Unstoppable Talk Show: తెలుగు రాష్ట్రాల్లో మాంచి క్రేజ్ సంపాదించుకున్న టాక్ షోలలో 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే’ టాప్ ప్లేస్ లో ఉంటుంది. ఆహా ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అయ్యే ఈ షోకు నందమూరి నటసింహం బాలయ్య హోస్టుగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికే రెండు సీజన్లు సక్సెస్ ఫుల్ గా కంప్లీట్ చేసుకున్నది. సెలబ్రిటీలతో బాలయ్య చేసే సందడి ఫ్యాన్స్ ను ఓ రేంజిలో ఆకట్టుకుంది. ప్రభాస్, పవన్ కల్యాణ్ లాంటి స్టార్ హీరోలు ఈ షోలో పాల్గొనడంతో మరింత క్రేజ్ లభించింది. ప్రస్తుతం ఈ షో మూడో సీజన్ కొనసాగుతోంది. ఇప్పటికే ఈ సీజన్ లో ‘భగవంత్ కేసరి’ టీమ్ తో బాలయ్య సందడి చేశారు. లిమిటెడ్ ఎడిషన్ పేరుతో మొదలైన ఈ సీజన్ లో ఇప్పడు ‘యానిమల్’ టీమ్ సందడి చేయబోతున్నది. ఈ షోలో బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక మందన్నతో పాటు దర్శకుడు సందీప్ రెడ్డి వంగ పాల్గొంటున్నారు.


నవంబర్ 24న ‘యానిమల్’ టీమ్ ఎపిసోడ్ స్ట్రీమింగ్


తాజాగా ‘యానిమల్’ టీమ్ ఎపిసోడ్ కు సంబంధించి ‘ఆహా’ స్ట్రీమింగ్ డేట్ అనౌన్స్ చేసింది. నవంబర్ 24న ఈ ఎపిసోడ్ ప్రసారం కాబోతున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు ‘యానిమల్’ టీమ్ షోకు సంబంధించిన ప్రోమోను రిలీజ్ చేసింది. 'యానిమల్'  మూవీ ప్రమోషన్స్ లో భాగంగా రణబీర్ కపూర్, రష్మిక మందన, డైరెక్టర్ సందీప్ వంగా 'అన్ స్టాపబుల్ సీజన్ 3' లో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కొన్ని ఫోటోలు బయటకు వచ్చాయి. అందులో రణబీర్, బాలకృష్ణ ఇద్దరు ఒకే ఫ్రేమ్ లో కనిపించడం ఫ్యాన్స్ ని  ఆకట్టుకుంది. మొట్టమొదటిసారి ఓ బాలీవుడ్ హీరో బాలయ్య షోలో సందడి చేయడంతో ఆ ఎపిసోడ్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇక ఈ షోలో రణబీర్ కపూర్ బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్  "ఫ్లూటు జింక ముందు ఊదు, సింహం ముందు కాదు" అనే డైలాగ్ చెప్పి అలరించినట్లు తెలుస్తోంది.     






తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్న రణబీర్


అటు అర్జున్ రెడ్డి రీమేక్ ‘కబీర్ సింగ్’ తర్వాత సందీప్ రెడ్డి వంగ హిందీలో తెరకెక్కిస్తున్న రెండో చిత్రం ‘యానిమల్’. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై అంచనాలను భారీగా పెంచాయి. ఈ సినిమాలో రణబీర్ గతంలో ఎన్నడూ లేనంత మాస్ గా చూపించబోతున్నారు దర్శకుడు. ఈ సినిమాను హిందీతో పాటు తెలుగులోనూ విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలోనే చిత్రబృందం జోరుగా ప్రచార కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఇప్పటికే ‘బ్రహ్మాస్త’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన రణబీర్, ఈ సినిమాతో మరింత ఫ్యాన్ బేస్ పెంచుకోవాలని చూస్తున్నారు. హిందీతో పాటు తెలుగులోనూ ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవాలి భావిస్తున్నారు. ఈ మూవీలో రణబీర్ సరసన రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తుంది. బాలీవుడ్ సీనియర్ నటులు అనిల్ కపూర్, బాబీ డియోల్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. డిసెంబర్ 1న ఈ సినిమా విడుదల కానుంది.   


Read Also: గ్లామర్ రోల్స్ కోసం వెయిట్ చేస్తున్నా, నటి శివాని ఇంట్రెస్టింగ్ కామెంట్స్