సిద్దిపేట జిల్లాలో ఓ జడ్పీటీసీ మెంబర్ దారుణ హత్యకు గురయ్యారు. ఉదయాన్నే వాకింగ్ కు వెళ్లిన సందర్భంలో ఆయనపై దాడి చేసి గుర్తు తెలియని వ్యక్తులు చంపేశారు. ఈ ఘటన చేర్యాల మండలం గుర్జకుంటలో జరిగింది. చేర్యాల జెడ్పీటీసీ మెంబర్ అయిన శెట్టె మల్లేశం అనే వ్యక్తిపై గుర్తు తెలియని వ్యక్తులు సోమవారం (డిసెంబర్ 26) ఉదయం దాడికి పాల్పడ్డారు. వాకింగ్‌కు వెళ్లిన మల్లేశంపై గొడ్డళ్లు, కత్తులతో దాడి చేశారు. దీంతో బాధితుడి తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. రక్తపు మడుగులో పడి ఉన్న మల్లేశంను స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అపస్మారక స్థితిలో ఆయన్ని స్థానికులు మొదట సిద్దిపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అనంతరం అక్కడి నుంచి హైదరాబాద్‌లోని ఓ ప్రముఖ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. కానీ, అప్పటికే మల్లేశం మృతి చెందాడని డాక్టర్లు తెలిపారు.


గతంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ (టీఆర్ఎస్) తరఫున చేర్యాల జడ్పీటీసీ మెంబర్‌గా ఎన్నికయ్యారు. చేర్యాల పెద్దమ్మగడ్డ జడ్పీహెచ్‌ఎస్ స్కూలులో ఆయన చిన్న తనంలో చదువుకున్నారు. అయితే, వారి పదో తరగతి బ్యాచ్ మొత్తం ఆదివారం పూర్వవిద్యార్థుల సమ్మేళన కార్యక్రమం (గెట్ టు గెదర్) పెట్టుకున్నారు. కార్యక్రమం అనంతరం రాత్రి ఇంటికి వెళ్లి పడుకున్నారు. ఈ ఉదయం ఎప్పటిలాగే వాకింగ్‌కు వెళ్లారు. ఇంతలో గుర్జకుంటలోని చేర్యాల మార్గంలో కుప్పకూలి ఉండటాన్ని స్థానికులు గమనించారు. తలకు తీవ్ర గాయాలై రక్తపు మడుగులో ఉండటంతో స్థానికుల సహకారంతో కుటుంబ సభ్యులు సిద్దిపేటలోని ఓ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు హైదరాబాద్ లోని పెద్ద ఆస్పత్రికి తీసుకెళ్లాలని రిఫర్ చేశారు. మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలిస్తుండగా మధ్యలోనే చనిపోయారు. 


పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని ఘటన జరిగిన స్థలాన్ని క్షుణ్నంగా పరిశీలించి ఆధారాలను సేకరించారు. ఆయన ప్రమాదవశాత్తు చనిపోయారా లేదంటే ఎవరైనా హత్య చేశారా అనే కోణంలో విచారణ ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై అక్కడి ఎమ్మెల్యే ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి ఆరా తీశారు. ఆ ప్రాంతంలో భూమి సంబంధిత గొడవలు, రాజకీయ తగాదాలు జరుగుతున్నాయని స్థానికులు తెలిపారు. ఆ గొడవల్లో ఎవరైనా ప్రత్యర్థులు మల్లేశాన్ని హత్య చేశారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.