టాలీవుడ్ మన్మథుడిగా గుర్తింపు పొందిన అక్కినేని నాగార్జున, టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ట్విట్టర్ వేదికగా చేసుకున్న ట్వీట్లు ఇండస్ట్రీలో తెగ వైరల్ అవుతున్నాయి. వీరిద్దరు కలిసి భారీ మల్టీ స్టారర్ మూవీ చేయబోతన్నారనే టాక్ జోరుగా సాగుతోంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వీరి ట్వీట్లు వైరల్ గా మారాయి. నాగార్జున, ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కిన తాజా సినిమా ది ఘోస్ట్. ఈ సినిమా ట్రైలర్ ను ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు మహేష్ బాబు. ఈ మూవీ మంచి హిట్ కొట్టాలని మహేష్ ఆకాంక్షించారు. సినిమా యూనిట్ కు శుభాకాంక్షలు చెప్పారు. 


మహేష్ ట్వీట్ కు నాగార్జున థ్యాంక్స్ చెప్పారు. పనిలో పనిగా ఆసక్తికర విషయాన్ని చెప్పారు. ‘‘29 ఏళ్ల కిందట వారసుడు సినిమాలో మీ నాన్న సూపర్ స్టార్ కృష్ణ నాతో కలిసి నటించినప్పుడు ఎంతో సంతోషించానని చెప్పారు. మనం కలిసి ఓ సినిమా ఎందుకు చేయకూడదు?’’ ప్రశ్నించారు. నాగార్జున ట్వీట్ కు మహేష్ బాబు స్పందించారు. ఇది చాలా సంతోషకరం. ఆ సమయం రావాలని ఆశిద్దాం’’ అన్నట్లుగా మహేష్ బాబు రిప్లై ఇచ్చారు. దీంతో నాగార్జున ప్రతిపాదనకు మహేష్ ఓకే చెప్పినట్లుగానే భావిస్తున్నారు జనాలు.


నాగార్జున, మహేష్ బాబు ట్విట్టర్ సంభాషణ మీద సినీ అభిమానులు రకరకాలుగా స్పందిస్తున్నారు. వీరిద్దరు కలిసి ఏదో ప్లాన్ చేస్తున్నారు అని ఒకరు కామెంట్ చేస్తే..  మీ కాంబినేషన్ కోసం ఎదురు చూస్తున్నాం అని మరికొందరు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఇద్దరు హీరోల అభిమానులు సైతం ఓ మల్టీ స్టారర్ సినిమా చేయాలని కోరుతున్నారు. మరోవైపు ఈ ఇద్దరు హీరోలు ఇప్పటికే మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు. వెంకటేష్ తో కలిసి మహేష్ బాబు సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా చేశారు. ప్రేక్షకులు ఈ సినిమాను బాగా ఆదరించారు. అటు నానితో కలిసి నాగార్జున దేవదాసు సినిమా చేశారు. ఈ సినిమా కూడా మంచి హిట్ అయ్యింది. త్వరలో నాగార్జున, మహేష్ బాబు సినిమా రావాలని సినీ అభిమానులు కోరుకుంటున్నారు.   


త్రివిక్రమ్ తో సినిమా చేస్తున్న మహేష్ బాబు.. ఈ సినిమా అయ్యాక రాజమౌళితో ఓ మూవీ చేయనున్నారు. ఈ సినిమాలో ఓ సీనియర్ హీరోకి సూట్ అయ్యే పాత్ర ఉందట. ఆ పాత్ర కోసం రాజమౌళి నాగార్జున వైపు మొగ్గుచూపుతున్నారట. అందులో భాగంగానే  బ్రహ్మాస్త్రం సినిమా ప్రమోషన్స్ కోసం నాగార్జున,  రాజమౌళి ఎక్కువగా కలిసి తిరుగుతున్నారట.  కలిసి చాలా ఎక్కువ తిరుగుతున్నారు. ఇప్పటికే మహేష్ సినిమా గురించి రాజమౌళి, నాగార్జున మధ్య చర్చ కూడా జరిగినట్లు తెలుస్తున్నది. 


అటు నాగార్జున గత కొంతకాలంగా మంచి హిట్ లేక ఇబ్బంది పడుతున్నాడు. ఆయన నటించిన బంగార్రాజు సినిమా బాగానే ఆడినా.. పెద్దగా వసూళ్లు సాధించలేదు. అంతకు ముందు నటించిన వైల్డ్ డాగ్ ప్లాప్ అయ్యింది. కానీ, ఓటీటీలో మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.  ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ది ఘోస్ట్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా మీదే ఆయన ఆశలు పెట్టుకున్నారు.  శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ ఎల్‌ పీ, నార్త్ స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్ కలిసి ఈ సినిమాను నిర్మిస్తున్నాయి. అక్టోబర్ 5న విడుదల చేస్తున్నారు.