్ చైర్ కోసం సుమారు అరగంట పాటు వెయిట్ చేశాను. ఆ తర్వాత వేరే విమాన సంస్థ నుంచి వీల్ చైర్ తీసుకొచ్చి తనను లోపలికి తీసుకెళ్లారు. ఇప్పటికైనా సమస్యను పరిష్కరిస్తారని భావిస్తున్నాను” అంటూ ట్వీట్ చేశారు. ఖుష్భూ కు జరిగిన ఇబ్బందికి చింతిస్తున్నట్లు ఎయిర్ ఇండియా ప్రకటించింది. ఈ సంఘటనపై నటి కుష్బూకు క్షమాపణ తెలుపుతూ ట్విట్ చేసింది. ‘‘మీకు జరిగిన అసౌకర్యానికి చింతిస్తున్నాం. ఈ విషయాన్ని చెన్నై విమాన నిర్వాహకులకు తెలియజేస్తాం’’ అని వెల్లడించింది.
వరుస వివాదాల్లో ఎయిర్ ఇండియా
గత కొంత కాలంగా ఎయిర్ ఇండియా సంస్థ పలు వివాదాల్లో చిక్కుకుంటోంది. ప్రయాణికురాలిపై తోటి ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన సంఘటన సంచలనం కలిగించింది. గత ఏడాది నవంబర్ 26న నూయ్కార్ నుంచి న్యూఢిల్లీ వస్తున్న ఎయిర్ ఇండియా విమానంలో శంకర్ మిశ్రా తనపై మూత్ర విసర్జన చేశాడని బాధిత మహిళ ఫిర్యాదు చేసింది. ఈ కేసులో ఎయిర్ ఇండియాకు రూ.30 లక్షల జరిమానా విధించింది డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ). గత ఏడాది పారిస్- ఢిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్ట్ చేయనందుకుగానూ ఎయిర్ ఇండియాకు డిజిసిఎ రూ.10 లక్షల జరిమానా విధించింది. డిసెంబరు 6న ఓ ప్రయాణీకుడు మద్యం మత్తులో వాష్ రూమ్ లో పొగతాగుతూ విమాన సిబ్బందికి పట్టుబడ్డాడు. ఈ నేపథ్యంలో ఎయిర్ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా పడింది. వారం వ్యవధిలోనే ఎయిర్ ఇండియా రెండుసార్లు జరిమానా కట్టాల్సి వచ్చింది. తాజాగా ఎయిర్ ఇండియా విమానంలో వడ్డించిన భోజనంలో రాళ్లు వచ్చాయంటూ ఓ మహిళా ప్రయాణికురాలు ఫిర్యాదు చేశారు. అందుకు సంబంధించిన ఫొటోలను ట్విటర్లో షేర్ చేస్తూ ఎయిర్లైన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జనవరి 8న ఈ ఘటన జరిగింది.