టాలీవుడ్‌లో మంచి కామెడీ టైమింగ్ ఉన్న హీరోల్లో నవీన్ పోలిశెట్టి ఒకరు. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ’, ‘జాతిరత్నాలు’ సినిమాలతో వరుసగా రెండు హిట్లు అందుకున్న నవీన్ తన మూడో సినిమాను యూవీ క్రియేషన్స్ బ్యానర్‌లో చేస్తున్నారు. ఇందులో ప్రముఖ హీరోయిన్ అనుష్క హీరోయిన్‌గా నటిస్తున్నారు.


ఇప్పుడు ఈ సినిమాలో నవీన్ పోలిశెట్టి ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను నిర్మాతలు విడుదల చేశారు. ఈ చిత్రానికి ఇంకా పేరును నిర్ణయించలేదు. అయితే ‘మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి’ అనే పేరు ఎప్పట్నుంచో రూమర్స్‌లో ఉంది. దీనికి తగ్గట్లే ఈ సినిమాలో సిద్ధు పోలిశెట్టి అనే పాత్రలో నవీన్ కనిపించనున్నాడని ఈ పోస్టర్ ద్వారా రివీల్ చేశారు. ఇందులో స్టాండప్ కమెడియన్ పాత్రను నవీన్ పోలిశెట్టి పోషిస్తున్నారు. అనుష్క ఇందులో అన్విత రవళి శెట్టి అనే పాత్రలో కనిపిస్తుంది. తాను చెఫ్ పాత్రను పోషిస్తుంది.


‘నిశ్శబ్దం’ తర్వాత అనుష్క నటిస్తున్న సినిమా ఇదే. అలాగే జాతిరత్నాలు బ్లాక్‌బస్టర్ తర్వాత నవీన్ నటిస్తున్న సినిమా కూడా ఇదే కాబట్టి దీనిపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కొత్త దర్శకుడు పి.మహేష్ బాబు దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. రథన్ దీనికి సంగీతం అందిస్తున్నారు.


అనుష్కకు 48వ చిత్రమిది. 'మిర్చి', 'భాగమతి' విజయాల తర్వాత యూవీ క్రియేషన్స్ సంస్థలో ఆమె నటిస్తున్న హ్యాట్రిక్ సినిమా. ఇందులో ఆమె సరికొత్త లుక్ లో కనిపించనున్నారు.  తెలుగు, కన్నడ, తమిళం, మలయాళం మొత్తం నాలుగు దక్షిణాది భాషల్లో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు.


ఇదొక రొమాంటిక్ లవ్ స్టోరీ అని సమాచారం. వయసులో దాదాపు ఇరవై ఏళ్లు గ్యాప్ ఉన్న ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ పుట్టడం, ఆ తర్వాత వాళ్లు ఎదుర్కొనే పరిమాణాల ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. యంగ్ హీరో నవీన్ పోలిశెట్టికి కెరీర్ ఆరంభంలోనే అనుష్క లాంటి హీరోయిన్ తో కలిసి నటించే ఛాన్స్ రావడమంటే విశేషమనే చెప్పాలి. పైగా సినిమాలో ఇద్దరి రోల్స్ చాలా కొత్తగా ఉంటాయట. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.