‘వీరసింహారెడ్డి’ సినిమాతో సంక్రాంతి బరిలో దిగి అదిరిపోయే హిట్ కొట్టాడు నటసింహం నందమూరి బాలకృష్ణ. ఈ సినిమా  బాక్సాఫీస్ దగ్గర కలెక్షన్ల వర్షం కురిపించింది. ఇదే ఊపులో అనిల్ రావిపూడి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నారు. #NBK108 పేరుతో ఈ సినిమా తెరకెక్కుతోంది. తారకరత్న మరణం కారణంగా కొంత కాలంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడుతూ వస్తోంది. తాజాగా ఉగాది పండుగ నాడే బాలయ్య అభిమానులకు పండగ లాంటి అప్ డేట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను విడుదల చేసి అభిమానుల్లో ఆనందం నింపారు. “అన్న దిగిండు, ఈసారి మీ ఊహకు మించి” పోస్టు పెట్టారు.  ఈ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు చెప్పారు.






బాలయ్య అభిమానులకే పండగే పండుగ!


ఇక ఇప్పటికే #NBK108కు సంబంధించి ఓ షెడ్యూల్ కంప్లీట్ అయ్యింది. రెండో షెడ్యూల్ ఎప్పుడో మొదలు కావాల్సి ఉంది. అయితే, నందమూరి తారకర్న గుండెపోటుకు గురికావడం, ఆ తర్వాత చికిత్స పొందుతూ చనిపోవడంతో వాయిదా పడింది. కొంతకాలం పాటు షూటింగ్ కు విరామం ప్రకటించారు బాలయ్య. ఇప్పటికే సినిమాకు సంబంధించిన పలు కీలక సన్నివేశాలు, బాలయ్య లేకుండా చిత్రీకరిస్తున్నారు. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. బాలయ్య లుక్ రివీల్ చేశారు.


షూటింగ్ లో జాయిన్ అయిన కాజల్!


తాజాగా ఈ సినిమా షూటింగ్‌లో హీరోయిన్ కాజల్ అగర్వాల్ జాయిన్ అయింది. పెళ్లి తర్వాత కాజల్ పూర్తి స్థాయిలో హీరోయిన్ గా నటిస్తున్న సినిమా ఇదే. ఇప్పటికే కమల్ హాసన్, శంకర్ కాంబినేషన్‌లో చేస్తోన్న ‘ఇండియన్ 2’ మూవీలో నటిస్తోంది. ఇక ఈ సినిమాలో క్రేజీ హీరోయిన్ శ్రీలీల కూడా నటిస్తోంది. బాలయ్య, కాజల్ అగర్వాల్ కూతురిగా ఆమె కనిపించనుంది. ఇప్పటికే ఈమెపై కీలక సన్నివేశాలను షూట్ చేశారు. జైలుకు వెళ్లొచ్చిన తండ్రి కూతుళ్ల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతున్నట్లు తెలుస్తోంది.


తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న #NBK108


ఇప్పటి వరకు సీమాంధ్ర ప్రాంతంలో ఆయన సినిమాలు తెరకెక్కగా, తొలిసారి తెలంగాణ నేపథ్యంలో రూపొందిస్తున్నట్లు ఇప్పటికే దర్శకుడు అనిల్ రావిపూడి ప్రకటించారు.  ‘నిప్పురవ్వ’ సినిమా తర్వాత మరోసారి తెలంగాణ బేస్ గా జరిగే కథలో ఆయన నటించనున్నారు. ఈ సినిమాలో బాలయ్య గతంలో ఎప్పుడూ కనిపించని రీతిలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో తండ్రీ కూతుళ్ల మధ్య జరిగే సీన్లు పూర్తి స్థాయిలో ఎమోషన్స్ తో నిండి ఉంటాయట. ఇక ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. 


బాలయ్య తాజాగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే సినిమాను చేశారు. భారీ అంచనాల నడుమ సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇందులో శృతి హాసన్ హీరోయిన్ గా నటించగా, హనీరోజ్ కీలకపాత్ర పోషించింది.


Read Also:  ‘దసరా‘ దేశ యాత్ర - ముంబైలో వడాపావ్ తిన్న నాని!