నేచురల్ స్టార్ నాని 'దసరా' అనే సినిమాలో నటిస్తోన్న సంగతి తెలిసిందే. శ్రీకాంత్ ఓదెల అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేస్తోన్న ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా కనిపించనుంది. గోదావరిఖని బొగ్గు గనుల నేపథ్యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ తెలంగాణ, పెద్దపల్లి జిల్లా, గోదావరిఖనిలో జరుగుతుంది. చిత్రీకరణలో భాగంగా నాని, కీర్తి సురేష్ పై భారీ స్థాయిలో పాటని షూట్ చేస్తున్నారు. 


ప్రేమ్ రక్షిత్ మాస్టర్ ఈ పాటకు కోరియోగ్రఫీ అందిస్తున్నారు. దాదాపు 500 మంది డ్యాన్సర్లతో ఈ పాటని గ్రాండ్ గా తెరకెక్కిస్తున్నారు. ఇంతమంది డాన్సర్స్ కోసం చిత్రబృందం గోదావరిఖని ప్రాంతంలో ఉన్న గవర్నమెంట్ గెస్ట్ హౌస్ లను, కొన్ని ప్రైవేట్ హాల్స్ ను, కళ్యాణమండపాలను బుక్ చేసింది. ఇది ఖర్చుతో కూడుకున్న పని మాత్రమే కాదు.. ఇంతమందిని మేనేజ్ చేయడమంటే చాలా శ్రమతో పడాల్సి వస్తుంది. అంత చిన్న సిటీలో ఇంత మందితో షూటింగ్ చేస్తోంది 'దసరా' టీమ్. ఆ ఊర్లో వారంతా ఒక్క ఫంక్షన్ హాల్ కూడా ఖాళీగా లేకపోవడంతో షాక్ అవుతున్నారు. 


ఈ సినిమాతో మాస్ హీరో ఇమేజ్ సంపాదించాలని చూస్తున్నాడు నాని. మరి ఆయన అనుకున్నట్లుగా మాస్ హిట్ అందుకుంటారేమో చూడాలి. ఇక ఈ సినిమాలో సముద్రఖని, సాయి కుమార్, జరీనా వాహబ్ లాంటి తారలు కీలకపాత్రల్లో కనిపించనున్నారు.  ఈ సినిమా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో విడుదల కానుంది. నాని నటించిన తొలి పాన్ ఇండియా చిత్రంగా రాబోతుంది. ప్రముఖ సంగీత దర్శకుడు సంతోష్ నారాయణన్ ఈ సినిమాకి మ్యూజిక్ అందించనున్నారు. సత్యన్ సూర్యన్ సినిమాటోగ్రఫర్‌, నవీన్ నూలి ఎడిటర్‌.


Also Read: 'బీస్ట్' సినిమా టికెట్స్ కొంటే పెట్రోల్ ఫ్రీ - ఎక్కడో తెలుసా?


Also Read: రాజమౌళి, నాగ చైతన్య వాడే ఈ కారు ప్రత్యేకతలు తెలుసా? ఆస్తులు అమ్మినా దీన్ని కొనలేం!