Netflix CEO Meets Mahesh Babu: ప్రముఖ ఓటీటీ ఫ్లాట్ ఫారమ్ నెట్ ఫ్లిక్స్ టాలీవుడ్ మీద ఫుల్ ఫోకస్ పెట్టింది. రోజు రోజుకు తెలుగు సినిమా స్థాయి ప్రపంచ వ్యాప్తంగా అవుతున్న నేపథ్యంలో ఆ క్రేజ్ ను తనకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.ఇందులో భాగంగా ఆ సంస్థ సీఈవో హైదరాబాద్ లో పర్యటించారు. మూడు రోజుల పాటు టాలీవుడ్ స్టార్ హీరోలను కలిశారు. ఫ్యూచర్ ప్రాజెక్టుల గురించి వారితో చర్చించారు.


మహేష్ బాబును కలిసిన నెట్ ఫ్లిక్స్ సీఈవో


తాజాగా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబును కలిశారు నెట్ ఫ్లిక్స్ సీఈవో టెడ్ సరండోస్. మహేష్ తదుపరి ప్రాజెక్టుల గురించి చర్చించారు. తమ సంస్థ చేపట్టబోయే ప్రాజెక్టుల గురించి మాట్లాడారు. అనంతరం టెడ్ మహేష్ తో సెల్ఫీ తీసుకున్నారు. ఈ విషయాన్ని మహేష్ బాబు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. ‘కాఫీ అండ్ చిల్’ అంటూ నెట్ ఫ్లిక్స్ సీఈవో కలిసి దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఎంతో దూరదృష్టి కలిసిన సరండోస్ తో పాటు అతడి టీమ్ ను కలవడం సంతోషంగా ఉందన్నారు. వారితో కలిసి ఎంటర్ టైన్మెంట్ కు సంబంధించిన భవిష్యత్ ప్రణాళికల గురించి చర్చించినట్లు వెల్లడించారు. ఈ భేటీలో ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ కూడా పాల్గొన్నారు.  






తొలుత మెగాస్టార్ తో సమావేశం


తొలిసారి హైదరాబాద్ కు వచ్చిన సరండోస్ మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు. ఆ సంస్థ ప్రతినిధులతో కలిసి చిరంజీవి, రామ్ చరణ్ ను మీట్ అయ్యారు. ఈ భేటీలో సాయి ధరమ్ తేజ్, వైష్ణవ్ తేజ్ పాల్గొన్నారు. వారితో కలిసి నెట్ ఫ్లిక్స్ చేపట్టే తదుపరి వినోదాత్మక ప్రాజెక్టుల గురించి మాట్లాడినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా ‘ఆర్ఆర్ఆర్’ సినిమాకు నెట్ ఫ్లిక్స్ లో ప్రపంచవ్యాప్తంగా దక్కిన ఆదరణ గురించి ప్రధానంగా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ భేటీ అనంతరం అల్లు ఫ్యామిలీతో కూడా సరండోస్ సమావేశం అయ్యారు. అల్లు అరవింద్, అల్లు అర్జున్ తో పాటు ‘పుష్ప’ దర్శకుడు సుకుమార్ సైతం ఈ భేటీలో పాల్గొన్నారు.   


జూనియర్ ఎన్టీఆర్ ను కలిసిన సరండోస్


ఆ తర్వాత టెడ్ జూనియర్ ఎన్టీఆర్ ను కలిశారు. జూనియర్ నెట్ ఫ్లిక్స్ టీమ్ కు విందు ఏర్పాటు చేశారు. ‘ఆర్ఆర్ఆర్’ స్టార్ ను టెడ్ ఈ సందర్భంగా అభినందించారు. ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో ఎన్టీఆర్ పాత్రను కొనియాడారు. అనంతరం జూనియర్ తో పలు అంశాల గురించి మాట్లాడారు. నెట్ ఫ్లిక్స్ కు సంబంధించి ఆయన అభిప్రాయాలను కూడా అడిగి తెలుసుకున్నారు. ఈ సమావేశంలో ఎన్టీఆర్ సోదరుడు కల్యాణ్ రామ్, ప్రముఖ దర్శకుడు కొరటాల శివ కూడా పాల్గొన్నారు. ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీతో పాటు దగ్గుపాటు ఫ్యామిలీని కలిశారు సరండోస్. ప్రముఖ టాలీవుడ్ నిర్మాత సురేష్ బాబు, హీరోలు వెంకటేష్, రానాను కలిశారు. అటు అక్కినేని హీరో నాగ చైతన్యతోనూ చర్చలు జరిపారు. దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళితో పాటు ప్రముఖ నిర్మాత శోభు యార్లగడ్డను కూడా కలిశారు.


హైదరాబాద్ పర్యటన గురించి సరండోస్ ఏమన్నారంటే?


మూడు రోజుల హైదరాబాద్ పర్యటన ముగిసిన తర్వాత సరండోస్ ఇన్ స్టాలో ఓ పోస్టు పెట్టారు. తెలుగు సినిమా లెజెండ్స్ ను కలవడం సంతోషంగా ఉందని వెల్లడించారు.  గత కొంతకాలంగా నెట్ ఫ్లిక్స్ భారత్ లో తన మార్కెట్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తెలుగు సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖులను కలిశారు సరండోస్.  నెట్ ఫ్లిక్స్ నిర్మించబోయే భారీ బడ్జెట్ సినిమాలు, వెబ్ సిరీస్ లో టాలీవుడ్ స్టార్స్ ను తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు.  అటు తమిళ్ సహా పలు పరిశ్రమలకు చెందిన సినీ ప్రముఖులను కూడా ఆయన కలిసే అవకాశం ఉంది.   






Read Also: ఆ ప్రేమకు రష్మిక అర్హురాలు - రాహుల్ రవీంద్రన్ ఏమన్నారో చూశారా?